Medico Preeti: అశృనయాల మధ్య ప్రీతికి కన్నీటి వీడ్కోలు

ABN , First Publish Date - 2023-02-27T14:11:03+05:30 IST

మెడికో ప్రీతి అంత్యక్రియలు స్వగ్రామంలో ముగిశాయి.

Medico Preeti: అశృనయాల మధ్య ప్రీతికి కన్నీటి వీడ్కోలు

జనగామ: మెడికో ప్రీతి (Medico Preeti) అంత్యక్రియలు (Preeti last rites) స్వగ్రామంలో ముగిశాయి. అశృనయనాల మధ్య ప్రీతికి కుటుంబసభ్యులు, బంధువులు, పార్టీలు, ప్రజాసంఘాల నేతలు కన్నీటి వీడ్కోలు పలికారు. ప్రీతి మృతితో గిర్నితండా కన్నీటి సంద్రంగా మారింది. కాగా... ప్రీతి అంత్యక్రియల్లో పోలీసులు ఓవరాక్షన్ చేశారు. విపక్ష నేతలను అంత్యక్రియల్లో పాల్గొనకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ప్రీతి అంత్యక్రియల్లో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆపై గొడవ సర్దుమణిగింది. మందకృష్ణ మాదిగ (Manda Krishna Madiga), బీఆర్‌ఎస్ (BRS), బీజేపీ నేతలు (BJP Leaders) పాడె పట్టారు. ప్రీతి అంత్యక్రియల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

కాగా... వరంగల్‌లోని కాకతీయ మెడికల్‌ కాలేజీ(కేఎంసీ) (Warangal Kakatiya Medical Collage)కి చెందిన పీజీ మొదటి సంవత్సరం(అనస్థీషియా) విద్యార్థిని ధారావత్‌ ప్రీతి కథ విషాదంగా ముగిసింది. ఐదు రోజులుగా హైదరాబాద్‌ (Hyderabad)లోని నిమ్స్‌ ఆస్పత్రి (Nims Hospital)లో మృత్యువుతో పోరాడిన ఆమె ఆదివారం రాత్రి 9.10 గంటలకు తుదిశ్వాన విడిచారు. డాక్టర్ల బృందం ఆమెను కాపాడేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఎంజీఎం అనస్థీషియా విభాగంలో పని చేస్తున్న ప్రీతి తన సీనియర్‌ ఎంఏ సైఫ్‌ వేధింపులు భరించలేక ఈనెల 22న ఉదయం మత్తు ఇంజక్షన్‌ తీసుకుంది. అత్యవసర ఆపరేషన్‌ థియేటర్‌లో అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెకు ఎంజీఎంలోనే చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో అదే రోజు నిమ్స్‌కు తరలించారు. అప్పటికే ఆమె గుండె పనితీరు మందగించడంతో ఎంజీఎంలో సీపీఆర్‌ నిర్వహించారు. హైదరాబాద్‌కు తరలించిన తర్వాత రెండుసార్లు నిమ్స్‌ వైద్యులు కూడా సీపీఆర్‌ చేశారు. నిమ్స్‌లో చేరినప్పటి నుంచీ ప్రీతి ఆరోగ్యం ఏ మాత్రం మెరుగుపడలేదు. ఆమె అవయవాలన్నీ దెబ్బతినడం వల్ల చికిత్సకు ఏ మాత్రం స్పందించలేకపోయాయి. ఆరోగ్యం అంతకంతకూ క్షీణిస్తూ వచ్చింది. ప్రీతిని రక్షించేందుకు నిమ్స్ వైద్యులు యత్నించినప్పటికీ నిన్న రాత్రి ప్రీతి తుదిశ్వాస విడిచారు.

Updated Date - 2023-02-27T14:11:05+05:30 IST