Preethi Case : సైఫ్ ఫోన్ చాటింగ్‌లో కొత్త విషయాలు..

ABN , First Publish Date - 2023-02-24T09:17:18+05:30 IST

కాకతీయ వైద్య కళాశాల విద్యార్థిని డాక్టర్‌ ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. సైఫ్ అనే విద్యార్థి వేధింపుల కారణంగానే ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసినట్టు తొలి నుంచి వార్తలు వచ్చాయి.

Preethi Case : సైఫ్ ఫోన్ చాటింగ్‌లో కొత్త విషయాలు..

వరంగల్ : కాకతీయ వైద్య కళాశాల విద్యార్థిని డాక్టర్‌ ప్రీతి (Doctor Preethi) ఆత్మహత్యాయత్నం కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. సైఫ్ (Saif) అనే విద్యార్థి వేధింపుల కారణంగానే ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసినట్టు తొలి నుంచి వార్తలు వచ్చాయి. కాగా.. సైఫ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రీతిని సైఫ్ వేధింపులకు గురి చేసినట్టు పోలీసులకు ఆధారాలు లభ్యమయ్యాయి. సైఫ్ ఫోన్‌ను చెక్ చేసిన పోలీసులకు చాటింగ్‌లో కొత్త విషయాలు వెలుగు చూశాయి. సైఫ్‌ఫై ర్యాగింగ్, వేధింపులతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. కాసేపట్లో వరంగల్ సీపీ రంగనాథ్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. మీడియాకు వివరాలు వెల్లడించే అవకాశం అవకాశం ఉంది.

ప్రస్తుతం ప్రీతి ఆరోగ్యం విషమంగా ఉంది. హైదరాబాద్‌ నిమ్స్‌ (Nims Hospital)లో ఆమెకు ఎక్మోపై చికిత్స అందిస్తున్నారు. న్యూరాలజీ, జనరల్‌ ఫిజీషియన్‌, కార్డియాలజిస్టుతో కూడిన ఐదుగురు వైద్యుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తున్నది. డాక్టర్‌ ప్రీతిని తమ దగ్గరకు తీసుకొచ్చేప్పటికే పలు అవయవాలు పనిచేయడం లేదని, ఆమెను వెంటిలేటర్‌ సపోర్ట్‌తో తరలించినట్లు నిమ్స్‌ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. నిమ్స్‌లో డాక్టర్‌ ప్రీతిని గవర్నర్‌ తమిళిసై గురువారం పరామర్శించారు. ఆమెకు అందిస్తున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ‘‘ఇది చాలా బాధాకర పరిస్థితి. ఒక డాక్టర్‌గా నేను పరిస్థితిని అర్థం చేసుకోగలను’’ అని వ్యాఖ్యానించారు. వైద్యులు చేయాల్సిందంతా చేస్తున్నారని.. ఇప్పుడే ఒక నిర్ణయానికి రాలేమని అన్నారు. గవర్నర్‌ వద్ద.. ప్రీతి తల్లిదండ్రులు భోరున విలపించారు.

పోలీసుల నిర్లక్ష్యం..

ప్రీతి ఆత్మహత్యాయత్నం ఉదంతంలో పోలీసుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. సైఫ్‌ వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్పష్టమవుతోంది. సైఫ్‌పై ఏసీపీ బోనాల కిషన్‌కు ఫిర్యాదు చేశానని ప్రీతి తండ్రి నరేందర్‌ ఆరోపిస్తున్నారు. ఏసీపీకి పంపిన మొబైల్‌ సందేశాన్ని ఆయన పత్రికలకు విడుదల చేశారు. ఏసీపీకి ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా ఎత్తలేదని, దీంతో మొబైల్‌లో మెసేజ్‌ ద్వారా ఫిర్యాదు చేశానని అన్నారు. కాగా, సైఫ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఉదంతంపై నిజ నిర్ధారణకు ఏర్పాటైన త్రిసభ్య కమిటీ గురువారం విద్యార్థులను విచారించింది. కేఎంసీ, ఎంజీఎంలో గురువారం రోజంతా విచారణ జరిగింది. విభాగాధిపతులు డాక్టర్‌ ఉపేందర్‌ (సర్జరీ), డాక్టర్‌ భిక్షపతి (మెడిసిన్‌) డాక్టర్‌ సరళాదేవి (గైనకాలజీ)తో కూడిన త్రిసభ్య కమిటీ విద్యార్థులను విడివిడిగా విచారించింది. కళాశాలలో ప్రీతి ర్యాగింగ్‌కు గురైందా? సైఫ్‌ వ్యవహారశైలి ఎలా ఉండేది? తదితర అంశాలపై లోతుగా అడిగి తెలుసుకున్నారు. ప్రీతి ఆత్మహత్యాయత్నానికి ముందు ఏం జరిగిందనేది తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఉదంతంపై తక్షణమే నివేదిక సమర్పించాలని డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) ఆదేశించిన మేరకు కమిటీ విచారణ జరిపింది.

Updated Date - 2023-02-24T09:22:59+05:30 IST