Team India: రింకూ సింగ్‌కు అన్యాయం.. బీసీసీఐపై విమర్శల వర్షం

ABN , First Publish Date - 2023-07-06T14:29:25+05:30 IST

వెస్టిండీస్‌తో టీమిండియా ఆడబోయే ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఆధ్వర్యంలోని సెలక్షన్ కమిటీ జట్టును ప్రకటించింది. అయితే టాలెంట్ ప్లేయర్ రింకూ సింగ్‌ను సెలక్టర్లు పక్కనపట్టారు. దీంతో బీసీసీఐపై సోషల్ మీడియా వేదికగా క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు.

Team India: రింకూ సింగ్‌కు అన్యాయం.. బీసీసీఐపై విమర్శల వర్షం

ఈ ఏడాది ఐపీఎల్‌లో తన ప్రదర్శనతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న క్రికెటర్ ఎవరైనా ఉన్నారంటే అది రింకూ సింగ్ మాత్రమే. కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున అతడు సంచలన ఇన్నింగ్స్‌లు ఆడాడు. ముఖ్యంగా గుజరాత్ టైటాన్స్‌పై ఒకే ఓవర్‌లో వరుసగా ఐదు సిక్స్‌లు కొట్టడం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మొత్తంగా ఐపీఎల్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన రింకూ సింగ్ 59.25 సగటుతో 474 రన్స్ చేశాడు. అతడి ఖాతాలో నాలుగు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. కోల్‌కతా తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఓవరాల్‌గా ఎక్కువ రన్స్ చేసిన ఆటగాళ్ల లిస్టులో 9వ స్థానంలో నిలిచాడు. అంతేకాకుండా సిక్సర్ల కింగ్ అనే ట్యాగ్ కూడా రింకూ సింగ్ సంపాదించాడు.

ఇది కూడా చదవండి: ధోని బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్, నందిగామలో భారీ కటౌట్లు ఏర్పాటు

టీమిండియాలో ఫినిషర్ పాత్రను పోషించగల సామర్థ్యం తనకు ఉందని రింకూ సింగ్ నిరూపించుకున్నాడు. ధోనీ తర్వాత టీమిండియాలో ఫినిషర్ పాత్రను హార్దిక్ పాండ్య తీసుకున్నాడు. కానీ ఫిట్‌నెస్ కారణంగా హార్దిక్ పాండ్య అంతర్జాతీయ మ్యాచ్‌లకు దూరంగా ఉంటున్నాడు. అయితే టీ20లకు మాత్రమే పాండ్యను సెలక్టర్లు ఎంపిక చేస్తున్నారు. తాజాగా వెస్టిండీస్‌తో టీమిండియా ఆడబోయే ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఆధ్వర్యంలోని సెలక్షన్ కమిటీ జట్టును ప్రకటించింది. అయితే టాలెంట్ ప్లేయర్ రింకూ సింగ్‌ను సెలక్టర్లు పక్కనపట్టారు. దీంతో బీసీసీఐపై సోషల్ మీడియా వేదికగా క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. రింకూ సింగ్‌ను పక్కనపెట్టడానికి కారణమేంటని ప్రశ్నిస్తున్నారు. టీ20 సిరీస్‌కు యువ క్రికెటర్ రింకూ సింగ్‌కు అవకాశం ఇచ్చి ఉండాల్సిందని అభిప్రాయపడుతున్నారు.

అటు రింకూ సింగ్‌తో పాటు రుతురాజ్ గైక్వాడ్, నితీష్ రానా, జితేష్ శర్మ వంటి ప్రతిభ గల క్రికెటర్లను కూడా వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు ఎందుకు ఎంపిక చేయలేదని బీసీసీఐపై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఓపెనర్లుగా ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, యషస్వీ జైశ్వాల్ ఉండటంతో రుతురాజ్‌ను పక్కనపెట్టారని కొందరు భావిస్తున్నారు. అటు టెస్టులు, వన్డేల్లో రుతురాజ్‌కు అవకాశం కల్పించారని.. అందుకే టీ20 సిరీస్‌కు పక్కనపెట్టినట్లు అభిప్రాయపడుతున్నారు. వికెట్ కీపర్ల కోటాలో ఇషాన్ కిషన్, సంజు శాంసన్ ఉన్నారు. దీంతో జితేష్ శర్మకు అవకాశం దక్కలేదు. మరి రింకూ సింగ్, నితీష్ రానాలను సెలక్టర్లు ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదో కారణాలు తెలియాల్సి ఉంది.

Updated Date - 2023-07-06T14:29:25+05:30 IST