Rain: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను వణికించిన వర్షం

ABN , First Publish Date - 2023-03-16T20:20:59+05:30 IST

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా (Ranga Reddy District)ను వడగండ్ల వాన (Rain) వణికించింది. వికారాబాద్‌ (Vikarabad), మర్పల్లి, మొమిన్‌పేట, రంగారెడ్డి జిల్లా యాచారం

Rain: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను వణికించిన వర్షం

వికారాబాద్‌: ఉమ్మడి రంగారెడ్డి జిల్లా (Ranga Reddy District)ను వడగండ్ల వాన (Rain) వణికించింది. వికారాబాద్‌ (Vikarabad), మర్పల్లి, మొమిన్‌పేట, రంగారెడ్డి జిల్లా యాచారం, ఆమనగల్లులో వడగండ్లు కురిశాయి. ప్రధానంగా వికారాబాద్‌ జిల్లా మర్పల్లిలో రోడ్లు, పంట పొలాలన్నీ వడగండ్లతో నిండి కశ్మీర్‌ (Kashmir)ను తలపించాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం పొద్దుటూరు (Proddatur)లో 45.8 మి.మీ వర్షపాతం నమోదైంది. వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేటలో 29.0 మిల్లి మీటర్లు, అత్యల్పంగా మేడ్చల్‌ జిల్లా కుత్బుల్లాపూర్‌ గాయత్రీనగర్‌లో 5.5 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. హఠాత్తుగా ఉరుములు, మెరుపులతో గురువారం వికారాబాద్‌ జిల్లా మర్పల్లి మండలంలో 40 నిమిషాల పాటు భారీ వడగండ్ల వాన కురిసింది. దీంతో మర్పల్లి, కోటమర్పల్లి, పంచలింగాల్‌ గ్రామాల్లో భారీగా పంటనష్టం జరిగింది. ఎప్పుడూ లేని విధంగా కుప్పలుతెప్పలుగా వడగండ్లు పడటంతో జనం భయభ్రాంతులకు గురయ్యారు. ఆమనగల్లు, కడ్తాల, తలకొండపల్లి మండలాల పరిధిలో గురువారం సాయంత్రం అకాల వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో అరగంట పాటు వడగండ్ల వాన కురిసింది. దీంతో రోడ్లు జలమయమయ్యాయి. శంషాబాద్‌ మున్సిపల్‌ కేంద్రంలోని వివిధ బస్తీల్లో గురువారం సాయంత్రం ఓ మోస్తరుగా వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. బస్తీల్లో వర్షపునీరు వరదలై పారింది. మేడ్చల్‌ జిల్లాలో అక్కడక్కడా చిరు జల్లులు కురిశాయి.

భారీగా పంట నష్టం

వడగండ్లతో కూడిన భారీ వర్షానికి మర్పల్లితో పాటు కోట్‌మర్పల్లి, పంచలింగాల్‌ గ్రామాల్లో వందల ఎకరాల్లో మొక్కజొన్న, ఉల్లి, టమాట, క్యాలీఫ్లవర్‌ కూరగాయ పంటలు, పుచ్చకాయ పంట దెబ్బతిన్నాయి. రైతులకు ఆర్థికంగా భారీ నష్టం వాటిల్లింది. అసలే ధర లేక అల్లాడుతుంటే ఈ వడగండ్లతో పంట మొత్తం నష్టపోయామని ఉల్లి రైతులు వాపోయారు. వైయ్యి ఎకరాలకు పైగా ఉల్లి పంట దెబ్బతింది. అలాగే కూరగాయ మొక్కలన్నీ ఆకులు, కాండాలు ధ్వంసమై నష్టం వాటిల్లింది. అవి మళ్లీ పూత, కాత కాసే పరిస్థితి లేదని కూరగాయల రైతులు బోరుమంటున్నారు. మొమిన్‌పేట మండలం సైదలిపూర్‌లో ఇంటి ఆవరణలో నిల్చున్న కేసారం లక్ష్మమ్మ అనే మహిళ తలపై వడగండ్లు పడటంతో గాయమైంది. ఇదే గ్రామంలో పులుమద్ది బుచ్చిరెడ్డి, మణెమ్మ, మరో వ్యక్తి పొలం నుంచి ఇంటికి వస్తుండగా తలపై పడి గాయాలయ్యాయి. స్థానికులు వారిని మోమిన్‌పేట్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఎన్కెపల్లిలో ఉల్లి, టమాట, మొక్కజొన్న, బొప్పాయ తోటలు ధ్వంసమయ్యాయి. యాచారం మండలం మొండిగౌరెల్లి, మంతన్‌గౌరెల్లి, నల్లవెల్లి తదితర గ్రామాలలో ఉరుములు, మెరుపులతో భారీ వడగళ్ల వర్షం కురిసింది.

Updated Date - 2023-03-16T20:20:59+05:30 IST