CM KCR: కాంగ్రెస్ను బంగాళాఖాతంలో కలిపేద్దాం: కేసీఆర్
ABN , First Publish Date - 2023-06-04T19:02:40+05:30 IST
ధరణి పోర్టల్ తీసి బంగాళాఖాతంలో కలుపుతామని కాంగ్రెస్ (Congress) అంటుందని, ధరణి పోర్టల్ను బంగాళాఖాతం (Bay of Bengal)లో కలుపుతామనే వారినే..

నిర్మల్: ధరణి పోర్టల్ తీసి బంగాళాఖాతంలో కలుపుతామని కాంగ్రెస్ నేతలు (Congress) అంటున్నారని, వారినే బంగాళాఖాతంలో కలిపేద్దామని సీఎం కేసీఆర్ (CM KCR) హెచ్చరించారు. నిర్మల్లో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ను సీఎం ప్రారంభించారు. అనంతరం నిర్మల్ పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో కనీసం మంచినీరు కూడా ఇవ్వలేదన్నారు. నిర్మల్ జిల్లాలోని 396 గ్రామపంచాయతీలకు రూ.10 లక్షలు చొప్పున నిధులు ఇచ్చామని పేర్కొన్నారు. నిర్మల్, ముథోల్, ఖానాపూర్ మున్సిపాలిటీలకు రూ.25 కోట్లు చొప్పున నిధులు, జిల్లాలోని 19 మండలాలకు రూ.25 లక్షల చొప్పున నిధులిచ్చాయని కేసీఆర్ తెలిపారు.
రెవెన్యూ శాఖలో దోపిడీ నివారణకే ధరణి పోర్టల్ (Dharani Portal)ను ప్రవేశపెట్టామని గుర్తుచేశారు. తలసరి ఆదాయంలో దేశలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు. త్వరలో బాసర ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఒకప్పుడు కరెంట్ ఎప్పుడు వస్తుందో.. పోతుందో.. తెలిసేది కాదని, ఇప్పుడు తెలంగాణలో 24 గంటల విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో దోపిడీతో బాధలు పడ్డామని, కాంగ్రెస్ వస్తే రైతుబంధుకు రాంరాం పలుకుతారన్నారు. ఈనెల 8న గ్రామాల్లో చెరువుల దగ్గర పండుగ నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఎస్సారెస్పీ ద్వారా లక్ష ఎకరాలకు నీళ్లు అందుతాయని భరోసా ఇచ్చారు. పదో తరగతి ఫలితాల్లో నిర్మల్ జిల్లా అగ్రస్థానంలో నిలవడం గర్వకారణంగా ఉందని కేసీఆర్ పేర్కొన్నారు.