Share News

Chandragiri : ప్రాణాలు తీసిన కంటైనర్‌

ABN , Publish Date - Sep 13 , 2024 | 03:52 AM

టమాటా లోడుతో వస్తున్న కంటైనర్‌ లారీ.. ఘాట్‌ రోడ్డు మలుపులో అదుపుతప్పి ఇన్నోవా కారుపై ఒరిగి పడింది. దీంతో ఇన్నోవా కారు అణిగిపోయి అందులో ఉన్న ముగ్గురు దుర్మరణం పాలయ్యారు.

Chandragiri : ప్రాణాలు తీసిన కంటైనర్‌

  • మలుపులో అదుపుతప్పి ఇన్నోవాపై ఒరిగిన లారీ.. కారు లోపలున్న ముగ్గురు దుర్మరణం

  • ఒకరికి తీవ్ర గాయాలు.. రుయా ఆస్పత్రికి తరలింపు

  • తిరుపతి జిల్లా భాకరాపేట ఘాట్‌ రోడ్డులో ప్రమాదం.. మృతులంతా కర్ణాటక వాసులు

చంద్రగిరి, సెప్టెంబరు 12: టమాటా లోడుతో వస్తున్న కంటైనర్‌ లారీ.. ఘాట్‌ రోడ్డు మలుపులో అదుపుతప్పి ఇన్నోవా కారుపై ఒరిగి పడింది. దీంతో ఇన్నోవా కారు అణిగిపోయి అందులో ఉన్న ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. తిరుపతి జిల్లా చంద్రగిరి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని భాకరాపేట ఘాట్‌ రోడ్డులో గురువారం మధ్యాహ్నం ఈ ఘోరం జరిగింది. మృతులు, క్షతగాత్రుడిని కర్ణాటక రాష్ట్రం చిక్కబళ్ళాపూర్‌కు చెందిన వారిగా గుర్తించారు. అన్నమయ్య జిల్లా కలకడ నుంచీ టమాటా లోడుతో కంటైనర్‌ లారీ చెన్నై బయల్దేరింది. అది పీలేరు మీదుగా తిరుపతికి వస్తూ మార్గమధ్యంలో భాకరాపేట ఘాట్‌ రోడ్డు మొదటి మలుపులో అదుపు తప్పి పక్కనే ఎదురు వెళుతున్న ఇన్నోవా కారుపై ఒరిగిపోయింది. దీంతో కంటైనర్‌ కింద ఇన్నోవా కారు అణిగిపోయి అందులో ప్రయాణిస్తున్న నలుగురిలో రమేశ్‌ మూర్తి (34), మంజునాధ (38), మునివెంకటరెడ్డి (58) అక్కడికక్కడే మృతిచెందగా.. తీవ్రంగా గాయపడిన తేజేశ్‌ కుమార్‌ను రుయా ఆస్పత్రికి తరలించారు. వీరంతా తిరుమల వెళ్లి తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురయ్యారు. పోలీసులు కంటైనర్‌ను తొలగించడానికి సమయం పట్టడంతో మధ్యాహ్నం 2.30 గంటల నుంచీ సాయంత్రం 5గంటల వరకూ ట్రాఫిక్‌ భారీగా స్తంభించింది.

Updated Date - Sep 13 , 2024 | 03:52 AM