CP Ranganath: టెన్త్ పేపర్ లీక్‌ వ్యవహారంలో అసలేం జరిగిందో పూసగుచ్చినట్లు చెప్పిన సీపీ రంగనాథ్

ABN , First Publish Date - 2023-04-04T21:55:51+05:30 IST

టెన్త్ పేపర్ లీక్‌ వ్యవహారంపై వరంగల్ సీపీ రంగనాథ్‌ పూర్తి వివరాలను వెల్లడించారు.

CP Ranganath: టెన్త్ పేపర్ లీక్‌ వ్యవహారంలో అసలేం జరిగిందో పూసగుచ్చినట్లు చెప్పిన సీపీ రంగనాథ్

వరంగల్‌: టెన్త్ పేపర్ లీక్‌ వ్యవహారంపై వరంగల్ సీపీ రంగనాథ్‌ పూర్తి వివరాలను వెల్లడించారు. టెన్త్ పేపర్ లీక్ (Tenth Paper Leak) కాలేదని, కాపీయింగ్ జరిగిందని వరంగల్ సీపీ రంగనాథ్‌ (Warangal CP Ranganath) స్పష్టం చేశారు. తన స్నేహితులకు ఇవ్వాలని పేపర్‌ను బాలుడు ఫొటో తీసుకున్నాడని, కిటికీ పక్కనే పరీక్ష రాస్తున్న విద్యార్థి నుంచి క్వశ్చన్‌ పేపర్‌ను బాలుడు తీసుకున్నాడని, తీసుకున్న ప్రశ్నాపత్రం ఫొటోను శివగణేశ్‌కు పంపాడని రంగనాథ్‌ తెలిపారు. శివగణేశ్‌ ఆ ఫొటోను టెన్త్‌ స్టూడెంట్స్ గ్రూప్‌లో పెట్టాడని వివరించారు. వరంగల్‌లో టెన్త్‌ హిందీ పేపర్ లీకైనట్లు ప్రశాంత్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పెట్టాడని, కాపీయింగ్‌లో ఓ చానల్‌ మాజీ ఉద్యోగి పాత్ర ఉందని రంగనాథ్‌ వెల్లడించారు. ప్రశాంత్‌ హైదరాబాద్‌లోని మీడియా ఉద్యోగికి ప్రశ్నాపత్రం పంపాడని, ఉదయం 9.30 గంటలకు ప్రశ్నాపత్రం లీకైనట్లు అసత్య ప్రచారం చేశారని, ప్రశ్నాపత్రం కాపీయింగ్ ఘటనపై సెక్షన్ 5 కింద కేసు నమోదని సీపీ చెప్పారు.

ప్రశ్నాపత్రం ఇంకెవరికి వెళ్లింది అనేదానిపై దర్యాప్తు చేస్తున్నామని రంగరాథ్ పేర్కొన్నారు. టెన్త్‌ పేపర్ నిందితులను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. టెన్త్ పేపర్ లీక్‌ కేసును పోలీసలు ఛేదించారు. కమలాపూర్ ప్రభుత్వ బాలుర పాఠశాల నుంచి పేపర్ లీకైనట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. 16 ఏళ్ల బాలుడు పరీక్ష సెంటర్‌లోకి దూకాడని, పరీక్ష సెంటర్‌లోకి దూకి పేపర్ లాక్కొని ఫొటో తీసుకెళ్లినట్లు గుర్తించారు. బాలుడితో పాటు మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్కూల్ డిపార్ట్‌మెంట్ ఆఫీసర్‌, చీఫ్‌ సూపరింటెండెంట్‌, రూమ్ ఇన్విజిలేటర్‌పై చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ముగ్గురిని సస్పెండ్ చేసే అవకాశం తెలుస్తోంది.

Updated Date - 2023-04-04T22:15:38+05:30 IST