Hyderabad Metro Rail: హైదరాబాద్‌ మెట్రో రైలులో ప్రయాణించే వారికి ఈ విషయం తెలుసా..?

ABN , First Publish Date - 2023-07-26T22:01:01+05:30 IST

హైదరాబాద్ నగరంలోని మెట్రోస్టేషన్లు సూసైడ్‌ స్పాట్లుగా మారుతున్నాయి. అప్పుల బాధతో కొందరు, కుటుంబ సమస్యలతో మరికొందరు, ప్రేమ విఫలమై ఇంకొందరు.. ఇలా చాలామంది మెట్రోస్టేషన్లకు వచ్చి బలవన్మరణాలకు పాల్పడుతుండడం హైదరాబాద్‌ మెట్రో రైలు వర్గాలను కలవర పెడుతున్నాయి. ఫ్లాట్‌ఫారంలపై తగినంతమంది సెక్యూరిటీ సిబ్బంది లేకపోవడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.

Hyderabad Metro Rail: హైదరాబాద్‌ మెట్రో రైలులో ప్రయాణించే వారికి ఈ విషయం తెలుసా..?

సూసైడ్‌ స్పాట్లుగా మెట్రో స్టేషన్లు!

సెక్యూరిటీ సిబ్బంది వైఫల్యంతో వరుస ఘటనలు

మానసిక ఒత్తిడితో కొందరు, ప్రేమ విఫలమై మరికొందరు..

మెట్రో స్టేషన్లపై నుంచి దూకేస్తున్న పరిస్థితి

హైదరాబాద్ నగరంలోని మెట్రోస్టేషన్లు సూసైడ్‌ స్పాట్లుగా మారుతున్నాయి. అప్పుల బాధతో కొందరు, కుటుంబ సమస్యలతో మరికొందరు, ప్రేమ విఫలమై ఇంకొందరు.. ఇలా చాలామంది మెట్రోస్టేషన్లకు వచ్చి బలవన్మరణాలకు పాల్పడుతుండడం హైదరాబాద్‌ మెట్రో రైలు వర్గాలను కలవర పెడుతున్నాయి. ఫ్లాట్‌ఫారంలపై తగినంతమంది సెక్యూరిటీ సిబ్బంది లేకపోవడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.

హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ నగరంలోని ఎల్‌బీనగర్‌-మియాపూర్‌, జేబీఎస్‌- ఎంజీబీఎస్‌, నాగోలు-రాయదుర్గం కారిడార్లలో రోజుకు 1028 సర్వీసులు నడుస్తున్నాయి. ఆయా మార్గాల్లో ప్రతిరోజు 5 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. అయితే కొవిడ్‌కు ముందు ప్రయాణికుల టికెట్లు, షాపింగ్‌ మాల్స్‌, దుకాణాల నిర్వహణ, ప్రకటనలతో ఎల్‌అండ్‌టీకి రోజుకు రూ.కోటికి పైగా ఆదాయం సమకూరింది. దీంతో స్టేషన్లలో టాయిలెట్ల నుంచి మొదలుకొని సెక్యూరిటీ వ్యవస్థ వరకు అన్నింటినీ పకడ్బందీగా నిర్వహించారు.

కాగా, 2020లో కోవిడ్‌ తాకిడి ప్రారంభమైనప్పటి నుంచి నష్టాలు మీద పడుతుండడంతో ఎల్‌అండ్‌టీ సంస్థ స్టేషన్ల నిర్వహణను గాలికి వదిలేసిందనే విమర్శలు ఉన్నాయి. ప్రధానంగా సెక్యూరిటీ విషయాన్ని పట్టించుకోకపోవడంతో కొందరు ఆకతాయిలు టికెట్లు తీసుకొని ఫ్లాట్‌ఫాంలపై ఇష్టారాజ్యంగా తిరుగడం, పట్టాలపై పరుగులు పెట్డడం లాంటివి చేస్తుండడంతో తోటి ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. కాగా, మరికొందరు వ్యక్తిగత కారణాలతో స్టేషన్లపై నుంచి కిందకు దూకి ఆత్మహత్యాయత్నానికి, ఆత్మహత్యకు పాల్పడుతుండడం ఆందోళనకరంగా మారింది.


ఆయా స్టేషన్లలో కొన్ని సంఘటనలు..

* 2019 సెప్టెంబర్‌ 30న చైతన్యపురి మెట్రోస్టేషన్‌పై నుంచి గుర్తు తెలియని వ్యక్తి కిందకు దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గాయపడిన అతడిని వాహనదారులు 108లో ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. రెండు నెలలకు కోలుకున్నట్లు తెలిసింది.

* 2021 అక్టోబర్‌ 1న దిల్‌సుఖ్‌నగర్‌ మెట్రోస్టేషన్‌ నుంచి మొదటి పై అంతస్తు నుంచి 45 ఏళ్ల వ్యక్తి కిందకు దూకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

* 2021 నవంబర్‌ నవంబర్‌ 12న అమీర్‌పేట మెట్రోస్టేషన్‌ రెండో అంతస్తు పై నుంచి ఓ విద్యార్థి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

* 2022 ఫిబ్రవరి 12న నిజామాబాద్‌కు చెందిన రాజు అనే వ్యక్తి ప్రకాష్ నగర్ మెట్రో స్టేషన్‌పై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

* 2022 ఏప్రిల్‌ 5న బంజారాహిల్స్‌లోని శ్రీరాంనగర్‌కు చెందిన ఓ యువతి ఈఎస్‌ఐ మెట్రోస్టేషన్‌పై నుంచి దూకి మృతి చెందింది.

* 2023 జనవరి 4న మక్తల్‌లోని నారాయణపేటకు చెందిన మరియమ్మ(70) ఆర్థిక ఇబ్బందుల కారణంగా భరత్‌నగర్‌ మెట్రోస్టేషన్‌లోని రెయిలింగ్‌ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.

సిబ్బంది కొరతతో ఘటనలు..

మెట్రోస్టేషన్లలో కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతుండడం హెచ్‌ఎంఆర్‌, ఎల్‌అండ్‌టీ సంస్థలతోపాటు తోటి ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇలాంటి ఘటనలు చోటు చేసుకునేందుకు స్టేషన్లలో సెక్యూరిటీ సిబ్బంది తగినంత లేకపోవడమేననే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అమీర్‌పేట్‌, ఎల్‌బీనగర్‌, మియాపూర్‌, నాగోలు లాంటి పెద్ద స్టేషన్లలో 8 మంది పనిచేస్తున్నారు. చిన్న స్టేషన్లలో నలుగురు మాత్రమే ఉన్నట్లు తెలిసింది. ఎల్‌అండ్‌టీ ప్రత్యేక దృష్టి సారించి స్టేషన్లలో చోటుచేసుకుంటున్న బలవర్మణాలను అడ్డుకునేందుకు సెక్యూరిటీని పెంచాలని వారు కోరుతున్నారు.

గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య

కేపీహెచ్‌బీ మెట్రోస్టేషన్‌పై నుంచి కింద పడ్డ ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ సురేందర్‌ తెలిపిన వివరాల ప్రకారం... కేపీహెచ్‌బీ మెట్రోస్టేషన్‌లోని మొదటి అంతస్తులో గల మెట్ల ప్రాంతం నుంచి ఆదివారం ఓ గుర్తుతెలియని వ్యక్తి కిందకు దూకినట్లు ప్రయాణికులు గుర్తించారు. సమాచారం తెలుసుకున్న మెట్రోరైలు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే 108 అంబులెన్స్‌ను పిలిపించగా... వైద్యులు పరిశీలించి తలకు తీవ్రగాయాలై మృతి చెందినట్లుగా తెలిపారు. పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలియలేదని, వయస్సు సుమారు 45-50 ఏళ్లు ఉంటాయని, ఎరుపు రంగు టీషర్ట్‌ ధరించి ఉన్నాడని, సంబంధీకులు కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని కోరారు.

Updated Date - 2023-07-26T22:01:04+05:30 IST