Share News

ర్యాగింగ్‌ భూతం మింగేసింది!

ABN , Publish Date - Aug 29 , 2024 | 11:25 PM

ఎన్నో ఆశలతో కలికిరి జేఎన్టీయూలో రెండో సంవత్సరం బీటెక్‌లో చేరిన చిన్న కుమారుడు ప్రవీణ్‌ (19) కళాశాలలో చేరిన మూడు రోజులకే హాస్టల్‌లో సీనియర్లు చేసిన ర్యాగింగ్‌ భూతానికి బలయ్యాడని తల్లిదండ్రులు చెబుతున్నారు.

ర్యాగింగ్‌ భూతం మింగేసింది!
ఇంజనీరింగ్‌ విద్యార్థి ప్రవీణ్‌ (ఫైల్‌)

కలికిరి జేఎన్టీయూ బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్య

స్వస్థలం కడప జిల్లా ఖాజీపేట మండలం మల్లాయపల్లె

సీనియర్‌ విద్యార్థులు వేధించారనే ఆరోపణలు

కలికిరి పోలీసులతో కలిసి దర్యాప్తు చేస్తున్న మైదుకూరు పోలీసులు

కలికిరి/మైదుకూరు రూరల్‌, ఆగస్టు 29: తండ్రి మెకానిక్‌ పనిచేస్తూ పిల్లలను పెద్ద చదువులు చదివిస్తున్నాడు. పెద్ద కుమారుడు బీటెక్‌ పూర్తి చేయగా రెండో కుమారుడు బీటెక్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు. పిల్లల చదువు పూర్తయితే తమ కష్టాలు తీరుతాయని ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ తల్లిదండ్రుల ఆశలు అడియాసలయ్యాయి. ఎన్నో ఆశలతో కలికిరి జేఎన్టీయూలో రెండో సంవత్సరం బీటెక్‌లో చేరిన చిన్న కుమారుడు ప్రవీణ్‌ (19) కళాశాలలో చేరిన మూడు రోజులకే హాస్టల్‌లో సీనియర్లు చేసిన ర్యాగింగ్‌ భూతానికి బలయ్యాడని తల్లిదండ్రులు చెబుతున్నారు. వివరాలిలా ఉన్నాయి. కడప జిల్లా ఖాజీపేట మండలం మల్లాయపల్లెకు చెందిన నంద, వసంత దంపతులు తమ స్వగ్రామం నుంచి మైదుకూరు మండలం జీవీ సత్రం వెళ్లి మెకానిక్‌గా పనిచేస్తూ స్థిరపడ్డారు. ఆ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు బీటెక్‌ పూర్తి చేయగా చిన్నకుమారుడు ప్రవీణ్‌ పులివెందుల లయోలా పాలిటెక్నిక్‌ కాలేజీలో పాలిటెక్నిక్‌ పూర్తి చేశాడు. ఇంజనీరింగ్‌ చేసేందుకు ఈ-సెట్‌లో ర్యాంకు తెచ్చుకున్నాడు. మూడో విడత కౌన్సెలింగ్‌లో కలికిరిలోని జేఎన్‌టీయూలో సీటు వచ్చింది. బీటెక్‌ (మెకానికల్‌) రెండో సంవత్సరంలో ఈ నెల 12న చేరి ఈనెల 20వ తేదీ కళాశాలకు వచ్చి మూడు రోజులపాటు తరగతులకు హాజరయ్యాడు. హాస్టల్‌లో ర్యాగింగ్‌ ఎక్కువగా ఉండటంతో భయపడి 23వ తేదీ ఇంటికి వచ్చాడు. అదే విషయం ఇంట్లో చెప్పాడు. అయితే ర్యాగింగ్‌ అనేది మామూలేనని, కాలేజీకి వెళ్లాలని ఇంట్లో వాళ్లు చెప్పడంతో కొన్నిరోజుల తర్వాత వెళతానని వారికి సమాధానం ఇచ్చాడు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి పురుగుల మందు తాగాడు. బుధవారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురైన ప్రవీణ్‌ను కుటుంబ సభ్యులు మైదుకూరు ఆసుపత్రికి తీసుకెళ్లారు. సాయంత్రం డిస్చార్జ్‌ చేశారు. ఇంటికి వచ్చిన కాసేపటికే పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో వేలూరు సీఎంసీకి తీసుకెళ్లారు. అయితే అక్కడ వైద్యులు బతకడని చెప్పి అడ్మిట్‌ చేసుకోలేదు. దీంతో తిరుపతి స్విమ్స్‌ ఆసుపత్రికి వచ్చి తెల్లవారుజామున చేర్పించగా వెంటనే అతను మృతి చెందాడు. హాస్టల్‌లోని సీనియర్‌ విద్యార్థులు ర్యాగింగ్‌ చేసిన కారణంగానే ప్రవీణ్‌ బలవన్మరణానికి పాల్పడ్డట్లు ప్రచారం జరుగుతోంది. తన మేనల్లుడు ప్రవీణ్‌ను సీనియర్‌ విద్యార్థులు ర్యాగింగ్‌ చేసిన కారణంగానే మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రవీణ్‌ మేనమామ గుర్రంకొండ చంద్ర మైదుకూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు మైదుకూరు పోలీసులు జేఎన్టీయూ ఇంజినీరింగ్‌ కళాశాలలో దర్యాప్తు చేస్తున్నారు. కలికిరి ఇన్‌స్పెక్టర్‌ కె.రెడ్డి శేఖర్‌ రెడ్డి కూడా మైదుకూరు పోలీసులతో కలిసి విచారణ చేస్తున్నారు. కలికిరి పోలీసులతో కలిసి మైదుకూరు పోలీసులు గురువారం కళాశాల ప్రిన్సిపాల్‌, అధ్యాపకులు, సహచర విద్యార్థులను క్షుణ్ణంగా విచారించారు. ప్రవీణ్‌ ఆత్మహత్యకు ర్యాగింగ్‌ కారణమా లేదంటే మరేదయినా కారణాలున్నాయా అన్న కోణాల్లో పోలీసులు గురువారం రాత్రి వరకూ కళాశాలలోనే విచారణ జరుపుతున్నారు. ప్రవీణ్‌ కళాశాలలో చేరి మూడు రోజులు మాత్రమే ఉన్నాడని, ఈ మూడు రోజుల్లోనే ఏమి జరిగి ఉండొచ్చనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రవీణ్‌ ఎవరితో కలివిడిగా ఉండలేదని, ముభావంగా ఉండేవాడని తోటి విద్యార్థులు చెబెతున్నట్లు తెలిసింది. కొంతమంది సీనియర్‌ విద్యార్థులు కలుగజేసుకుని ఇలా ముభావంగా వుంటే ఎలాగంటూ చురుగ్గా ఉండాలని ప్రోత్సహించేందుకు మాత్రం ప్రయత్నించినట్లు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. ఇప్పటి వరకూ ర్యాగింగ్‌ కారణంగానే ప్రవీణ్‌ ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తేగానీ అసలు విషయం బయటకు రాదని చెబుతున్నారు.

Updated Date - Aug 29 , 2024 | 11:25 PM