Share News

ఇక సాగు మీటర్లకు చెక్‌!

ABN , Publish Date - Aug 02 , 2024 | 04:50 AM

జగన్‌ ప్రభుత్వంలో అస్మదీయులకు ఆర్థిక లబ్ధిని చేకూర్చడం ద్వారా రాష్ట్రంపై తీవ్ర ఆర్థిక భారం పడేలా తీసుకున్న ప్రధాన నిర్ణయాలపై పునఃసమీక్ష చేసేందుకు ఇంధన శాఖ సిద్ధమవుతోంది.

ఇక సాగు మీటర్లకు చెక్‌!
No Cultivation Meters

రైతులకు మేలు చేసేలా ‘పీఎం కుసుమ్‌’

ఈ పథకం ద్వారా ఉచిత సోలార్‌ విద్యుత్‌

టీడీపీ కూటమి ప్రభుత్వం యోచన

గత ప్రభుత్వంలో 18 లక్షల పంప్‌సెట్లకు 4000 కోట్లతో మీటర్లు బిగించాలని నిర్ణయం

7,000 మెగావాట్ల కొనుగోలుకూ ఒప్పందం

షిర్డీ సాయి, సెకీ ఒప్పందాలపై త్వరలో సమీక్ష


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

జగన్‌ ప్రభుత్వంలో అస్మదీయులకు ఆర్థిక లబ్ధిని చేకూర్చడం ద్వారా రాష్ట్రంపై తీవ్ర ఆర్థిక భారం పడేలా తీసుకున్న ప్రధాన నిర్ణయాలపై పునఃసమీక్ష చేసేందుకు ఇంధన శాఖ సిద్ధమవుతోంది. రాష్ట్ర విద్యుత్‌ సంస్థలు, వినియోగదారులపై మోయలేని భారం వేసేలా తీసుకున్న నిర్ణయాలపై హేతుబద్ధమైన నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. రాష్ట్రంలోని 18 లక్షల వ్యవసాయ పంప్‌సెట్లకు రూ.4,000 కోట్లతో స్మార్ట్‌ మీటర్లను బిగించే కార్యక్రమాన్ని ఆపేసి రైతులకు మేలు చేయాలన్న యోచనలో ప్రభుత్వం ఉంది. కేంద్రం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి కిసాన్‌ ఉర్జా ఏవమ్‌ సురక్షా ఉత్తాన్‌ మహభియాన్‌ (పీఎం కుసుమ్‌) పథకాన్ని అమలు చేయడం ద్వారా రాష్ట్రంలోని రైతులందరికీ ప్రయోజనం కల్పించాలని భావిస్తోంది. ఈ పథకం వద్దని గతంలో జగన్‌ ప్రభుత్వం కేంద్రానికి చెప్పింది. సాగు మీటర్ల బిగింపు కాంట్రాక్టును అస్మదీయ కంపెనీకి ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుందనే విమర్శలున్నాయి. గుజరాత్‌లో పీఎం కుసుమ్‌ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తుండటం, ఏపీలో కూటమి ప్రభుత్వం రావడంతో రాష్ట్రంలో ఈ పథకం అమలు చేసే దిశగా మళ్లీ కదలిక వచ్చింది. ఈ పథకం కింద రాష్ట్రంలోని వ్యవసాయ పంప్‌ సెట్లకు సోలార్‌ విద్యుత్‌ను అందించేలా వ్యవసాయ యోగ్యం కాని భూముల్లో 10,000 మెగావాట్ల దాకా గ్రిడ్‌ కనెక్టెడ్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ పవర్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునేందుకు (ఆర్‌ఈపీపీ) కేంద్రం అనుమతులు ఇస్తోంది. అదే విధంగా వాటర్‌ యూజర్స్‌ అసోసియేషన్లు, కొంతమంది రైతులు గ్రూపుగా, వ్యక్తిగతంగానూ 500 కిలోవాట్ల నుంచి 2 మెగావాట్ల దాకా సోలార్‌ ఆధారిత ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు సహకారం అందిస్తుంది. ఈ పథకం కింద కిలోవాట్‌కు 60 పైసలు లేదా మెగావాట్‌కు ఆరు లక్షల రూపాయలను చెల్లించేందుకు కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ ఆమోదించింది. 17.5 లక్షల వ్యవసాయ పంప్‌ సెట్లకు పీఎం కుసుమ్‌ పథకాన్ని అమలు చేయాలని కేంద్రం లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ పథకాన్ని అమలు చేస్తే డిస్కమ్‌ల నుంచి అధిక ధరలతో కూడిన విద్యుత్‌ను రైతులు తీసుకునే అవసరం ఉండదని కేంద్రం చెబుతోంది. రాష్ట్రంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ పథకాన్ని అందిస్తున్నా, విద్యుత్‌ వినియోగానికి అయ్యే భారాన్ని డిస్కమ్‌లకు ప్రభుత్వం చెల్లిస్తోంది. పీఎం కుసుమ్‌ పథకాన్ని అమలు చేస్తే జీవితాంతం రైతులకు ఉచిత సోలార్‌ విద్యుత్‌ అందు తుందని, పగటిపూట సౌర విద్యుత్‌ ద్వారా పంప్‌సెట్లను వాడుకోవచ్చని కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ చెబుతోంది.


అస్మదీయులకు కాంట్రాక్టులు

జగన్‌ సీఎంగా ఉన్నప్పుడు అస్మదీయ సంస్థ షిర్డీ సాయికి ఆర్థిక లబ్ధిని చేకూర్చేందుకు వీలుగా వ్యవసాయ పంప్‌ సెంట్లకు స్మార్ట్‌ మీటర్లను బిగించే కార్యక్రమానికి ప్రణాళిక రచించారు. కేంద్రం అమలు చేస్తున్న రీవ్యాంప్డ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సెక్టార్‌ స్కీమ్‌ (ఆర్‌డీఎస్ఎస్)ను తెరపైకి తీసుకువచ్చారు. గత ఏడాది గృహాలకు, వ్యవసాయ పంప్‌సెట్లకు మీటర్లను బిగించేందుకు డిస్కమ్‌లు టెండర్లను పిలిచాయి. పట్టణాల్లో మీటర్లు బిగించే పనులను అదానీ, రాష్ట్రంలోని 18 లక్షల వ్యవసాయ పంప్‌ సెట్లకు మీటర్లు బిగించే బాధ్యతలను షిర్డీసాయి దక్కించుకుంది. ఒక్కో వ్యవసాయ పంప్‌సెట్‌కు స్మార్ట్‌ మీటరు బిగించేందుకు రూ.6,000 ధరను కేంద్రం ఖరారు చేసింది. ఈ పథకం కోసం రూ.4,000 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా వ్యవసాయ పంప్‌సెట్లకు మీటర్లను బిగించారు. నెలవారీ కరెంటు బిల్లుల మొత్తాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో వేస్తామని, వాటిని డిస్కమ్‌లకు క్రమం తప్పకుండా రైతులు చెల్లించాలని గత ప్రభుత్వం చెప్పింది. రాష్ట్రంలో స్మార్ట్‌ మీటర్ల అమలు కోసం డిస్కమ్‌లు రూ.14,000 కోట్ల మేర రుణాన్ని పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా తీసుకుంది. ఈ భారాన్ని ఎలా మోయాలో, ఏం చేయాలో డిస్కమ్‌లకు అర్థం కావడం లేదు.


సెకీకి లేఖ రాసే యోచన

డిస్కమ్‌లపై 25 ఏళ్లకు దాదాపు రూ.75,000 కోట్ల భారం పడేలా సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌తో గత ప్రభుత్వంలో విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాన్ని చేసుకున్నారు. ఈ ఒప్పందం మేరకు సెకీ ఈ ఏడాది సెప్టెంబరులో 3,000 మెగావాట్లు, వచ్చే ఏడాది మరో 3,000 మెగావాట్లు, 2026లో మిగిలిన వెయ్యి మెగావాట్లను రాష్ట్రానికి సరఫరా చేయాల్సి ఉంది. రాష్ట్రంలో పీఎం కుసుమ్‌ పథకాన్ని అమలుచేస్తే సెకీతో 7,000 మెగావాట్ల విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం అమలు చేయాల్సిన అవసరం ఉండదని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఒప్పందం మేరకు సెప్టెంబరు నుంచే తొలిదశ విద్యుత్‌ను సరఫరా చేస్తారా లేక జాప్యం అవుతుందా అని సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌కు ప్రభుత్వం లేఖ రాసే యోచనలో ఉందని చెబుతున్నారు. ఒకవేళ తీవ్ర జాప్యమైతే ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేసుకోకూడదంటూ సెకీని ప్రశ్నించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని తెలుస్తోంది.

Updated Date - Aug 02 , 2024 | 09:08 AM