Rain : ప్రత్యామ్నాయ వాన..!
ABN , Publish Date - Aug 18 , 2024 | 12:56 AM
ప్రధాన పంటల సాగుకు అదను దాటేవరకూ మొండికేసిన ఆకాశం.. శుక్రవారం రాత్రి కరిగిపోయింది. గంటల తరబడి వర్షం కురిసింది. వాగులు, వంకలు పొంగి పొర్లాయి. వీధులు, ఇళ్లలోకి నీరు చేరింది. వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. అత్యధికంగా పుట్లూరు మండలంలో 138.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఆత్మకూరు 88.2, బుక్కరాయసముద్రం 88, రాప్తాడు 86.4, శింగనమల 85.4, యాడికి 82, కళ్యాణదుర్గం 75.4, నార్పల 70.8, పామిడి 69.4, శెట్టూరు 68.2, ఉరవకొండ 65.8, ...
జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు
పొంగిపొర్లిన వాగులు, వంకలు
వాహనాల రాకపోకలకు అంతరాయం
269.41 హెక్టార్లల్లో రూ.1.59 కోట్ల పంట నష్టం
అనంతపురం అర్బన, ఆగస్టు 17: ప్రధాన పంటల సాగుకు అదను దాటేవరకూ మొండికేసిన ఆకాశం.. శుక్రవారం రాత్రి కరిగిపోయింది. గంటల తరబడి వర్షం కురిసింది. వాగులు, వంకలు పొంగి పొర్లాయి. వీధులు, ఇళ్లలోకి నీరు చేరింది. వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. అత్యధికంగా పుట్లూరు మండలంలో 138.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఆత్మకూరు 88.2, బుక్కరాయసముద్రం 88, రాప్తాడు 86.4, శింగనమల 85.4, యాడికి 82, కళ్యాణదుర్గం 75.4, నార్పల 70.8, పామిడి 69.4, శెట్టూరు 68.2, ఉరవకొండ 65.8, వజ్రకరూరు 64.4, కంబదూరు 64.2, గుత్తి 60.6, తాడిపత్రి 58.4, యల్లనూరు 56.8, బ్రహ్మసముద్రం 53.2, విడపనకల్లు 47.4, గార్లదిన్నె 46.8, అనంతపురం 45.0 , కుందుర్పి 43.6 , డి.హిరేహాళ్ 43.0, బొమ్మనహాళ్ 40.0 మి.మీ. వర్షపాతం
నమోదైంది. మిగతా మండలాల్లో 35.4 మి.మీ.లోపు నమోదైంది. ఈ వర్షంతో ప్రత్యామ్నాయ పంటల సాగుకు అవకాశం ఏర్పడింది. కానీ ఇప్పటికే సాగులో ఉన్న పంటలు మాత్రం దెబ్బతిన్నాయి.
పంటనష్టం
భారీ వర్షానికి జిల్లా వ్యాప్తంగా 269.41 హెక్టార్లల్లో రూ.1.59 కోట్లకుపైగా పంటనష్టం జరిగింది. పుట్లూరు, వజ్రకరూరు, బెళుగుప్ప, కణేకల్లు, పెద్దపప్పూరు తదితర మండలాల్లో 196 హెక్టార్లల్లో వేరుశనగ, కంది, మొక్కజొన్న, మినుము, పత్తి, వరి, సోయాబీన తదితర పంటలు దెబ్బతిన్నాయి. తద్వారా రూ.53 లక్షల నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. పుట్లూరు, పెద్దపప్పూరు, నార్పల, కంబదూరు, శెట్టూరు, గుమ్మఘట్ట, శింగనమల, గుంతకల్లు, కళ్యాణదుర్గం, వజ్రకరూరు మండలాల పరిధిలో 73.41 హెక్టార్లల్లో రూ.1.06 కోట్లు విలువైన అరటి, ఎండు మిరప, టమోటా, బీర, కాకర, చామంతి, మిరప, కళింగర తదితర ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని ఆ శాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు.
ఊరూరా వాన
కళ్యాణదుర్గం: కంబదూరు మండలం జక్కిరెడ్డిపల్లిలో రైతు మారెప్ప సాగు చేసిన రెండు ఎకరాల టమోటా పంట నీట మునిగింది. తిమ్మాపురం వంక ఉధృతంగా ప్రవహిస్తోంది. కళ్యాణదుర్గం మండలం బోరంపల్లిలో రైతు అశ్వర్థ సాగు చేసిన మొక్కజొన్న పంట నేలకొరిగింది. కళ్యాణదుర్గం ఇందిరమ్మ కాలనీ ఇళ్లలోకి వర్షపునీరు చేరింది. కాలనీ వంకను తలపించింది. కోత దశలో ఉన్న టమోటా, కర్బూజ పంటలు దెబ్బతిన్నాయి.
నీట మునిగిన పంటలు
గుంతకల్లు: నాగసముద్రంలో వేరుశనగ, కంది, మొక్కజొన్న, బీర, కాకర, మిరప పంటలు దెబ్బతిన్నాయి. పందిళ్లు నేలకొరిగాయి. కొండ నుంచి భారీగా వర్షపు నీరు పల్లానికి పారడంతో నేలలు కోతకు గురయ్యాయి. 300 ఎకరాల్లో వేరుశనగ, 250 ఎకరాల్లో కంది, 30 ఎకరాల్లో మొక్కజొన్న దెబ్బతిన్నాయి. మల్లికార్జున రెడ్డి, రాఘవయ్య, రామయ్య తదితరులు నష్టపోయారు. గుంతకల్లు-నాగసముద్రం రహదారిలో కల్వర్టుపై నీరు పారింది. ఓ కారు ఇరుక్కుపోవడంతో స్థానికులు సాయంచేసి బయటకు తీశారు.
కాకర నేలమట్టం
శింగనమల: గుమ్మేపల్లి రైతు బ్యాళ్ల సుదర్మన సాగు చేసిన కాకర పంట నేలమట్టమైంది. రూ.2 లక్షలకు పైగా నష్టం జరిగింది. రెండు ఎకరాల్లో 50 రోజుల క్రితం పందిళ్లు వేసి కాకర పంట సాగు చేశానని రైతు తెలిపారు.
నేలకొరిగిన అరటి
పెద్దపప్పూర: ముచ్చుకోటలో తుమ్మల సుగుణ సాగు చేసిన 600 అరటిచెట్లు నేలకొరిగాయి. రూ.2.50లక్షలు నష్టం వాటిల్లింది. మండలవ్యాప్తంగా వంకలు, వాగులు పొంగిపొర్లుతున్నాయి.
రోడ్డు కోత
బ్రహ్మసముద్రం: సూగేపల్లి వంక ఉప్పొంగి రోడ్డు కోతకు గురైంది. భైరసముద్రం, బ్రహ్మసముద్రం, సూగేపల్లి, వెస్ట్కోడిపల్లి చెరువులకు నీరు చేరింది.
ధర్మవరం రూరల్: కనగానపల్లి మండల కేంద్రం, తల్లిమడుగుల, కుర్లపల్లి, దాదులూరు, మామిళ్లపల్లి, ముక్తాపురం వాగు లు, వంకలు పొంగిపొర్లాయి. ముక్తాపురం చెరువులోకి నీరు చేరింది. మామిళ్లపల్లి పెద్దవంక దాటబోయి కొట్టుకుపోతున్న ద్విచక్ర వాహనదారు మదనను స్థానికులు రక్షించారు.
నిలిచిపోయిన రాకపోకలు
చెన్నేకొత్తపల్లి: అమిదాలకుంట వద్ద వంగపేరు నది ఉధృతం గా ప్రవహిస్తోంది. ధర్మవరం-పుట్టపర్తి ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. ఉధృతి తగ్గాక.. ఉదయం 11.45 గంటలకు రాకపోకలను అధికారులు పునరుద్ధరించారు. వెల్దుర్తి, చిన్నపరెడ్డిపల్లి వద్ద చిత్రావతి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. చెన్నేకొత్తపల్లిలో పెద్దవంక ప్రవాహంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. న్యామద్దల, నాగసముద్రం చెరువులకు నీరు చేరింది.
పండమేరు గలగల
రాప్తాడు: పండమేరు వంక పరవళ్లు తొక్కుతోంది. కొత్తపల్లి రైతు పి.లక్ష్మీనారాయణ తొలగించిన వేరుశనగ పంట తడిసిపోయింది. వంకలు, వాగులు, చెక్డ్యాంలకు భారీగా నీరు చేరింది.
బొమ్మనహాళ్: మూడురోజులుగా కురుస్తున్న వర్షాలకు బొమ్మనహాళ్ జడ్పీ హైస్కూల్ మైదానం చెరువును తలపిస్తోంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు.
బొమ్మనహాళ్: కొళగానహళ్లి వద్ద కబ్బాలివంక ఉధృతంగా ప్రవహిస్తోంది. ఉద్దేహాళ్ వద్ద వేదవతి హగరికి భారీగా వరదనీరు చేరింది. దేవగిరిలో బోరు బావుల కింద సాగు చేసిన వేరుశనగ పంట దెబ్బతింది. రైతు అంజి రూ.8 లక్షలు నష్టపోయాడు.
కణేకల్లు: హనకనహాళ్ వద్ద వాగు పొంగడంతో కణేకల్లు, హనకనహాళ్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఉరవకొండ, కణేకల్లు మధ్య నింబగల్లు వద్ద పెద్ద ఎత్తున వరదనీరు ప్రవహించడంతో 8 గంటల సేపు రాకపోకలు స్థంభించాయి.
జలపాతం కనువిందు
యాడికి: నిట్టూరు వంక ఉధృతంగా ప్రవహిస్తోంది. రోడ్డు పూర్తిగా దెబ్బతినింది. కోన రామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద జలపాతం కనువిందు చేస్తోంది.
ఉరవకొండ: పట్టణంలోని లో తట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కణేకల్లు-ఉరవకొండ రహదారిలో నింబగల్లు వంక ఉధృతి కారణంగా ట్రాఫిక్ స్తంభించింది. నింబగల్లు సమీపంలోని హెచ్చెల్సీ కోతకు గురైంది. బూదగవి చెరువు నిండి మరువ పారింది.
యల్లనూరు: అచ్యుతాపురం రైతు యశోదమ్మ రెండు ఎకరాల్లో సాగుచేసిన కలింగర పంట కొట్టుకుపోయింది. పది రోజుల్లో కోత కోయాల్సిన సమయంలో రూ.2 లక్షల పంట నీటిపాలైంది. తహసీల్దారు నాగరాజు, హార్టికల్చర్ ఉద్యోగి విజయ్ పొలాన్ని పరిశీలించారు.
విడపనకల్లు: ఆర్.కొట్టాల-గడేకల్లు మధ్య పెద్ద వంక పొంగి పొర్లింది. విడపనకల్లు-గుంతకల్లుకు రాక పోకలు 10 గంటల పాటు నిలిచి పోయాయి. గుంతకల్లుకు వెళ్ళే వాహనాలు కర్ణాటకలోని చేళ్లగురికి మీదుగా ప్రయాణించాయి.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....