IND vs WI: టీమిండియా ఆటగాళ్లకు చేదు అనుభవం.. రాత్రంతా ఎయిర్‌పోర్టులోనే..

ABN , First Publish Date - 2023-07-26T22:06:17+05:30 IST

ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత జట్టుకు ఓ చేదు అనుభవం ఎదురైంది. విమానం కోసం ఎయిర్‌పోర్టులో ఏకంగా 4 గంటలు ఎదురుచూడాల్సి వచ్చింది. దీంతో భారత ఆటగాళ్లు రాత్రంతా ఎయిర్‌పోర్టులోనే ఉండిపోయారు. ఆటగాళ్లకు రాత్రంతా నిద్ర కూడా లేకుండా పోయింది. దీంతో తీవ్ర అసహనానికి గురైన భారత ఆటగాళ్లు బీసీసీఐకి ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు.

IND vs WI: టీమిండియా ఆటగాళ్లకు చేదు అనుభవం.. రాత్రంతా ఎయిర్‌పోర్టులోనే..

బార్బడోస్: ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత జట్టుకు ఓ చేదు అనుభవం ఎదురైంది. విమానం కోసం ఎయిర్‌పోర్టులో ఏకంగా 4 గంటలు ఎదురుచూడాల్సి వచ్చింది. దీంతో భారత ఆటగాళ్లు రాత్రంతా ఎయిర్‌పోర్టులోనే ఉండిపోయారు. ఆటగాళ్లకు రాత్రంతా నిద్ర కూడా లేకుండా పోయింది. దీంతో తీవ్ర అసహనానికి గురైన భారత ఆటగాళ్లు బీసీసీఐకి ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు. అసలు ఏం జరిగిదంటే.. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ ముగియడంతో భారత జట్టు వన్డే సిరీస్ కోసం సన్నదమవుతుంది. మొదటి వన్డే మ్యాచ్ గురువారం జరగనుంది. ఈ క్రమంలో రెండో టెస్ట్ సందర్భంగా ట్రినిడాడ్‌లో ఉన్న భారత ఆటగాళ్లు మొదటి వన్డే మ్యాచ్ జరగనున్న బార్బడోస్‌కు బయలుదేరారు. బీసీసీఐ ఆటగాళ్లకు రాత్రి 11 గంటలకు విమానం టికెట్లు బుక్ చేసింది. దీంతో ఆటగాళ్లు ముందుగానే ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. కానీ విమానం మాత్రం 11 గంటలకు బయలుదేరలేదు. తెల్లవారుజామును 3 గంటలకు బయలుదేరింది. దీంతో భారత ఆటగాళ్లు ఏకంగా 4 గంటలపాటు ఎయిర్‌పోర్టులోనే నిరీక్షించాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఆటగాళ్లకు రాత్రంతా నిద్ర కూడా లేకుండా పోయింది.


దీంతో అసహనం వ్యక్తం చేస్తూ బీసీసీఐకి లేఖ రాశారు. విమానం ఆలస్యం కారణంగా తమ నిద్రకు భంగం వాటిల్లిందని, కావాల్సినంత విశ్రాంతి లభిస్తేనే ప్రాక్టీస్‌కు తగిన సమయం ఉంటుందని లేఖలో పేర్కొన్నారు. దీంతో బీసీసీఐ వర్గాలు ఇక నుంచి ఆటగాళ్లకు లేట్‌నైట్ టికెట్లు బుక్ చేయకూడదని నిర్ణయించుకుంది. దీనిపై ఓ బీసీసీఐ అధికారి మాట్లాడుతూ ‘‘ఆటగాళ్లు రాత్రి 8:40 గంటలకు హోటల్ నుంచి ఎయిర్‌పోర్టుకు బయలుదేరారు. కానీ వాళ్లు ఎయిర్‌పోర్టులో చాలా సేపు వేచి ఉండవలసి వచ్చింది. మ్యాచ్ ముగిశాక ఆటగాళ్లకు కొంత విశ్రాంతి అవసరం. అందుకే అర్ధరాత్రికి బదులు ఉదయం ఫ్లైట్ టికెట్లు బుక్ చేయమని టీమ్ మేనేజ్‌మెంట్ మమ్మల్ని అభ్యర్థించింది. బీసీసీఐ కూడా దానికి అంగీకరించింది. అలాగే ఆటగాళ్ల తదుపరి షెడ్యూల్‌ను సవరించాలని యోచిస్తోంది" అని తెలిపారు.

భారత్ వన్డే స్క్వాడ్:

రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, యుజ్వేంద్ర చాహల్, మహ్మద్ సిరాజ్, జయదేవ్ ఉనద్కత్, ముఖేష్ కుమార్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్

Updated Date - 2023-07-26T22:06:17+05:30 IST