Share News

Drugs : జైలుకు పంపిన జల్సాలు

ABN , Publish Date - Aug 08 , 2024 | 12:21 AM

పద్ధతిగా సేద్యం చేసుకుంటూ, పాలు అమ్ముకుంటూ బతికేవారు. జల్సాలకు ఆ సొమ్ము సరిపోలేదని మొదట కర్ణాటక మద్యం అమ్మారు. ఆ తరువా గంజాయి వ్యాపారంలోకి దిగారు. పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యారు. పామిడి పోలీసు స్టేషనలో సీఐ రాజశేఖర్‌రెడ్డి ఈ వివరాలను బుధవారం వెల్లడించారు. పామిడి మండలంలోని పాళ్యం గ్రామానికి చెందిన అన్నదమ్ములు తమ్మినేని శివకుమార్‌, తమ్మినేని నందకుమార్‌ పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసేవారు. ఆవులను పెంచుతూ పాలను అమ్మేవారు. వీటి ద్వారా వచ్చే ఆదాయం కుటుంబ పోషణకు, జల్సాలకు ...

Drugs : జైలుకు పంపిన జల్సాలు
CI Rajasekhar Reddy is revealing the details

గంజాయి గ్యాంగ్‌ను పట్టుకున్న పోలీసులు

నలుగురి అరెస్టు.. ఒకరు పరారీ

తొమ్మిది కిలోల గంజాయి స్వాధీనం

కారు, రెండు ద్విచక్ర వాహనాలు సీజ్‌

పామిడి, ఆగస్టు 7: పద్ధతిగా సేద్యం చేసుకుంటూ, పాలు అమ్ముకుంటూ బతికేవారు. జల్సాలకు ఆ సొమ్ము సరిపోలేదని మొదట కర్ణాటక మద్యం అమ్మారు. ఆ తరువా గంజాయి వ్యాపారంలోకి దిగారు. పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యారు. పామిడి పోలీసు స్టేషనలో సీఐ రాజశేఖర్‌రెడ్డి ఈ వివరాలను బుధవారం వెల్లడించారు. పామిడి మండలంలోని పాళ్యం గ్రామానికి చెందిన అన్నదమ్ములు తమ్మినేని శివకుమార్‌, తమ్మినేని నందకుమార్‌ పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసేవారు. ఆవులను పెంచుతూ పాలను అమ్మేవారు. వీటి ద్వారా వచ్చే ఆదాయం కుటుంబ పోషణకు, జల్సాలకు సరిపోలేదని అడ్డదారిలో వెళ్లారు. కర్ణాటక నుంచి అక్రమంగా మద్యాన్ని తెచ్చి


పాళ్యంతో పాటు చుట్టుపక్కల గ్రామాలలో అమ్మేవారు. ఈ క్రమంలో విడపనకల్లు పోలీసు స్టేషనలో ఒక కేసు, పామిడి పోలీసు స్టేషనలో ఒక కేసు నమోదయ్యాయి. పోలీసులకు దొరికినా వారిలో మార్పు రాలేదు. గంజాయి విక్రయిస్తే మరింత ఎక్కువ సంపాదించవచ్చునని భావించారు. మూడు నెలల నుంచి తమ చిన్నాన్న కొడుకు గోపాలకృష్ణ, అనంతపురం నగరంలోని నందమూరి నగర్‌కు చెందిన పిన్నమ్మ కొడుకు పత్తిపాటి రవితేజ, పెద్దవడుగూరు మండలం లక్ష్ముంపల్లి గ్రామానికి చెందిన అమర్‌నాథ్‌తో కలిసి గంజాయి వ్యాపారం ప్రారంభించారు. గుర్తు తెలియని వ్యక్తుల వద్ద గంజాయిని కొని.. అనంతపురం, గుంతకల్లులో అమ్మేవారు. జూలై 24న కారులో విశాఖపట్నం వెళ్లి అక్కడ గుర్తు తెలియని వ్యక్తుల వద్ద 9210 గ్రాముల గంజాయిని కొనుగోలు చేశారు. ఈ నెల 3న పాళ్యం గ్రామానికి చేరుకున్నారు. గంజాయి సంచిని శివకుమార్‌ ఇంటి సమీపంలోని కల్లందొడ్డి దిబ్బలో దాచారు. దాన్ని విక్రయించేందుకు కారులో తీసుకుని బుధవారం పామిడికి వచ్చారు. నీలూరు క్రాస్‌ వద్ద 44వ జాతీయ రహదారి పక్కన కొనుగోలుదారుల కోసం ఎదురు చూస్తుండగా డిప్యూటీ తహసీల్దార్‌ లక్ష్మీనారాయణరెడ్డి, మండల వ్యవసాయాధికారి లీనావసుంధర పోలీసు సిబ్బందితో కలిసి దాడి చేశారు. తమ్మినేని శివకుమార్‌, ములకల గోపాలకృష్ణ, పత్తిపాటి రవితేజ, అమర్‌నాథ్‌ను అదుపులోకి తీసుకున్నారు. తమ్మినేని నందకుమార్‌ పరారీలో ఉన్నాడని సీఐ తెలిపారు. పట్టుబడిన వారి నుంచి తొమ్మిది కిలోల గంజాయి, ఒక కారు, రెండు బైకులు, ఐదు సెల్‌ఫోనలు, రూ.5 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి, రిమాండ్‌కు తరలించారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Aug 08 , 2024 | 12:21 AM