Share News

Ponguleti : కేసీఆర్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు

ABN , First Publish Date - 2023-11-18T14:14:58+05:30 IST

అధికారంలో ఉన్న వ్యక్తికి హుజూరాబాద్‌లో వందల కోట్లు ఖర్చు పెట్టినా ఫలితం దక్కలేదు. అక్కడ వచ్చిన ఫలితమే సత్తుపల్లిలో వస్తుంది. డబ్బుతో రాజకీయం చేయలేం..

Ponguleti : కేసీఆర్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు

ఖమ్మం: తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం వీస్తుందని కాంగ్రెస్ ప్రచార కమిటీ కో-కన్వీనర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy) ఆశాభావం వ్యక్తం చేశారు. పెనుబల్లి మండలం కుప్పెనకుంట్లలో కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో పొంగులేటి పాల్గొని మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ కార్యకర్తలంతా ఐక్యతతో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అహంకారానికి పోకుండా పని చేయాలి. 10 ఏళ్లుగా ఈ ప్రాంతానికి పట్టిన దరిద్రాన్ని పోగొట్టేందుకు ప్రతి ఒక్కరూ కష్టపడాలి. 10 రోజుల్లో 18 గంటలు కష్టపడి ఓటర్లను బూత్‌ల వరకు తీసుకువెళ్లాలి.’’ అని విజ్ఞప్తి చేశారు.

‘‘అధికారంలో ఉన్న వ్యక్తికి హుజూరాబాద్‌లో వందల కోట్లు ఖర్చు పెట్టినా ఫలితం దక్కలేదు. అక్కడ వచ్చిన ఫలితమే సత్తుపల్లిలో వస్తుంది. డబ్బుతో రాజకీయం చేయలేం.. అది సాధ్యం కాదు. బడా బాబులు వచ్చి డబ్బుల సంచులు ఇచ్చినంత మాత్రాన సత్తుపల్లి ప్రజలు మోసపోరు. డబ్బుతో రాజకీయం చేయాలనుకోవడం మూర్ఖత్వం. ఉద్యోగస్తులను జనం మీదకు పంపి వాళ్లను మార్చాలనుకోవటం అమాయకత్వం. కేసీఆర్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. డిసెంబర్ 9 తర్వాత తొత్తులకు, కబ్జాదారులకు అర్థం అవుతుంది. ప్రజా తీర్పునకు ఎంత పెద్ద మగాడైన తల వంచాల్సిందే. గ్రామాల్లో లీడర్ షిప్ ఎక్కువగా ఉంది. ఐక్యతగా పనిచేయాల్సిన అవసరం ఉంది. రెండో ఆలోచన లేకుండా సత్తుపల్లిలో కాంగ్రెస్ పార్టీ గెలవాలి.’’ అని పిలుపునిచ్చారు.

మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - 2023-11-18T14:14:59+05:30 IST