Share News

Amaravati : ‘గనుల’ వెంకటరెడ్డి కోసం గాలింపు

ABN , Publish Date - Aug 09 , 2024 | 05:35 AM

ఇసుక తవ్వకాలు, మైనింగ్‌ అనుమతులు, టెండర్ల ఒప్పందాలు అన్నింటా అక్రమాలకు కేంద్ర బిందువైన గనుల శాఖ మాజీ డైరెక్టర్‌, ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకటరెడ్డి కోసం సీఐడీ విస్తృతంగా గాలిస్తోంది.

Amaravati : ‘గనుల’ వెంకటరెడ్డి కోసం గాలింపు

  • కడప జిల్లాలో సొంతింటికి వెళ్లి సీఐడీ ఆరా

  • హైదరాబాద్‌ నివాసంలోనూ కానరాని మాజీ డైరెక్టర్‌

  • ఇళ్లకు నోటీసులు అతికించిన అధికారులు

  • తిరుపతిలో నోటీసు తీసుకునేందుకు పెద్దకుమార్తె నిరాకరణ

  • ఓ వైసీపీ ఎమ్మెల్యే ఒత్తిడితో రెండో కుమార్తె వద్దకు వెళ్లని వైనం

  • ఏపీలో డిప్యుటేషన్‌ ముగించుకుని వెనక్కి రాలేదన్న కోస్ట్‌గార్డ్‌

అమరావతి, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): ఇసుక తవ్వకాలు, మైనింగ్‌ అనుమతులు, టెండర్ల ఒప్పందాలు అన్నింటా అక్రమాలకు కేంద్ర బిందువైన గనుల శాఖ మాజీ డైరెక్టర్‌, ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకటరెడ్డి కోసం సీఐడీ విస్తృతంగా గాలిస్తోంది. ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించి, వేల కోట్ల రూపాయల దోపిడీలో వైసీపీ నేతలకు అన్ని విధాలా సహకరించిన ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. కడప జిల్లా రైల్వేకోడూరు దగ్గర్లోని ఓబులవారిపల్లె మండలం కొర్లకుంటలో ఆయన సొంతింటికి గురువారం సీఐడీ అధికారులు వెళ్లారు. మరో బృందం హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లింది. రెండు చోట్లా ఆయన లేకపోవడంతో ఇళ్ల గోడలకు 41ఏ నోటీసు అతికించి వెళ్లారు.

సొంతూర్లో ఇరుగు పొరుగును విచారించిన సీఐడీ అధికారులు కొంత సమాచారం సేకరించారు. తిరుపతిలో ఉంటున్న వెంకటరెడ్డి పెద్ద కుమార్తె ఇంటికి వెళ్లి ఆరా తీశారు. తన తండ్రి ఇక్కడ లేరని, ఇంట్లోకి ఎవరూ రావొద్దని ఆమె అభ్యంతరం చెప్పారు. తాము సోదాలకు రాలేదని, విచారణ నిమిత్తం నోటీసు ఇచ్చేందుకు మాత్రమే వచ్చామని వారు తెలిపారు. ‘కూతురుగా మీరే కదా వారసులు.. నోటీసు తీసుకోండి.. మీ నాన్నకు సమాచారం ఇచ్చి విచారణకు పంపండి..’ అని కోరగా ఆమె తిరస్కరించారు. రెండో కుమార్తె ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించిన సీఐడీ అధికారులపై.. ఆమె బంధువైన ఒక వైసీపీ ఎమ్మెల్యే ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. ‘వెంకటరెడ్డి కోసం మీరు వెతుక్కోండి..


ఆయన కుమార్తె నిందితురాలు కాదు కదా’ అని ఆయన ఫోన్లో ప్రశ్నించినట్లు సమాచారం. దీంతో రెండో కుమార్తె ఇంటికి వెళ్లకుండా అధికారులు వెనుదిరిగారు. హైదరాబాద్‌కు వెళ్లిన బృందాలు వెంకటరెడ్డి మాతృసంస్థ అయిన ఇండియన్‌ కోస్ట్‌ గార్డు కార్యాలయాన్ని సంప్రదించగా..

ఆయన ఏపీ నుంచి డిప్యుటేషన్‌ ముగించుకుని వెనక్కి రాలేదని సమాధానం ఇచ్చినట్లు సమాచారం. మైనింగ్‌ అనుమతుల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రైవేటు సహాయకుడిగా ఉంటూ అరాచకాలన్నిటికీ మధ్యవర్తిగా వ్యవహరించిన శశికాంత్‌ కోసం కూడా సీఐడీ అధికారులు ఆరా తీస్తున్నారు.

అయితే మదనపల్లె సబ్‌కలెక్టరేట్‌లో ఫైళ్ల దహనం ఘటన తర్వాత ఆయన పరారీలో ఉన్నారు. ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌లో సీనియర్‌ సివిలియన్‌ స్టాఫ్‌ ఆఫీసర్‌గా ఉన్న వెంకటరెడ్డి 2019లో జగన్‌ సీఎం అయ్యాక రాష్ట్రానికి డిప్యుటేషన్‌పై వచ్చారు. ఏపీఎండీసీలో చేరి జగన్‌ ప్రభుత్వంలో పెద్దల దోపిడీకి అన్ని విధాలా సహకరించారు. చంద్రబాబు ప్రభుత్వం రాగానే వెంకటరెడ్డిని సస్పెండ్‌ చేసి ఏసీబీ విచారణకు ఆదేశించింది. ప్రాథమిక నివేదిక ఆధారంగా సీఐడీ దర్యాప్తు చేపట్టింది.

Updated Date - Aug 09 , 2024 | 05:35 AM