Phonepe: ఫోన్‌పేలో డబ్బులు పంపేటప్పుడు ముందుగా ఒక రూపాయి పంపే అలవాటుందా..? అయితే ఈ ఘటన గురించి తెలియాల్సిందే..!

ABN , First Publish Date - 2023-04-28T18:41:08+05:30 IST

ఎరువులు కొనుగోలు చేసినట్లు మభ్యపెట్టి ఫోన్‌పే మాటున సైబర్‌ నేరగాళ్లు ఎరువుల డీలర్‌ను బురిడీ కొట్టించారు. ఈ ఘటన కంభంలోని ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో..

Phonepe: ఫోన్‌పేలో డబ్బులు పంపేటప్పుడు ముందుగా ఒక రూపాయి పంపే అలవాటుందా..? అయితే ఈ ఘటన గురించి తెలియాల్సిందే..!

కంభం (ప్రకాశం జిల్లా): ఎరువులు కొనుగోలు చేసినట్లు మభ్యపెట్టి ఫోన్‌పే మాటున సైబర్‌ నేరగాళ్లు ఎరువుల డీలర్‌ను బురిడీ కొట్టించారు. ఈ ఘటన కంభంలోని ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో గురువారం చోటుచేసుకొంది. ఇదే తరహాలో ఏక సమయంలో కందులాపురం కూడలిలో కిరాణా దుకాణంలోనూ చోటుచేసుకోవడం గమనార్హం. ఈ ఘటనలకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. కంభం ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో 30 సంవత్సరాలుగా కంభం పట్టణానికి చెందిన పార్షీ సుబ్బయ్య శ్రీలక్ష్మీ కనకదుర్గా ట్రేడ్రర్స్‌ పేరు మీద ఎరువుల వ్యాపారం చేస్తున్నాడు.

కాగా బుధవారం ఓ గుర్తు తెలియని వ్యక్తి ఎరువుల దుకాణం యజమాని అయిన సుబ్బయ్య వద్దకు వచ్చాడు. తాము రెండు ఎకరాల మిరప పైరు సాగు చేశామని, అయితే మిరపకు నల్లి తెగులు సొకిందని తెగుళ్లు నివారణకు మందులు ఇవ్వమని అడిగాడు. సుబ్బయ్య అతను అడిగిన మందులను ఇచ్చాడు. బిల్లు రూ.3500 అయ్యింది. దీంతో సదరు అపరిచితుడు ‘మా నాన్న ఫోన్‌పే ద్వారా మీ నంబరుకు డబ్బులు పడేలా చేయిస్తాను’ అన్నాడు. ‘ఒక్కసారి మా నాన్న సెల్‌ నంబరు చెబుతాను ఫోన్‌ చేసి ఇవ్వు’ అన్నారు. తన ఫోన్‌ పనిచేయడం లేదని మాయమాటలు చెప్పి నమ్మించాడు. అతను తన తండ్రితో మాట్లాడుతున్నట్లు నటించాడు. వ్యాపారి నంబరుకు రూ.5 వేలు పంపించాలని కోరాడు. రూ.3500 పోను మిగిలిన రూ.1500 తనకు ఇవ్వాలని దుకాణం యజమానికి చెప్పాడు.

Ongole.jpgదీంతో ముందుగా తన తండ్రి ఫోన్‌ నంబరుకు ఒక రూపాయి పంపించాలని కోరాడు. ఇదే క్రమంలో సదరు అనుమానితుడు మరో పురుగుమందు కావాలని కోరాడు. అవి ఇచ్చేందుకు వ్యాపారి లోపలికి వెళ్లాడు. దీంతో ఆయన తిరిగి వచ్చే లోపు రూ.1 పంపించిన సెల్‌ నంబరుకు రూ.95 వేలు ట్రాన్స్‌ఫర్‌ చేసుకున్నాడు. వ్యాపారు మందు తీసుకొని కౌంటర్‌ వద్దకు వచ్చాడు. దీంతో ఏటీఎంకు వెళ్లి నగదు తీసుకొస్తానని చెప్పి అక్కడి నుంచి ఉడాయించాడు. షాపు యజమానికి అనుమానం వచ్చి స్టేట్‌మెంట్‌ చూడగా రూ.95 వేలు ట్రాన్స్‌ఫర్‌ అయినట్లు తెలిసింది. అలాగే కందులాపురం కూడలిలో ఓ కిరాణా దుకాణం నడుపుతున్న రమేష్‌ వద్దకు వెళ్లి సరుకులు కొనుగోలు చేసినట్లుగా నటించి ఆయన ఫోన్‌ నుంచి కూడా రూ.40వేలు కొట్టేసి గుర్తు తెలియని వ్యక్తి పరారయ్యాడు. ఈ విషయమై సీఐ రాజుష్‌ కుమార్‌ను వివరణ కోరగా ఈ ఘటన జరిగింది వాస్తవమేనన్నారు. సైబర్‌ నేరగాళ్లు విచ్చల విడిగా తిరుగుతున్నారన్నారు. పరిచయం లేని వ్యక్తులకు ఫోన్‌లు ఇవ్వడం మంచిది కాదన్నారు.

Updated Date - 2023-05-01T18:23:43+05:30 IST