PRABHAKAR CHOWDARY: చంద్రబాబు ప్రజాపాలన అందిస్తున్నారు
ABN , Publish Date - Aug 05 , 2024 | 11:31 PM
సీఎం చంద్రబాబు ప్రజాపాలన అందిస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్నారు. సోమవారం స్థానిక రాం నగర్లోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
అనంతపురం అర్బన, ఆగస్టు 5: సీఎం చంద్రబాబు ప్రజాపాలన అందిస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్నారు. సోమవారం స్థానిక రాం నగర్లోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత ఐదేళ్లలో అధోగతిపాలైన ఆర్థిక పరిస్థితిని గాడి లో పెట్టి రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపించే సత్తా చంద్రబాబుకు ఉందన్న నమ్మకంతో ప్రజలంతా అఖండ మెజార్టీతో కూటమిని గెలిపించారన్నారు. గత ఐదేళ్ల పాలనలో ప్రజలను ఏ మాత్రం పట్టించుకోని వైసీపీ నాయకులుతమ ప్రభుత్వం పాలన రెండు మాసాలు పూర్తి కాకముందే హామిలు ఏమయ్యాయి..? నెరవేరుస్తారా..? లేదా అంటూ సందేహాలు, అనుమానాలతో మాట్లాడుతూ కపట రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈనెల 15 నుంచి అన్న క్యాంటీన్లు ప్రారంభమవుతాయన్నారు. అమరావతి పునఃనిర్మాణం జరుగుతోందన్నారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గంజాయిని ఉక్కుపాదంతో అణచివేస్తోందన్నారు. కేవలం 50 రోజుల్లోనే ఇన్ని హామీలు అమలు చేశారంటే సీఎం ప్రజాపాలన అందిస్తున్నారనేందుకు ఇంతకంటే తార్కాణం ఏం కావాలన్నారు. తెలంగాణ, కర్ణాటక రాష్ర్టాల్లో ఆయా ప్రభుత్వాలు 6 నుంచి 8 మాసాల్లో హామీలు నెరవేర్చారన్నారు. జగన పాలనలో రాష్ట్రం అప్పులకుప్పగా మారిందన్నారు. గత ప్రభుత్వంలో మాదిరిగా కక్షసాధింపు చర్యలతో ఇతర పార్టీ నాయకులపై దాడిచేస్తే సహించేది లేదని, ఎవరూ కవ్విపు చర్యలకు పాల్పడకూడదని సీఎం స్పష్టం చేశారన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రజా ప్రభుత్వానికి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు సహకరించాలని కోరారు.