Kakkalapally tomato market : మనం మనం. బరంపురం
ABN , Publish Date - Aug 22 , 2024 | 12:41 AM
కక్కలపల్లి టమోటా మార్కెట్ రెండు రోజుల తరువాత చల్లబడింది. అంటే.. సమస్య పరిష్కారమైనట్లు కాదు..! మార్కెట్ శక్తులలో కీలకమైన మండీ, లారీ అసోసియేషన్లు, బయ్యర్లు సర్దుకున్నారు. బయటి వాహనాల నుంచి భారీగా వసూళ్లకు దిగడంతో సోమవారం బయ్యర్లు రోడ్డెక్కారు. రికార్డులను లాక్కుంటున్నారని వాహనదారులు ఆందోళనకు దిగారు. ఆ రాత్రికి బెదిరింపులు రావడంతో కొందరు అజ్ఞాతంలోకి వెళ్లారు. మరుసటి ఉదయాన్నే బయ్యర్లు వేలంపాటలను బహిష్కరించారు. దీంతో వేల టన్నుల టమోటా దిగుబడులు మార్కెట్లో పేరుకుపోయాయి. దిక్కుతోచక రైతులు రోడ్డెక్కారు. మార్కెట్ రచ్చ రచ్చ అయింది. హైవేపై ధర్నా కారణంగా ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో ...
సర్దుకున్న మండీ, లారీ అసోసియేషన్లు, బయ్యర్లు
కక్కలపల్లి టమోటా మార్కెట్లో యథాతథ స్థితి
రైతుల పరిస్థితి ఏమిటో..!
అనంతపురం రూరల్/ కళ్యాణదుర్గం, ఆగస్టు 21: కక్కలపల్లి టమోటా మార్కెట్ రెండు రోజుల తరువాత చల్లబడింది. అంటే.. సమస్య పరిష్కారమైనట్లు కాదు..! మార్కెట్ శక్తులలో కీలకమైన మండీ, లారీ అసోసియేషన్లు, బయ్యర్లు సర్దుకున్నారు. బయటి వాహనాల నుంచి భారీగా వసూళ్లకు దిగడంతో సోమవారం బయ్యర్లు రోడ్డెక్కారు. రికార్డులను లాక్కుంటున్నారని వాహనదారులు ఆందోళనకు దిగారు. ఆ రాత్రికి బెదిరింపులు రావడంతో కొందరు అజ్ఞాతంలోకి వెళ్లారు. మరుసటి ఉదయాన్నే బయ్యర్లు వేలంపాటలను బహిష్కరించారు. దీంతో వేల టన్నుల టమోటా దిగుబడులు మార్కెట్లో పేరుకుపోయాయి. దిక్కుతోచక రైతులు రోడ్డెక్కారు. మార్కెట్ రచ్చ రచ్చ అయింది. హైవేపై ధర్నా కారణంగా ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో
పోలీసులు రంగప్రవేశం చేశారు. రాష్ట్రస్థాయి నుంచి ఆరా తీయడంతో మొదటికే మోసం వస్తుందని పోలీసుల సమక్షంలో పంచాయితీ పెట్టుకున్నారు. రైతుల సంగతి అటుంచి.. సంఘాలవారు, బయ్యర్లు ఏకమయ్యారు. కలిసి మెలిసి ‘వ్యాపారం’ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ పరిణామాలు రైతులకు అనుకూలమా.. ప్రతికూలమా అంటే.. రెండోదే అనాలి..! గిట్టుబాటు ధర ఇస్తారో లేదో, వచ్చిన దిగుబడులను సకాలంలో కొంటారో లేదో అన్న దిగులు అన్నదాతలను వేధిస్తోంది. గొడవ జరక్కుంటే చాలు అన్నట్లుగా అధికారులు వ్యవహరిస్తున్నారు. కానీ మార్కెట్ చట్రంలో నలిగిపోతున్న మట్టి మనిషికి న్యాయం చేయాలన్న ఆలోచన ఎవరూ చేసినట్లు కనిపించడం లేదు.
200 టన్నులు నో సేల్
అక్రమ వసూళ్లు, అసోసియేషన్లు.. బయ్యర్ల వివాదాల కారణంగా రెండు రోజుల్లో రైతులు లక్షలాది రూపాయలు నష్టపోయారు. సుమారు 200 టన్నులు నోసేల్ జాబితాలో చేరాయి. ఇవన్నీ దిబ్బలపాలయ్యాయి. కిలో కనీసం రూ.5 అనుకున్నా.. రెండు రోజుల్లో రైతులు రూ.10 లక్షలు నష్టపోయినట్లు..! రెండో రోజు టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇనచార్జి పరిటాల శ్రీరామ్ రంగప్రవేశంతో కాస్త ఆలస్యంగానైనా వేలంపాటలు మొదలయ్యాయి. లేదంటే నష్టం రెట్టింపునకు మించి ఉండేదని రైతులు అంటున్నారు. ‘అప్పు చేసి పెట్టుబడి పెడుతున్నాం. ఎంతో కష్టపడి పంట పండిస్తున్నాం. మార్కెట్లో పరిస్థితుల కారణంగా తీవ్రంగా నష్టపోతున్నాం. మండీ, లారీ ఇతర అసోసియేషన్లు వసూలు చేసే సొమ్ము భారం మాపైనే పడుతోంది. గిట్టుబాటు ధర లభించడం లేదు. మండీ వ్యాపారులు దిగుబడులను అమ్మినందుకు పది శాతం కమీషన తీసుకుంటున్నారు. వందకు ఐదు బాక్సులు మినహాయిస్తున్నారు. మండీల నిర్వాహకులకు రెండు, బయ్యర్లు మూడు బాక్సులు తీసేస్తున్నారు. ఇలా అయితే మేము బాగుపడేది ఎన్నడు..?’ అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత ఏడాది 800 టన్నులు
ఏటా జూన నుంచి ఫిబ్రవరి వరకు ఎనిమిది నెలలపాటు టమోటా మార్కెట్ జరుగుతుంది. ఆ సమయంలో వర్షాలు పడితే టమోటా నీరుకాయలు పడి రైతులు తీవ్రంగా నష్టపోతారు. గంటల వ్యవధిలో కాయలు దెబ్బతింటాయి. గత ఏడాది కక్కలపల్లి మార్కెట్లో 800 టన్నుల కాయలు నోసేల్ కింద పడ్డాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అంటే ఎనిమిది లక్షల కిలోల టమోటా దిబ్బలపాలైంది. కిలో రూ.5తో లెక్కకట్టినా రూ.40 లక్షలు నష్టపోయినట్లు. ఈ ఏడాది మార్కెట్ ప్రారంభం నుంచి దాదాపు 250 టన్నులు నోసేల్ కింద పడిపోయాయి. ఇందులో గడిచిన నాలుగైదు రోజులవే 200 టన్నులు ఉన్నాయి.
సారీలతో సర్దుకున్నారు..
కక్కలపల్లి మార్కెట్ వ్యవహారం ప్రభుత్వం దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. వ్యవహారాన్ని చక్కదిద్దాలని స్థానిక ప్రజాప్రతినిధులకు, జిల్లా పోలీస్ ఉన్నతాధికారులకు ఆదేశాలు అందినట్లు మార్కెట్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి లారీ, మండీ అసోసియేషన నాయకులు, బయ్యర్లను పోలీసు ఉన్నతాధికారులు పిలిపించినట్లు తెలిసింది. రైతులను రోడ్డుక్కెంచి ధర్నాలు చేయించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇంకోసారి ఇలా జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించినట్లు చెబుతున్నారు. దీంతో అసోసియేషన్లవారు, బయ్యర్లు సారీలు చెప్పుకుని చేతులు కలిపినట్లు తెలిసింది. ఇతర ప్రాంతాల వాహనాలను మార్కెట్లోకి అనుమతిస్తామని, అయితే అసోసియేషన వాహనాలు రెండు, బయటి వాహనం ఒకటి చొప్పున (2:1 నిష్పత్తిలో) లోడింగ్ అయ్యేలా సర్దుకున్నారని మార్కెట్లో చర్చ జరుగుతోంది. ఒప్పందాలు ఎలా ఉన్నా.. రైతులకు నష్టం కలగకుండా అధికారులు ఎలాంటి సూచనలు చేశారో తెలియడం లేదు. అసలు ఆ పంచాయితీలో రైతుల ప్రస్తావన వచ్చినట్లే కనిపించడం లేదు.
ప్రజాప్రతినిధుల వార్నింగ్..?
టమోటా మార్కెట్లో అక్రమ వసూళ్లపై స్థానిక ప్రజాప్రతినిధులు సీరియస్ అయినట్లు సమాచారం. రైతులను ఇబ్బంది పెట్టేలా వ్యవహరించవద్దని గట్టిగానే వార్నింగ్ ఇచ్చారని మార్కెట్లో చర్చ జరుగుతోంది. ఏవైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించినట్లు సమాచారం. గొడవల నేపథ్యంలో రెండు రోజులుగా వసూళ్ల పర్వం ఆగిపోయింది. మునుముందు ఏం జరుగుతుందో తేలాల్సి ఉంది.
100 బాక్సులు నో సేల్..
మూడు ఎకరాల్లో టమోటా పంటను సాగు చేశారు. వారం క్రితం 16 కిలోల టమోటా బాక్స్ రూ.400 పలికింది. ఇప్పుడు ధరలు అమాంతం పడిపోయాయి. కక్కలపల్లి మార్కెట్కు వంద బాక్సుల టమోటా తీసుకెళితే.. నో సేల్ అనేశారు. కష్టపడి పండించిన పంటను అమ్ముకోలేకపోయాను. ఇలా అయితే పంటలు ఎలా పండించాలి...? మా భవిష్యత్తు ఏమిటో అర్థం కావడం లేదు.
- శ్రీనివాసులు, కంబదూరు
కొనడంలేదు..
టమోటా ధరలు అమాంతం పడిపోయాయి. మొన్నటివరకు బాక్సు రూ.300 ప్రకారం కొనుగోలు చేశారు. ఇప్పుడు నో సేల్ అంటున్నారు. కక్కలపల్లి మార్కెట్కు తీసుకువెళ్లిన 75 బాక్సులకు వదిలేసిరావాల్సి వచ్చింది. రెండు ఎకరాల్లో రూ.2 లక్షలు వరకు ఖర్చు చేసి పంట పండించాను. పెట్టుబడి కూడా దక్కకుండా పోయింది.
- ఈరన్న, శెట్టూరు
నట్టేట మునిగాం..
రెండున్నర ఎకరాల్లో రూ.2 లక్షల వరకు ఖర్చు చేసి టమోటా సాగు చేశాను. పెట్టుబడి కూడా దక్కలేదు. పతనమైన టమోటా ధరలతో నట్టేట మునిగాం. 120 బాక్సులు కక్కలపల్లి మార్కెట్కు తీసుకెళితే నో సేల్ అన్నారు. దిక్కుతోచని స్థితిలో ఉన్నాం. టమోటా సాగు చేయాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం టమోటా రైతులను ఆదుకోవాలి.
- వీరారెడ్డి, కుందుర్పి
మరిన్ని అనంతపురం వార్తల కోసం....