Share News

Veterinary medicine : పశువైద్యం.. మిథ్య..!

ABN , Publish Date - Oct 16 , 2024 | 12:18 AM

బుక్కపట్నం పశువైద్యాధికారి ఉదయ్‌కుమార్‌ నాలుగు ఆస్పత్రులకు ఇనచార్జిగా కొనసాగుతున్నారు. బుక్కపట్నం మండలంలోని క్రిష్ణాపురం, మారాల, పాముదుర్తి, కొత్తచెరువు మండలంలోని ఆస్పత్రులకు ఆయన ఒక్కరే వైద్యుడు. ఆయన ఏరోజు ఏ ఆస్పత్రిలో విధులు నిర్వహించాలో అర్థంకాని పరిస్థితి. పశువైద్యశాఖలో ఖాళీలకు ఇది నిదర్శనం. వైద్యులతోపాటు సిబ్బంది పరిస్థితి కూడా ఇలానే ఉంది....

Veterinary medicine : పశువైద్యం.. మిథ్య..!
Veterinary Hospital in Kothacheruvu

తీవ్రంగా వైద్యులు, సిబ్బంది కొరత

నాలుగు పశువైద్యశాలలకు ఒకే డాక్టర్‌

శిథిలావస్థలో పలు ఆస్పత్రులు

మూగజీవాలకు అందని వైద్యసేవలు

బుక్కపట్నం పశువైద్యాధికారి ఉదయ్‌కుమార్‌ నాలుగు ఆస్పత్రులకు ఇనచార్జిగా కొనసాగుతున్నారు. బుక్కపట్నం మండలంలోని క్రిష్ణాపురం, మారాల, పాముదుర్తి, కొత్తచెరువు మండలంలోని ఆస్పత్రులకు ఆయన ఒక్కరే వైద్యుడు. ఆయన ఏరోజు ఏ ఆస్పత్రిలో విధులు నిర్వహించాలో అర్థంకాని పరిస్థితి. పశువైద్యశాఖలో ఖాళీలకు ఇది నిదర్శనం. వైద్యులతోపాటు సిబ్బంది పరిస్థితి కూడా ఇలానే ఉంది.

కొత్తచెరువు, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): వ్యవసాయం గిట్టుబాటు కాని రైతులు అనుబంధ రంగమైన పాడి పరిశ్రమను ఆశ్రయిస్తున్నారు. జీవనాధారమైన పాడిపశువులను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. వాటికి జబ్బు సోకితే వైద్యం అందించడానికి పశువైద్యాధికారి మాత్రం లేడు. దీంతో వేలాది రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన పశువులకు వైద్యం అందక ముృత్యువాత పడుతున్నాయని


రైతులు వాపోతున్నారు. జిల్లాలో ఏటా వర్షాకాలంలో పశువులు, గేదెలు, మేకలు, గొర్రెలు, ఇతర జీవాలు వ్యాధుల బారిన పడుతున్నాయి. పశువైద్యులు, తగినంత సిబ్బందిలేక మూగజీవాలకు సకాలంలో వైద్యసేవలు అందట్లేదు. అత్యవసర పరిస్థితుల్లో కిందిస్ధాయి సిబ్బందే (గోపాల మిత్రలు) తెలిసీతెలియని వైద్యం చేస్తున్నారు.

పశుసంపద, వైద్యశాలల వివరాలివీ..

జిల్లాలో పశువులు 2.64 లక్షలు, గేదెలు 95 వేలు, గొర్రెలు 27 లక్షలు, మేకలు 4 లక్షలు, కోళ్లు 14 లక్షలు ఉన్నాయి. ప్రాంతీయ పశువైద్యశాలలు 15, పశువైద్యకేంద్రాలు 66, గ్రామీణ పశువైద్య కేంద్రాలు 23, రైతుసేవాకేంద్రాలు 335 ఉన్నాయని జిల్లా పశువైద్యాధి శుభదాస్‌ తెలిపారు.

34 పోస్టులు ఖాళీ

జిల్లాలో 104 పశువైద్యశాలలున్నాయి. వీటిలో 15 ప్రాంతీయ, 66 ప్రాథమిక, 23 ఉపకేంద్రాలున్నాయి. వీటిలో పశువులకు వివిధ రకాల వైవ్యసేవలు అందించాల్సి ఉంది. పూర్తిస్థాయిలో సిబ్బంది లేకపోవడంతో పాడిరైతులకు ఇబ్బందులు తప్పడంలేదు. మూడు రకాల పశువైద్యశాలల్లో 305 మంది సిబ్బంది ఉండాలి. 165 మంది మాత్రమే పనిచేస్తున్నారు. 131 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎక్కువగా ప్రాథమిక ఉప కేంద్రాల్లో 49 వెటర్నరీ అసిస్టెంట్లు, 56 ఆఫీస్‌ సబార్డినేట్లు లేరు. 34 వైద్య పోస్టులు ఖాళీగా ఉన్నాయని పశువైద్య శాఖ గణాంకాల ద్వారా తెలుసోంది.

క్షేత్రస్థాయిలో అందని సేవలు

జిల్లాలో పశువైద్య సిబ్బంది కొరతతో పాడి పశువులకు వైద్యసేవలు అందట్లేదని రైతులు వాపోతున్నారు. తలుపుల, పెద్దన్నవారిపల్లి,నంబులపూలకుంట, అమడగూరు, తనకల్లు మండలంలోని కోటూరుపల్లి పశువైశాలలకు సొంత భవనాల్లేవు. కాలంచెల్లిన, అద్దె భవనాల్లో సిబ్బంది విధులు నిర్వహించలేక ఇబ్బందులు పడుతున్నారు. వీటి స్థానంలో కొత్త భవనాలు నిర్మించి, వైద్యులు, సిబ్బంది పోస్టులను భర్తీ చేసి, మూగజీవాలకు వైద్యసేవలు అందేలా చూడాలని పాడిరైతులు కోరుతున్నారు.

ప్రతిపాదనలు పంపాం

జిల్లాలో పశు వైద్యసిబ్బంది ఖాళీలు, శిథిలావ్యవస్ధలో ఉన్న భవనాల వివరాలతో ప్రభుత్వానికి నివేదికలు పంపాం. ప్రభుత్వ అదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం.

-శుభదాస్‌, జిల్లా పశువైద్యాధికారి


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Oct 16 , 2024 | 12:18 AM