YS Sharmila: షర్మిల ఎంట్రీ ఏపీ కాంగ్రెస్‌కు లాభమా? నష్టమా?

ABN , First Publish Date - 2023-07-04T13:34:19+05:30 IST

రాష్ట్ర విభజన తర్వాత పూర్తిగా చతికిలపడ్డ హస్తం పార్టీకి షర్మిల వల్ల లాభమా... నష్టమా అన్న విషయంపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. షర్మిల వల్ల కాంగ్రెస్ పార్టీకి ఒరిగేదేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

YS Sharmila: షర్మిల ఎంట్రీ ఏపీ కాంగ్రెస్‌కు లాభమా? నష్టమా?

వైఎస్ షర్మిల (YS Sharmila) వైఎస్సార్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసి ఏపీలో కాంగ్రెస్ (Congress) బాధ్యతలు భుజానికెత్తుకోబోతున్నట్లుగా కొన్ని రోజులుగా ఊహాగానాలు నడుస్తున్నాయి. వైఎస్ఆర్(YSR) కుటుంబానికి అత్యంత సన్నిహితుడు కేవీపీ రామచంద్రరావు కూడా ఇటీవల ఈ విషయంపై స్పందించారు. షర్మిలను మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని ఆయన అన్నారు. షర్మిల చేరికతో ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవం వస్తుందని.. పార్టీ మళ్లీ బలోపేతం అవుతుందని కేవీపీ అభిప్రాయపడ్డారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత పూర్తిగా చతికిలపడ్డ హస్తం పార్టీకి షర్మిల వల్ల లాభమా... నష్టమా అన్న విషయంపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. షర్మిల వల్ల కాంగ్రెస్ పార్టీకి ఒరిగేదేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

ఒకవేళ నిజంగానే షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆ పార్టీకి ఎంతోకొంత లాభం చేకూరుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఏపీలో దళిత ఓటు బ్యాంక్ ప్రస్తుతం జగన్ పార్టీకి అనుకూలంగా ఉందనే ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరితే ఈ ఓటు బ్యాంక్ చీలే అవకాశాలున్నాయి. అంతేకాకుండా వైఎస్ఆర్ కుటుంబాన్ని అభిమానించే వాళ్లు కూడా రెండుగా చీలే ఛాన్స్ ఉంది. దీంతో ఏపీలో పాతాళానికి పడిపోయిన కాంగ్రెస్ పార్టీకి కొంత లాభం చేకూరనుంది.

ఉమ్మడి ఏపీని ఐదేళ్ల పాటు పాలించిన వైఎస్ఆర్‌కు ఎంతో కొంత ఉన్న ఆదరణ కారణంగానే ప్రజలు ఆయన కుమారుడు జగన్‌కు ఒక్క ఛాన్స్ ఇచ్చారనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. అలాగే వైఎస్‌ఆర్‌కు నిజమైన రాజకీయ వారసురాలిగా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్న షర్మిలకు ఆంధ్రప్రదేశ్‌లో ఆదరాభిమానాలు దక్కే అవకాశం ఉంది. జగన్ జైలుకు వెళ్లిన సమయంలో వైసీపీ గెలుపు కోసం వైఎస్ షర్మిల ‘మరో ప్రజా ప్రస్థానం’ పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో కాలికి బలపం కట్టుకుని తిరిగారు. ఆ సందర్భంలో షర్మిలను ప్రజలు బాగానే ఆదరించారు. ఈ పరిణామాలను గమనిస్తే కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరిక కచ్చితంగా జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్‌ ఓటు బ్యాంకుపై ప్రభావం చూపుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే ఏపీ కాంగ్రెస్‌కు షర్మిల సారథ్యం వహిస్తే జగన్ సర్కార్‌కు గండంగా మారిన ప్రభుత్వ వ్యతిరేకత ఓటుతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వైఎస్ఆర్‌ను అభిమానించే ఏపీ కాంగ్రెస్ నేతల్లో మెజారిటీ లీడర్లు ప్రస్తుతం జగన్‌తో ఉన్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తమకు అవమానాలే ఎదురయ్యాయని పలువురు నేతలు గగ్గోలు పెట్టిన సందర్భాలున్నాయి. జగన్ నియంతలా పాలన చేస్తున్నారని.. కనీసం తమకు అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని.. ఒకవేళ ఇచ్చినా జగన్ ముందు నిలబడే మాట్లాడాలని కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాళ్లంతా షర్మిల పార్టీలోకి జంప్ చేసే అవకాశముంది. మరోవైపు వైఎస్ఆర్ కుమారుడిగా జగన్‌ను ఆదరించిన నేతలు కుమార్తెగా షర్మిలను కూడా అభిమానించి ఆమె వెంట నడిచే ఛాన్స్ ఉంది.

మరోవైపు ఏపీలో జగన్ పాలనపై మెజారిటీ ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని జగన్ సర్వనాశనం చేశారని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరితే ప్రభుత్వ వ్యతిరేకత ఓటు ప్రతిపక్ష పార్టీలు షేర్ చేసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. ఇదంతా పక్కనపెడితే తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ పేరుతో పార్టీ ఏర్పాటు చేసిన షర్మిల నిజంగానే ఏపీ రాజకీయాల్లో అడుగుపెడతారా అని.. ఇదే నిజమైతే జగన్, షర్మిల మధ్య ఎలాంటి రాజకీయాలు చోటు చేసుకుంటాయోనని ఆసక్తి కనపరుస్తున్నారు. ఇంటి యుద్ధం రాజకీయ యుద్ధంగా ముదిరే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటికే తల్లి, చెల్లినే పట్టించుకోని జగన్ రాష్ట్రాన్ని ఎలా పరిపాలిస్తాడని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరితే వైఎస్ఆర్ కాంగ్రెస్ నిట్టనిలువుగా చీలడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే షర్మిల మనసులో ఏముందో తెలియాలంటే కొంత కాలం ఆగక తప్పదు. కేవీపీ స్పందన అనంతరం షర్మిల అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరికపై ఎలాంటి కామెంట్స్ చేయకపోవడం గమనించాల్సిన విషయం.

Updated Date - 2023-07-04T13:51:57+05:30 IST