Share News

Ayyappa : కుంభాభిషేకం తర్వాత అయ్యప్పస్వామి దివ్య దర్శనం

ABN , First Publish Date - 2023-11-05T19:59:46+05:30 IST

భాగ్యనగరంలోని శ్రీనగర్‌ కాలనీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణంలో కొలువై ఉన్న శ్రీ ధర్మశాస్త అయ్యప్ప స్వామి ద్వితీయ పుష్కర కుంభాభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. వేద పండితులు, శబరిమల దేవాలయం నుంచి విచ్చేసిన ప్రధాన తంత్రి, మేల్‌ శాంతిల చేతుల మీదుగా ఆదివారం ఉదయం యంత్ర, బలి పీఠ, ధ్వజ స్తంభ శిఖర ప్రతిష్ఠ కనుల పండుగగా జరిగింది...

Ayyappa : కుంభాభిషేకం తర్వాత అయ్యప్పస్వామి దివ్య దర్శనం

హైదరాబాద్ : భాగ్యనగరంలోని శ్రీనగర్‌ కాలనీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణంలో కొలువై ఉన్న శ్రీ ధర్మశాస్త అయ్యప్ప స్వామి ద్వితీయ పుష్కర కుంభాభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. వేద పండితులు, శబరిమల దేవాలయం నుంచి విచ్చేసిన ప్రధాన తంత్రి, మేల్‌ శాంతిల చేతుల మీదుగా ఆదివారం ఉదయం యంత్ర, బలి పీఠ, ధ్వజ స్తంభ శిఖర ప్రతిష్ఠ కనుల పండుగగా జరిగింది. ఐదు రోజులుగా జరుగుతున్న యజ్ఞయాగాది కార్యాక్రమాలకు పూర్ణాహుతితో ముగింపు పలికారు. దాదాపు నెలలుగా బాలాలయం నుంచి భక్తులను అనుగ్రహిస్తున్న స్వామి కుంభాభిషేకం అనంతరం పునర్నవీకరించిన దేవాలయంలో కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. నూతన దేవాలయంలో స్వామి దివ్య దర్శనంతో భక్తులు పరవశించారు. ‘స్వామియే శరణం అయ్యప్ప’ అంటూ శరణు ఘోషతో శ్రీనగర్‌ కాలనీ దేవాలయ ప్రాంగణం మార్మోగిపోయింది. అనంతరం శబరిమల ప్రధాన అర్చకులు (తంత్రి) కంఠరారు మహేష్‌ మోహన్‌ తంత్రిచే తొలి పడిపూజ జరిగింది. సాయంత్రం శ్రీనగర్‌ కాలనీ తిరువీధుల్లో స్వామివారిని పల్లకిలో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో దేవదాయ ధర్మదాయ శాఖ కమిషనర్‌ వి. అనిల్‌కుమార్‌, దేవాలయ ఛైర్మన్‌, సిహెచ్‌ రామయ్య, ఈఓ శ్రీమతి ఎన్‌. లావణ్య, అయ్యప్పస్వామి దేవాలయ ప్రఽధాన అర్చకులు జొన్నలగడ్డ శ్రీనివాస్‌ శర్మ, రామకృష్ణ శర్మ, దేవాలయ కమిటీ మరియు అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు.

Ayyappa-2.jpg

వేదాశీర్వచనం.. సన్మానం...

శ్రీ అయ్యప్పస్వామి దేవాలయాన్ని సుమారుగా కోటిన్నర వ్యయంతో పునర్నవీకరించిన సూపరనేని సునంద్‌ – పద్మప్రియ దంపతులతోపాటు స్వామికి బంగారు కిరీటాన్ని అందించిన రాజ్యసభ సభ్యులు, హెటెరో ఫార్మసీ అధినేత బి.పార్థసారఽథిరెడ్డి కుటుంబ సభ్యులకు, దేవాలయ గోపురానికి ఇత్తడి తొడుగు దాత రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ధ్వజ స్తంభం దాత సురగం శ్రీనివాస్‌ – విజయ కుటుంబ సభ్యులకు వేదాశీర్వచనం అందించి అయ్యప్పస్వామి ప్రధాన అర్చకులు జొన్నలగడ్డ శ్రీనివాస్‌శర్మ, ఇతర అర్చక సిబ్బంది చేతుల మీదుగా సన్మానం నిర్వహించారు.

కిరీటం ప్రత్యేక ఆకర్షణ...

సర్వాంగ సుందరంగా సిద్ధమైన దేవాలయం ఒక ఆకర్షణగా నిలిస్తే.. ద్వితీయ పుష్కర కుంభాభిషేకం సందర్భంగా సుమారు కోటి రూపాయల వ్యయంతో బి.పార్థసారధిరెడ్డి కానుకగా సమర్పించిన వజ్రాలతో పొదిగిన బంగారు కిరీటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Updated Date - 2023-11-05T19:59:52+05:30 IST