Senthil Balaji: సెంథిల్ బాలాజీకి ఎదురుదెబ్బ...ఈడీ అరెస్టు చట్టబద్ధమేనన్న హైకోర్టు

ABN , First Publish Date - 2023-07-14T18:48:53+05:30 IST

మనీ లాండరింగ్ కేసులో తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీకి మద్రాసు హైకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో ఆయనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేయడం, అనంతరం ఆయనను జ్యుడిషియల్ కస్టడీకి దిగువ కోర్టు ఆదేశించడం చట్టబద్ధమేనని హైకోర్టు స్పష్టం చేసింది.

Senthil Balaji: సెంథిల్ బాలాజీకి ఎదురుదెబ్బ...ఈడీ అరెస్టు చట్టబద్ధమేనన్న హైకోర్టు

చెన్నై: మనీ లాండరింగ్ కేసులో తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీ (Senthil Balaji)కి మద్రాసు హైకోర్టులో (Madras High court) చుక్కెదురైంది. ఈ కేసులో ఆయనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్టు చేయడం, అనంతరం ఆయనను జ్యుడిషియల్ కస్టడీకి దిగువ కోర్టు ఆదేశించడం చట్టబద్ధమేనని హైకోర్టు స్పష్టం చేసింది.


మంత్రి అరెస్టు, కస్టడీపై సెంథిల్ భార్య మద్రాసు హైకోర్టులో వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై ఇంతకుముందు హైకోర్టు డివిజన్ బెంచ్ భిన్నమైన తీర్పులు వెలువరించింది. న్యాయమూర్తులు నిషా బాను, డి.భరత చక్రవర్తితో కూడిన డివిజన్ బెంచ్ విచారణ జరిపింది. కస్టడీని కోరే అధికారం ఈడీకి లేదని జస్టిస్ నిషా బాను తీర్పునివ్వగా, ఈ తీర్పుతో జస్టిస్ భరత చక్రవర్తి విభేదించారు. దీంతో దీనిపై మరోసారి విచారణ జరిపిన జస్టిస్ సీవీ కార్తికేయన్ ధర్మాసనం శుక్రవారంనాడు తీర్పు వెలువరించింది. సెంధిల్‌ను అరెస్టు చేయడం చట్టబద్ధమేనంటూ ఈడీకి అనుకూలంగా తీర్పునిచ్చింది.


రవాణాశాఖలో ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగుల నుంచి సెంథిల్ బాలాజీ భారీగా డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలపై జూన్ 15న ఆయనను ఈడీ అరెస్టు చేసింది. ఆ సమయంలో ఆయనకు ఛాతీ నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించారు. ఆయనను ప్రైవేటు ఆసుపత్రికి తరలించేందుకు కోర్టు అంగీకరించడంతో కావేరీ ఆసుపత్రిలో చేర్చి గుండె ఆపరేషన్ జరిపించారు. ఈడీ అరెస్టుతో ఆయన మంత్రిత్వ శాఖను రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. అయితే శాఖ లేని మంత్రి పదవిలో ఆయన కొనసాగుతున్నారు.

Updated Date - 2023-07-14T18:48:53+05:30 IST