TS Assembly Polls : ఎన్నికల ముందు ఈ పరిణామాలు దేనికి సంకేతం.. కేసీఆర్ మారిపోయారా.. భయపడ్డారా..!?

ABN , First Publish Date - 2023-08-26T20:23:09+05:30 IST

అవును.. గులాబీ బాస్, తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) చాలా మారిపోయారు..! ఎంతలా అంటే ఒకప్పటికీ.. ఇప్పటికీ పూర్తి భిన్నంగా మారారు..! గత రెండు దఫాలుగా గెలిచినప్పుడు సార్‌లో ఉండే ఫైర్ ఇప్పుడు కనిపించట్లేదు! గతంలో ఏదీ లెక్క చేయకుండా ‘చూస్కుందాం పో’ అన్నట్లుగా పరిస్థితులు ఉండేవి...

TS Assembly Polls : ఎన్నికల ముందు ఈ పరిణామాలు దేనికి సంకేతం.. కేసీఆర్ మారిపోయారా.. భయపడ్డారా..!?

అవును.. గులాబీ బాస్, తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) చాలా మారిపోయారు..! ఎంతలా అంటే ఒకప్పటికీ.. ఇప్పటికీ పూర్తి భిన్నంగా మారారు..! గత రెండు దఫాలుగా గెలిచినప్పుడు సార్‌లో ఉండే ఫైర్ ఇప్పుడు కనిపించట్లేదు! గతంలో ఏదీ లెక్క చేయకుండా ‘చూస్కుందాం పో’ అన్నట్లుగా పరిస్థితులు ఉండేవి. మరీ ముఖ్యంగా ఎవరైనా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినా, తిరుగుబాటు చేసినా.. ఎదురుతిరుగుతారనే ఆలోచన వచ్చినా సరే ఎంతటి పెద్ద నేతనైనా.. అంతకుమించి ఆర్థికంగా, రాజకీయంగా బలమున్నా సరే గడ్డిపోచలా తీసి పక్కనెట్టేసేవారు. కానీ ముచ్చటగా మూడోసారి ఎన్నికలు ఎదుర్కొంటున్న గులాబీ బాస్ జంకుతున్నారు.! కొందరు దీన్నే భయమని చెబుతుంటే.. ఇంకొందరేమో చిత్రవిచిత్రాలుగా అంటున్నారు. ఇంతకీ కేసీఆర్ ఇంతలా మారడానికి కారణాలేంటి..? సార్‌లో ఈ మార్పు చూసి బీఆర్ఎస్ పెద్దలు ఏమనుకుంటున్నారు..? నిజంగానే భయపడ్డారా..? ఇదంతా వ్యూహాత్మకమా..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలపై ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ (ABN-Andhrajyothy) ప్రత్యేక కథనం.


BRS-Car.jpg

ఇదీ అసలు కథ..!

ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత వరుసగా రెండుసార్లు బీఆర్ఎస్ (BRS) అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఎన్నికలు (TS Assembly Polls) ఎదుర్కొంటోంది అధికార పార్టీ. ఈసారి కూడా 100 నుంచి 105 స్థానాల వరకూ గెలుస్తామని కేసీఆర్ చాలా ధీమాగా చెబుతున్నారు. ఇక మంత్రులు, ముఖ్యనేతలు సైతం ఇవే మాటలు చెప్పుకుంటూ వస్తున్నారు. అందుకే వ్యూహాత్మకంగా అందరికంటే ముందుగా ఒకేసారి 115 మందితో కూడిన అభ్యర్థుల జాబితాను (BRS List) కూడా ప్రకటించేశారు. కేవలం నాలుగు నియోజకవర్గాలకు మాత్రమే పోటాపోటీగా అభ్యర్థులు ఉండటంతో కాస్త గ్యాప్ ఇచ్చారు. అటు కేసీఆర్ జాబితా ప్రకటిస్తారని ప్రచారం మొదలుకుని.. ప్రగతి భవన్ (Pragathi Bhavan) వేదికగా అభ్యర్థులు ప్రకటన వరకూ.. అంతెందుకు ఇవాళ్టి వరకూ తెలంగాణ రాజకీయాల్లో (TS Politics) ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఒకటా రెండా లెక్కలేనన్ని నియోజకవర్గాల్లో అసంతృప్తులు మీడియా ముందుకొచ్చి మాట్లాడేస్తున్నారు. అయినప్పటికీ సరే కేసీఆర్ ఎందుకో ఈసారి ఆ విషయాలపై స్పందించాలన్నా.. వారిపై చర్యలు తీసుకోవాలన్నా ఎందుకో ఆచితూచి అడుగులేస్తున్నారు.

KCR.jpg

సార్‌కు ఏమైందబ్బా..!?

  • బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించకముందే ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు (Mynampalli).. కేసీఆర్ కుటుంబ సభ్యుడు, మంత్రి హరీష్ రావును ఏ రేంజ్‌లో విమర్శలు గుప్పించారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయినప్పటికీ మల్కాజిగిరి అభ్యర్థిగా ఆయన్ను బాస్ ప్రకటించారు. మైనంపల్లి కుమారుడు రోహిత్‌కు మెదక్ టికెట్ ఇవ్వకపోవడంతో మీడియా ముందే విమర్శలు గుప్పించారు. ఇంత జరిగినా సింపుల్‌గా ‘మైనంపల్లి టికెట్ ఇచ్చాం.. పోటీ చేస్తారా లేదా అనేది ఆయనిష్టం’ అని కేసీఆర్ మిన్నకుండిపోయారు. టికెట్ ప్రకటించాక కూడా చాలానే జరిగాయి. అయినాసరే మైనంపల్లిపై చర్యలు తీసుకోవడానికి గులాబీ బాస్ ఎందుకో సాహసించట్లేదు. మల్కాజిగిరి నుంచి వేరొకర్ని బరిలోకి దింపడానికి కేసీఆర్ ప్రయత్నాలు షురూ చేశారని ప్రచారం జరిగినా అది కూడా ఇంతవరకూ కొలిక్కి రాలేదు.

Mynampalli-Rohit.jpg

  • ఖమ్మం జిల్లా కీలక నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురించి ఇక ప్రత్యేకించి చెప్పడానికేమీ లేదు. పాలేరు నుంచి టికెట్ ఆశించినా సిట్టింగ్‌కే ఇచ్చారు గానీ.. ఆయన్ను పట్టించుకున్న పాపాన పోలేదు. మాస్ లీడర్, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పరిచయాలు, పలుకుబడి ఉన్న నేత కావడంతో ఇక ఈ ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకోవాలని వేలాది కార్లు.. అంతకుమించి బైకులతో అభిమానులు, అనుచరులు, కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించి బలప్రదర్శన చేశారు. కచ్చితంగా ఈ ఎన్నికల్లో పోటీచేసి తీరుతానని.. అధిష్టానానికి సవాల్‌గా చెప్పారు. అయితే ఏ పార్టీ అనేది మాత్రం చెప్పలేదు. వాస్తవానికి.. ఇంత మాట అన్న తర్వాత ‘ ప్రభుత్వానికే ఎదురు తిరగడమేంటి..?.. రెబల్‌గా మారి పోటీచేస్తానని ప్రకటన చేయడమేంటి.. ఉంటే ఉండు లేకుంటే వెళ్లిపో..?’ అని ఏ పార్టీ అధినేత అయినా అనే మాటలే. కానీ కేసీఆర్ మాత్రం ఎందుకో అస్సలు ఆ ఆలోచనే చేయట్లేదు. అన్నీపోగా ఉమ్మడం ఖమ్మం జిల్లా నుంచి తుమ్మలతో పాటు అసంతృప్తులందర్నీ ప్రగతి భవన్‌కు పిలిపించి బుజ్జగించే పనిలో నిమగ్నమయ్యారు.

KCR-And-Thummala.jpg

  • ఇక పట్నం మహేందర్ విషయంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారన్న వార్తలు రావడం.. రేపో, మాపో రాజీనామా చేస్తారనే సంకేతాలు రావడంతో వెంటనే అలర్ట్ అయిన కేసీఆర్.. ఆయన మూడునాళ్ల ముచ్చటగా మంత్రి పదవి ఇచ్చి సేఫ్‌జోన్‌లో పెట్టారు. అంతేకాదు మరోవైపు.. కొడంగల్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పట్నం నరేందర్ రెడ్డికి కూడా టికెట్ ఇచ్చారు. ఇదే మునుపటి కేసీఆర్ అయితే ఎలాంటి నిర్ణయం తీసుకునేవారో.. ఏ రేంజ్‌లో కన్నెర్రజేసేవారో మాటల్లో చెప్పనక్కర్లేదేమో. అయితే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పట్నం బ్రదర్స్ కనీసం లేదంటే ఐదారు నియోజకవర్గాలను ప్రభావితం చేస్తారనే చర్చ జరుగుతోంది. అందుకే ఏదో ఒకటి చేసి పట్నంను కూల్ చేయాలని.. కేసీఆర్ ఇలా చేశారనే టాక్ కూడా నడుస్తోంది.

Patnam-Pramanam.jpg

  • వేములవాడ టికెట్ ఎమ్మెల్యే చెన్నమనేనికి అధిష్టానం ఇవ్వలేదు. దీంతో ఆయన తిరుగుబాటుకు రంగం సిద్ధం చేసుకున్న సమయంలో.. ప్రగతి భవన్ నుంచి ఫోన్ వచ్చింది. పెద్ద సారు.. మిమ్మల్ని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా నియమించారన్నదే ఆ ఫోన్ కాల్ సారాంశం. చెన్నమనేని వ్యవసాయ శాస్త్రవేత్త కావడం, పైగా ప్రొఫెసర్‌ కూడా కావడంతో సలహాదారు పదవి ఇస్తున్నట్లు సీఎంవో ప్రకటన విడుదల చేసింది. ఇది కేబినెట్ హోదా కలిగిన పదవి కాగా.. ఐదేళ్ల పాటు కొనసాగనున్నారు. వాస్తవానికి చెన్నమనేని టికెట్ ఇవ్వకపోవడంపై తీవ్ర అసంతృప్తితో సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేయడం.. కాంగ్రెస్‌లో చేరుతున్నారనే టాక్ నడవడంతో ఇంత పని జరుగుతోందా..? అని వెంటనే పదవి కట్టబెట్టారు కేసీఆర్.

chennamaneni.jpg

  • ఇలాంటి ఘటనలు ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ చాలానే ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. నమ్ముకున్న నేతలను కేసీఆర్‌ నట్టేట ముంచారని.. ఇంత అన్యాయమా..? అని బయటికి చెప్పుకోలేని నేతలు ఎంతో మంది ఉన్నారు. అయితే.. అవసరం కోసం పార్టీలో చేర్చుకుని ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వకుండా చాలా మందికే మొండిచేయి చూపారని జాబితాను బట్టి చూస్తే స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇక ఉద్యమాకారుల గురించి కేసీఆర్ పట్టించుకున్న పాపానే పోలేదు. తుమ్మల నుంచి మోత్కుపల్లి దాకా ఇదే తీరుగా ఉంది. సొంత పార్టీలోని మాజీలనూ పట్టించుకోకుండా.. ఆఖరికి జలగం వెంకట్రావు, వీరేశంలను కూడా ఎమ్మెల్సీ పదవులు ఇస్తామంటూ బుజ్జగింపులు చేస్తున్న పరిస్థితి. గత రెండు పర్యాయాలు జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ ఏ ఒక్కర్నీ ప్రగతి భవన్‌కు ప్రత్యేకంగా పిలిపించుకొని మాట్లాడిన దాఖాలాలు లేనట్లే. అయితే ఈ ఏడాది మాత్రం సీన్ మొత్తం మారిపోయింది.

Congress-And-BRS.jpg

ఎన్నికల ముందు ఇదే పెద్ద ట్విస్ట్..?

ఇవన్నీ ఒక ఎత్తయితే.. గవర్నర్-గవర్నమెంట్ మధ్య నిన్న, మొన్నటి వరకూ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చెప్పనక్కర్లేదు. సీన్ కట్ చేస్తే.. రాజ్‌భవన్‌కు కేసీఆర్ వెళ్లడం.. పట్నం ప్రమాణ స్వీకారం తర్వాత 25 నిమిషాల పాటు ప్రత్యేకంగా భేటీ కావడం.. ఆ తర్వాత సచివాలయంను సందర్శించడానికి ఆహ్వానించడం జరిగింది. అయితే.. కొత్త సచివాలయ ప్రారంభోత్సవానికి పిలవని గవర్నర్‌‌ను ఇప్పుడు ఘనంగా స్వాగతం పలికారు. కేసీఆర్‌ సహా మంత్రులు, సీఎస్‌ తదితరులు ప్రధాన ద్వారం వరకూ వచ్చి పూల బొకేలు ఇచ్చి స్వాగతించారు. అనంతరం తమిళిసైని సీఎం సచివాలయం లోపలికి తోడ్కొని వెళ్లారు. ఆమెను ఒక్కో ఫ్లోర్‌కు తీసుకెళ్లారు. అక్కడి గదులను చూపిస్తూ సచివాలయ నిర్మాణ వైభవాలను వివరించారు. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాల్లో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటి వరకూ ఉప్పు-నిప్పులా ఉన్న ముఖ్యమంత్రి, గవర్నర్‌ మధ్య సయోధ్య కుదిరిందనే వాదనకు తాజా పరిణామంతో బలం చేకూరిందని రాజకీయ వర్గాలు విశ్లేషించాయి. తాజా పరిణామాలతో రాజ్‌భవన్‌లో పెండింగులో ఉన్న బిల్లులన్నింటికీ ఇక మోక్షం కలగనుందన్న చర్చ మొదలైంది. గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎంపికైన వారికి కూడా త్వరలోనే మార్గం సుగమం కానుందని బీఆర్‌ఎస్‌ వర్గాలు వివరిస్తున్నాయి. ఇన్నిరోజులుగా ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకున్నారు. అసెంబ్లీ వేదికగా కూడా గవర్నర్‌పై ఆర్టీసీ విలీన బిల్లు విషయంలో విమర్శలు గుప్పించిన సందర్భాలున్నాయి. నిజంగా ఎన్నికల ముందు కేసీఆర్ ఈ రేంజ్‌లో ట్విస్ట్ ఇస్తారని ఎవరూ ఊహించి ఉండరేమో. అయితే ఈ పరిణామాలన్నీ.. బీఆర్ఎస్-బీజేపీ ఒక్కటే అనేలా చేస్తున్నాయని విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కాంగ్రెస్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

9kcr-governor3.jpg

చినజీయర్‌తో సయోధ్య..?

కేసీఆర్.. ఆధ్యాత్మికవేత్త చినజీయర్ మధ్య సంబంధాలు బెడిసికొట్టిన కొట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ సంబంధాలు మళ్లీ చిగురిస్తున్నాయి. సమతామూర్తి విగ్రహావిష్కరణ దగ్గర చెడిన ఈ బంధం.. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని వల్మీడి గ్రామం వేదికగా ఆథ్యాత్మిక కార్యక్రమంలో తిరిగి ముడిపడనుంది!. మంత్రి ఎర్రబెల్లి ఈ ఇద్దర్నీ కలపబోతున్నారు. ఎన్నికల సమయం కావడం, పైగా హిందూ ఓటు బ్యాంక్ సమీకరణకు ఎర్రబెల్లిని అసత్రంగా చేసుకొని తనదైన శైలిలో కేసీఆర్ పావులు కదుపుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Chinajiyar-and-kcr.jpg

మొత్తానికి చూస్తే.. పైన చెప్పిన పరిణామాలన్నీ బట్టి చూస్తే మునుపటి కేసీఆర్.. ఇప్పటి కేసీఆర్ వేరు అనేది మాత్రం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అసలే ఎన్నికల సమయం ఇప్పట్లో ఏం మాట్లాడినా.. ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న పరిస్థితులు వేరేగా ఉంటాయని పసిగట్టిన కేసీఆర్ ఇలా చేస్తున్నారనే అభిప్రాయాలు వస్తున్నాయి. ఎన్నికలకు ఇంకాస్త సమయం ఉండగానే పరిస్థితులు ఉన్నాయంటే.. మున్ముందు ఇంకెన్ని పరిణామాలను చూడాల్సి వస్తుందో.. ఎన్నికలను తగ్గుతున్నారో.. లేకుంటే ఓటమి భయంతో ఇవన్నీ చేస్తున్నారో తెలియాలంటే కొన్నిరోజులు వేచి చూడక తప్పదు మరి.

cm-kcr.jpg


ఇవి కూడా చదవండి


TS Politics : బీఆర్ఎస్‌కు మరో షాక్.. మాజీ మంత్రి రాజీనామా.. అడుగులు ఎటువైపో..!?


TS Assembly Polls : కాంగ్రెస్ ఆశావాహుల నుంచి భారీగా దరఖాస్తులు.. ఆ రెండు నియోజకవర్గాలకు ఒక్కటి మాత్రమే.. ఎన్నారైల క్యూ..


TTD Board Members : 24 మంది సభ్యులతో టీటీడీ పాలక మండలి ప్రకటన.. ప్చ్ ఈయనకు ఎందుకిచ్చారో..!?


MLA Seethakka : ఎన్నికల బరిలో సీతక్క కొడుకు.. ఎక్కడ్నుంచి పోటీ చేస్తున్నారంటే.. గెలుపు పక్కానేనా..!?


Rebel Trouble In BRS : కేసీఆర్‌కు ఊహించని ట్విస్ట్.. పోటీపై తేల్చి చెప్పేసిన తుమ్మల


TS Assembly Polls : కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ కోసం అప్లై చేసిన టాలీవుడ్ ప్రముఖ నిర్మాత.. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే..!


TS Politics : స్పీడ్ పెంచిన కమలం.. బీజేపీలో చేరేందుకు డజను మంది మాజీలు రెడీ.. మాజీ మంత్రితో చర్చలు!



Updated Date - 2023-08-26T20:43:21+05:30 IST