Asia Cup 2023: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు మళ్లీ వర్షం ముప్పు.. ఆసియా కప్ ఫెయిల్యూర్‌కు బీసీసీఐనే కారణమా?

ABN , First Publish Date - 2023-09-08T13:00:48+05:30 IST

కొలంబో వేదికగా ఆదివారం జరిగే భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ నివేదికలు చెప్తున్నాయి. ఆదివారం నాడు కొలంబోలో 28 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కానుందని.. మ్యాచ్ జరిగే రోజు సుమారు 75 శాతం వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. దీంతో మ్యాచ్‌ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినా ఆశ్చర్యం లేదని అభిప్రాయపడ్డారు.

 Asia Cup 2023: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు మళ్లీ వర్షం ముప్పు.. ఆసియా కప్ ఫెయిల్యూర్‌కు బీసీసీఐనే కారణమా?

ఆసియా కప్‌లో చిరకాల ప్రత్యర్థుల మధ్య సమరాన్ని వీక్షించాలని భావిస్తున్న అభిమానుల కోరిక నెరవేరేలా కనిపించడం లేదు. ఇప్పటికే లీగ్ దశలో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ రద్దు కాగా ఇప్పుడు సూపర్-4లోనూ అలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. కొలంబో వేదికగా ఆదివారం జరిగే భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ నివేదికలు చెప్తున్నాయి. ఆదివారం నాడు కొలంబోలో 28 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కానుందని.. మ్యాచ్ జరిగే రోజు సుమారు 75 శాతం వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. దీంతో మ్యాచ్‌ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినా ఆశ్చర్యం లేదని అభిప్రాయపడ్డారు. మధ్యాహ్నం సమయంలో 99 శాతం వర్షం పడే ఛాన్స్ ఉందన్నారు. వెదర్ రిపోర్టు కారణంగా గత మ్యాచ్ తరహాలో ఈ మ్యాచ్ కూడా ఫలితం తేలకుండానే రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.

సూపర్-4లో మ్యాచ్‌లకు రిజర్వ్ డే కూడా లేకపోవడంతో మరోసారి రెండు జట్లు పాయింట్లు పంచుకోవాల్సిన పరిస్థితి తలెత్తనుంది. అయితే వర్షాల కారణంగా ఆసియా కప్ చప్పగా సాగడానికి బీసీసీఐ మొండి వైఖరే కారణమని విమర్శల వర్షం కురుస్తోంది. వాస్తవానికి ఆసియా కప్ పాకిస్థాన్‌లో జరగాల్సి ఉంది. కానీ సెక్యూరిటీ కారణాలతో భారత్‌ను పాకిస్థాన్‌కు పంపేందుకు బీసీసీఐ అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆసియా కప్‌ను యూఏఈలో నిర్వహించాలని పాకిస్థాన్ ప్రతిపాదన చేసింది. అయితే బీసీసీఐ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. శ్రీలంకలో అయితే ఆడతామని చెప్పడంతో ఆసియా క్రికెట్ కౌన్సిల్ అందుకు అంగీకారం తెలిపింది. ఎక్కువ మ్యాచ్‌లు శ్రీలంకలో జరిగేలా ఏర్పాట్లు చేయాలని బీసీసీఐ పంతం పట్టింది. వర్షాలను అంచనా వేయలేని ఏసీసీ మ్యాచ్‌లను బీసీసీఐ ఇష్టప్రకారమే శ్రీలంకలో షెడ్యూల్ చేసింది. ప్రస్తుతం వర్షాల కారణంగా ఆసియా కప్ మ్యాచ్‌లన్నీ వర్షం వల్ల తుడిచిపెట్టుకునిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఒక మ్యాచ్ రద్దు కాగా.. మరో రెండు మ్యాచ్‌లకు వరుణుడు అంతరాయం కలిగించాడు.

ఇది కూడా చదవండి: ODI World Cup 2023: బీసీసీఐ కీలక నిర్ణయం.. మరో 4 లక్షల టిక్కెట్లు విడుదల

ప్రస్తుతం జరుగుతున్న సూపర్-4లో మ్యాచ్‌లు కూడా వర్షం వల్ల రద్దయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్పడంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.వర్షాల నేపథ్యంలో సూపర్‌-4 మ్యాచ్‌లను కొలంబో నుంచి హంబన్‌టోటకు మార్చాలని శ్రీలంక బోర్డు ప్రతిపాదన చేసినా ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ అంగీకరించలేదు. తక్కువ వ్యవధిలో సామగ్రి, సిబ్బందిని అక్కడికి తరలించడం చాలా కష్టమని అధికారిక బ్రాడ్‌కాస్టర్ చెప్పడం వేదిక మార్చకపోవడానికి కారణమని టాక్ నడుస్తోంది.

Updated Date - 2023-09-08T13:00:48+05:30 IST