Share News

Central Team : విజయవాడను ఆదుకుంటాం

ABN , Publish Date - Sep 13 , 2024 | 04:46 AM

రికార్డు స్థాయి భారీ వర్షాలు, వరదలు విజయవాడను అతలాకుతలం చేశాయని కేంద్ర బృందం అభిప్రాయపడింది.

 Central Team : విజయవాడను ఆదుకుంటాం

  • పెద్ద విపత్తే.. మనోధైర్యం కోల్పోవద్దు

  • కేంద్ర బృందం భరోసా

  • విజయవాడ, ఎన్టీఆర్‌ జిల్లాల్లో పర్యటన

విజయవాడ, గుంటూరు, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): రికార్డు స్థాయి భారీ వర్షాలు, వరదలు విజయవాడను అతలాకుతలం చేశాయని కేంద్ర బృందం అభిప్రాయపడింది. ఒక ముప్పునుంచి తప్పించుకునే లోపే మరో ముప్పు .. ఇలా వర్షాలు.. వరదలు ఒకేసారి విరుచుకు పడటం వల్ల విజయవాడలో దాదాపుగా సగానికి పైగా ప్రాంతం ముంపునకు గురైందని గుర్తించింది. విజయవాడతో పాటు ఎన్టీఆర్‌ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలు కూడా భారీ విపత్తునే చవిచూశాయని అభిప్రాయపడింది. విపత్తు మిగిల్చిన నష్టం పూడ్చేందుకు తమ వంతు కృషి చేస్తామని, మనో ధైర్యం కోల్పోవద్దని కేంద్ర బృందం.... ఎన్టీఆర్‌ జిల్లా యంత్రాంగానికి హామీ ఇచ్చింది.

గురువారం కేంద్ర హోం శాఖ జాయింట్‌ సెక్రటరీ అనిల్‌ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని కేంద్ర బృందం ఎన్టీఆర్‌ జిల్లాలో పర్యటించింది. జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో వివిధ శాఖల నేతృత్వంలో జరిగిన నష్టాలకు సంబంఽధించి ఫొటో ఎగ్జిబిషన్‌, పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ను ఏర్పాటుచేశారు. జిల్లాకు సంబంధించిన నష్టాలను కలెక్టర్‌ సృజన వివరించారు. అనంతరం కేంద్ర బృందం ప్రకాశం బ్యారేజీ దగ్గరకు వెళ్లి, ఇటీవల బోట్లు ఢీకొట్టిన ప్రాంతాన్ని పరిశీలించింది.

బోట్ల తొలగింపు పనుల గురించి తెలుసుకున్నారు. తర్వాత బుడమేరు డైవర్షన్‌ చానల్‌, గండ్లుపడిన ప్రాంతాలను పరిశీలించారు. జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్‌తో కేంద్ర బృందం కొద్దిసేపు చర్చించింది. బుడమేరు గట్ల బలోపేతం కోసం చేస్తున్న పనులను పరిశీలించింది. అనంతరం ఇబ్రహీంపట్నం మండలం ఈలప్రోలులో వరి పంటకు జరిగిన నష్టాన్ని పరిశీలించారు. కాగా, వరద నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్రబృందం గురువారం గుంటూరు జిల్లాలో పర్యటించింది. శాఖల వారీగా జరిగిన నష్టం, చేపట్టిన సహాయక చర్యల గురించి కలెక్టర్‌ ఎస్‌ నాగలక్ష్మి.. పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు.

Updated Date - Sep 13 , 2024 | 04:47 AM