Share News

Vijayawada : మదర్సాలో విద్యార్థిని అనుమానాస్పద మృతి

ABN , Publish Date - Jun 29 , 2024 | 04:49 AM

విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లో ఉన్న మదర్సాలో ఓ విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది. ఫుడ్‌ పాయిజన్‌ కావడం వల్లే ఆమె చనిపోయిందని నిర్వాహకులు చెబుతున్నారు.

Vijayawada : మదర్సాలో విద్యార్థిని అనుమానాస్పద మృతి

  • తమ కుమార్తెను చంపేశారని తల్లిదండ్రుల ఆరోపణ

  • విజయవాడ ప్రభుత్వాస్పత్రి మార్చురీ వద్ద ఆందోళన

  • ఫుడ్‌ పాయిజన్‌ జరిగిందంటున్న నిర్వాహకులు

  • అధికారుల తనిఖీల్లో 100 కిలోల కుళ్లిన మాంసం గుర్తింపు

విజయవాడ, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లో ఉన్న మదర్సాలో ఓ విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది. ఫుడ్‌ పాయిజన్‌ కావడం వల్లే ఆమె చనిపోయిందని నిర్వాహకులు చెబుతున్నారు. ఎంకే బేగ్‌ స్కూల్‌ వద్ద నిస్వాన్‌ ఎడ్యుకేషనల్‌ అండ్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో సయ్యద్‌ షాహిద్‌ పర్వీజ్‌ అనే వ్యక్తి జామియా హైదయాతుల్‌ వనాద్‌ మదర్సాను నిర్వహిస్తున్నాడు. ఖమ్మం, గుంటూరు, ఏలూరు, కృష్ణా జిల్లాలకు చెందిన 60 మంది విద్యార్థినులు ఇక్కడ ఉంటున్నారు. ఈ క్రమంలో గుడివాడకు చెందిన కరిష్మా(17) శుక్రవారం ఉదయం కళ్లు తిరిగి పడిపోయింది.

ఆమెను వెంటనే విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. దీనిపై అధికారులు ఆరా తీయగా ఫుడ్‌ పాయిజన్‌ జరిగిందని నిర్వాహకుడు వెల్లడించాడు. గురువారం రాత్రి ఫుడ్‌ పాయిజన్‌ కావడంతో మొత్తం ఎనిమిది మంది వాంతులు చేసుకున్నారని, స్థానికంగా ఉన్న ఆర్‌ఎంపీ వైద్యుడ్ని తీసుకొచ్చి మందులు ఇప్పించామని నిర్వాహకులు చెబుతున్నారు. కరిష్మా చనిపోయిన తర్వాత ఏడుగురు విద్యార్థినులు ఆసుపత్రికి తీసుకొచ్చారు.

వారితో జిల్లా వైద్యఆరోగ్య శాఖాధికారిణి డాక్టర్‌ సుహాసిని, ఫుడ్‌ సేఫ్టీ అధికారి గౌస్‌ మాట్లాడారు. వారు మాత్రం తమకు ఎలాంటి వాంతులు కాలేదని చెప్పారు. ఈ నెల 26న వాంతులు అయినట్టు కొందరు తెలిపారు. వారిని ఆసుపత్రిలో చేర్పించి పరిశీలనలో ఉంచాలని డీఎంఅండ్‌హెచ్‌వో వైద్యులను ఆదేశించారు. ఫుడ్‌పాయిజన్‌ అని చెప్పడంతో మదర్సాలో అధికారులు తనిఖీలు చేసి.. ఫ్రిజ్‌లో 100 కిలోల కుళ్లిన మటన్‌, బీఫ్‌ను గుర్తించారు. ఐస్‌ గడ్డకట్టిన మాంసాన్ని బయటకు తీయగానే దుర్వాసన వచ్చింది.

ఈ మాంసం గురించి ప్రశ్నించగా బక్రీద్‌ పండుగ సందర్భంగా దాతలు ఇచ్చారని నిర్వాహకులు వివరించారు. కరీష్మా మృతదేహానికి ప్రభుత్వాసుపత్రి మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించారు. సమాచారం తెలుసుకున్న వెంటనే గుడివాడ నుంచి ఆమె తల్లిదండ్రులు విజయవాడ ఆసుపత్రికి చేరుకుని తమ కుమార్తెను చంపేశారని ఆరోపించారు. ఆసుపత్రి మార్చురీ వద్ద ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చి తమ పిల్లలను మదర్సా నుంచి తీసుకెళ్లిపోయారు.

Updated Date - Jun 29 , 2024 | 04:49 AM