Share News

ఏరియా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేస్తాం

ABN , Publish Date - Oct 15 , 2024 | 11:44 PM

పిఠాపురం, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): పిఠాపురం నియోజకవర్గంతోపాటు పరిసర ప్రాంతాలకు ప్రధాన ఆస్పత్రిగా ఉన్న కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ను ఏరియా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేస్తామని కలెక్టర్‌ షాన్‌మోహన్‌ వెల్లడించారు. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం లభించగానే అదనపు భవనాల నిర్మాణంతోపాటు స్పె

ఏరియా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేస్తాం
పిఠాపురం ప్రభుత్వాస్పత్రిలో ఎక్స్‌రే మిషన్‌, వైద్య పరికరాలను ప్రారంభిస్తున్న కలెక్టరు, నాయకులు

పిఠాపురం ఆస్పత్రిలో ఎక్స్‌రే ప్లాంట్‌ ప్రారంభించిన కలెక్టరు

పిఠాపురం, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): పిఠాపురం నియోజకవర్గంతోపాటు పరిసర ప్రాంతాలకు ప్రధాన ఆస్పత్రిగా ఉన్న కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ను ఏరియా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేస్తామని కలెక్టర్‌ షాన్‌మోహన్‌ వెల్లడించారు. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం లభించగానే అదనపు భవనాల నిర్మాణంతోపాటు స్పెషలిస్టు వైద్యుల నియామకం, ఇతర మౌలిక సదుపాయాల కల్పన పనులు చేపడతామని తెలిపారు. పిఠాపురం పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ (ప్రభుత్వాసుపత్రి)లో కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ సామాజిక బాద్యత(సీఎస్‌ఆర్‌) కింద రూ.15లక్షలతో సమకూర్చిన ఎక్స్‌రే మిషన్‌, ఇతర వైద్యపరికరాలను సంస్థ ప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ, జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి మర్రెడ్డి శ్రీనివాసరావులతో కలిసి ఆయన మంగళవారం ప్రారంభించారు. ఆస్పత్రి నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసిందని, వీటితో ఆ స్పత్రి ఆవరణలో సీసీ రోడ్డు నిర్మాణంతోపాటు భవనాలకు మరమ్మతులు, తాగునీటి సదుపా యం, ఇతర వసతులను కల్పిస్తామని తెలిపారు.

38 గుర్తించి 9 పనులు పూర్తి చేశాం

ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ఆదేశాల మేరకు పిఠాపురం నియోజకవర్గంలో అత్యవసరంగా చేయాల్సిన 38 అంశాలను గుర్తించామని, ఇందులో 9 అంశాలకు సంబంధించిన పనులను పూర్తి చేశామని కలెక్టరు తెలిపారు. దీపావళి నాటికి మిగిలిన పనులకు సంబంధించి ప్రభుత్వం లేదా సీఎస్‌ఆర్‌ నిధులతో చేపట్టి మూడు నెలల్లో పూర్తి చేస్తామని ఆయన అన్నారు. కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ కాకినాడ యూనిట్‌ హెడ్‌ సీహెచ్‌ శ్రీనివాసరావు, జీఎం(హెచ్‌ఆర్‌) పి.పద్మనాభం, సీఎస్‌ఆర్‌ మేనేజరు వంశీకృష్ణ, సీహెచ్‌సీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్‌ సుజాత, మునిసిపల్‌ కమిషనరు కనకారావు, తహసీల్దారు వీవీ గోపాలకృష్ణ ఉన్నారు.

క్రీడా నైపుణ్యం పెంపొందించేందుకు ప్రాధాన్యం : కలెక్టర్‌

పిఠాపురం, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతోపాటు వారిలో క్రీడా నైపుణ్యం పెంపొందించేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని కలెక్టరు షాన్‌మోహన్‌ తెలిపారు. పిఠాపురం నియోజకవర్గంలో క్రీడామైదానాలు ఉన్న 32 ప్రభుత్వ, జడ్పీ, మునిసిపల్‌ ఉన్నత పాఠశాలలను గుర్తించి సీఎస్‌ఆర్‌ నిధులు రూ.16లక్షలతో ప్రతి పాఠశాలకు 21 క్రీడాపరికరాలతో ఉన్న కిట్లు రెండు వం తున అందజేయాలని నిర్ణయించారు. ఇందులో తొలివిడతగా 14 పాఠశాలలకు ఒక్కొక్క కిట్టు వంతున అందజేసే కార్యక్రమానికి పిఠాపురం ప ట్టణంలోని ఆర్‌ఆర్‌బీహెచ్‌ఆర్‌ ప్రభు త్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఎస్వీ ఎస్‌ఎన్‌ వర్మ, జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి మర్రెడ్డి శ్రీనివాసరావులతో కలిసి కలెక్టరు విద్యార్థులు, ఉపాధ్యాయులకు క్రీడాకిట్లు అందజేశారు. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ఆదేశాల మేరకు విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసి వారు పోటీల్లో ప్రావీణ్యత చూపేలా తీర్చిదిద్దుతామని తెలిపారు. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి.శ్రీనివాసరావు, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Oct 15 , 2024 | 11:44 PM