Harish Case: హరీష్ హత్యపై నోరువిప్పిన తల్లి.. అసలేం జరిగిందో చెప్పేసింది!

ABN , First Publish Date - 2023-03-03T15:37:42+05:30 IST

నడిరోడ్డుపై ప్రేమించిన యువతి కళ్ల ఎదుటే దారుణ హత్యకు గురయ్యిన డీజే ఆపరేటర్ దేవరకొండ హరీష్ (28) ఘటనపై (Harish Murder Case) అతడి తల్లి ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో (ABN Andhrajyothy) మాట్లాడారు...

Harish Case: హరీష్ హత్యపై నోరువిప్పిన తల్లి.. అసలేం జరిగిందో చెప్పేసింది!

హైదరాబాద్‌ సిటీ: నడిరోడ్డుపై ప్రేమించిన యువతి కళ్ల ఎదుటే దారుణ హత్యకు గురయ్యిన డీజే ఆపరేటర్ దేవరకొండ హరీష్ (28) ఘటనపై (Harish Murder Case) అతడి తల్లి ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో (ABN Andhrajyothy) మాట్లాడారు. మనీషా, హరీష్ ఇద్దరూ కొన్ని నెలలుగా ప్రేమించుకున్నారని, 10 రోజుల నుంచి హరీష్ మిస్సింగ్ అయ్యినట్టు ఆమె తెలిపారు. హరీష్ ఇంటికి రాకపోవడంతో సురారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు వివరించారు. ప్రేమ వ్యవహారం మనీషా అన్నలకు తెలియడంతో తొలుత హరీష్‌కు వార్నింగ్ ఇచ్చారని, తాము కూడా హరీష్‌ను మందలించి అమ్మాయి వైపు వెళ్లకుండా చేశామని తెలిపారు. మనీషానే పలుమార్లు కలవాలని, ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజులు చేసేదని చెప్పారు. హరీష్‌ స్నేహితుడు శివను కిడ్నాప్ చేసి తాము పోలీసులమని నమ్మబలికారని, హరీష్ జాడ కోసం శివని చిత్రహింసలకు గురిచేశారని పేర్కొన్నారు. దీంతో పోలీసులని నమ్మి హరీష్ ఉన్న ప్రదేశాన్ని శివ చెప్పేశాడని, పక్కా ప్లాన్‌తో హరీష్‌ని దూలపల్లి హనుమాన్ టెంపుల్ వద్ద హత్య చేశారని ఆమె వాపోయారు. గతంలో కూడా తమ కుటుంబాన్ని చంపేస్తామని మనీషా అన్నలు బెదిరింపులకు పాల్పడ్డారని ఆమె ప్రస్తావించారు. తమకు న్యాయం చేయాలని హరీష్ తల్లి డిమాండ్ చేశారు.

సంచలనం సృష్టించిన ఘటన...

ప్రేమ వ్యవహారం హరీష్ ప్రాణాలను బలిగొంది. మనీషా కుటుంబసభ్యులే ఓ పథకం ప్రకారం అతడిని హత్య చేశారు. నడిరోడ్డుపై ఆ యువతి కళ్ల ఎదుటే కత్తులతో పొడిచి హరీష్ ప్రాణం తీశారు. దూలపల్లి రహదారిపై బుధవారం రాత్రి జరిగిన ఈ హత్య సంచలనం సృష్టించింది. హత్యకు గురైన సూరారం కాలనీకి చెందిన దేవరకొండ హరీష్‌ (28) డీజే ఆపరేటర్‌‌‌గా పనిచేస్తుండేవాడు. కొంతకాలంగా తన తల్లితో కలిసి సూరారం కాలనీలో నివాసముంటున్న హరీష్‌ ఏడు నెలల క్రితం ఎల్లారెడ్డిగూడలో ఉండేవాడు. ఆ సమయంలో హరీష్‌‌, మనీషా ప్రేమించుకున్నారు. సదరు యువతి తన కుటుంబసభ్యులకు తెలియకుండా హరీష్‌ను తరచూ కలుస్తుండేది. హరీష్‌ ఎల్లారెడ్డిగూడ నుంచి సురారానికి మకాం మార్చినా వీరి ప్రేమ కొనసాగింది. దీని గురించి తెలుసుకున్న యువతి కుటుంబసభ్యులు హరీష్‌ను పలుమార్లు హెచ్చరించారు. కానీ, ఆ యువతి ప్రేమను కొనసాగించడంతో ఆమె కుటుంబసభ్యులు హరీష్‌పై పగ పెంచుకున్నారు. తమ బిడ్డను తమకు కాకుండా చేస్తోన్న హరీష్‌ అడ్డు తొలగించాలని పథకంపన్నారు. ఇందులో భాగంగా హరీష్‌, ఆ యువతి కదలికలపై నిఘా పెట్టి అదును కోసం ఎదురు చూశారు. ఈ క్రమంలో హరీష్‌, ఆ యువతి కలిసి బుధవారం సాయంత్రం దూలపల్లి ప్రాంతానికి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న వారు అక్కడి ఆంజనేయ స్వామి ఆలయం సమీపంలో వీరిద్దరిని గుర్తించి హరీ్‌షపై దాడి చేశారు. విచక్షణారహితంగా కత్తులతో పొడిచేశారు. ఈ దాడిలో హరీష్‌ ప్రాణాలు కోల్పోగా యువతిని తమ వెంట తీసుకెళ్లిపోయారు. ఈ హత్యపై గుర్తు తెలియని యువకుడి హత్యగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ టీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాల సాయంతో మృతుడు, నిందితుల వివరాలు సేకరించడంతోపాటు హత్య వెనుక ప్రేమ కోణం ఉందని గుర్తించారు.

Updated Date - 2023-03-03T15:38:03+05:30 IST