Share News

అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్టు

ABN , Publish Date - Oct 12 , 2024 | 04:26 AM

గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను కృష్ణాజిల్లా పోలీసులు అదుపులోకి తీసుకొని రూ.6 లక్షలకు పైగా విలువైన 28 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్టు

పెనమలూరు, అక్టోబరు 11: గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను కృష్ణాజిల్లా పోలీసులు అదుపులోకి తీసుకొని రూ.6 లక్షలకు పైగా విలువైన 28 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి శుక్రవారం కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్‌.గంగాధరరావు పెనమలూరు పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు.. సెప్టెంబరు 28న గన్నవరం సమీపంలోని ఆత్కూరు వద్ద జాతీయ రహదారిపై వాహన తనిఖీలు చేపట్టగా పోలీసులను చూసి స్కూటీపై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు వాహనాన్ని వదిలి పారిపోయారు.

ఆ వాహనాన్ని, అందులోని బ్యాగులను తనిఖీ చేయగా 28 కిలోల గంజాయి లభ్యమైంది. దొరికిన ఆధారాల ఆధారంగా ఆత్కూరు పోలీసులు నిందితులను గుర్తించారు. ఈ ముఠాలోని ఆరుగురు నిందితుల్లో కేరళ రాష్ర్టానికి చెందిన నలుగురు, ఒడిశాలోని కోరాపుట్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. నిందితులను అదుపులోకి తీసుకొనే విషయంలో ప్రత్యేక చొరవ తీసుకొన్న గన్నవరం డీఎస్పీ చలసాని శ్రీనివాసరావును, మిగిలిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, గంజాయి నిర్మూలనే ధ్యేయంగా పోలీసు శాఖ పనిచేస్తుందని, గంజాయి సరఫరాదారులపై ఎన్డీపీఎస్‌ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు.

Updated Date - Oct 12 , 2024 | 04:26 AM