Share News

Rain News: ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు.. ఆదివాసీల గృహాలపై విరిగిపడ్డ కొండ చరియలు

ABN , Publish Date - Sep 09 , 2024 | 10:39 AM

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ తీరం దాటనుండడంతో ఆ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో వరదలు ఉప్పొంగుతున్నాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. జనాలు ఇళ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఏమాత్రం లేదు. అల్లూరి జిల్లా చింతపల్లి- నర్సీపట్నం ప్రధాన రహదారిలో రాకపోకలు బంద్ అయ్యాయి.

Rain News: ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు.. ఆదివాసీల గృహాలపై విరిగిపడ్డ కొండ చరియలు

అనకాపల్లి: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ తీరం దాటనుండడంతో ఆ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో వరదలు ఉప్పొంగుతున్నాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. జనాలు ఇళ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఏమాత్రం లేదు. అల్లూరి జిల్లా చింతపల్లి- నర్సీపట్నం ప్రధాన రహదారిలో రాకపోకలు బంద్ అయ్యాయి. రెండు రోజుల వర్షానికి పలుచోట్ల కాజ్‌వేలు కొట్టుకుపోయాయి. మడిగుంట, రాజుపాకలు గ్రామాల వద్ద వరద ఉధృతికి కాజ్ వేలు కొట్టుకుపోయాయి. గిరిజన ప్రాంతంలో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో తెల్లవారుజాము నుంచి చింతపల్లి- నర్సీపట్నం మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. రింతాడ గ్రామం వద్ద మరో కాజ్‌వే కూడా కొట్టుకొని పోవడంతో సీలేరు -చింతపల్లి మార్గంలో కూడా రాకపోకలు నిలిచిపోయాయి. కాజ్ వేలు పునరుద్ధరణ చర్యలను జాతీయ రహదారి అధికారులు మొదలుపెట్టారు.


ఆదివాసీల గృహాలపై విరిగిపడ్డ కొండ చరియలు..

అల్లూరి జిల్లాలో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీలో ఎడతెరిపిలేని వానలు పడుతున్నాయి. ఈ ప్రభావంతో ఏజెన్సీలోని ఆదివాసీల గృహాలపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఒక బాలిక వరదలో గల్లంతు అవగా.. నలుగురు గిరిజనులకు గాయాలు అయ్యాయి. గూడెం కొత్తవీధి మండలం గాలికొండ పంచాయితీ చట్రపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఆదివారం రాత్రి భారీగా కురిసిన వర్షానికి కొండపై నుంచి కొండచరియలు జారిపడ్డాయి. ప్రభుత్వం తమను ఆదుకోవాలని గిరిజన గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

డొంకరాయి జలాశయానికి వరద..

అల్లూరి జిల్లాలోని సీలేరు కాంప్లెక్స్‌లో ఉన్న డొంక‌రాయి జ‌లాశ‌యానికి ఎగువ ప్రాంతం నుంచి భారీ వరద వస్తోంది. దీంతో సోమవారం తెల్లవారుజాము నుంచి జ‌లాశ‌యం నుంచి లక్ష 10 వేలు క్యూసెక్కులు నీటిని దిగువ‌కు విడుద‌ల‌ చేస్తున్నారు. డొంక‌రాయి జ‌ల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి అనంతరం ప‌వ‌ర్ కెనాల్ నుంచి 4 వేలు క్యూసెక్కులు నీటిని విడుద‌ల‌ చేస్తున్నారు. ఇక డొంక‌రాయి జ‌లాశ‌యానికి ఇన్‌ఫ్లో లక్ష 10 వేలు క్యూసెక్కులుగా ఉంది.


మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో పార్వతీపురం మన్యం, విజయనగరం ఉభయ జిల్లాలలోని జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. కాగా ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం, మంత్రులు, శాసనసభ్యులు విస్తృత ఏర్పాట్లు చేశారు. నిన్న (ఆదివారం) ఒక్కరోజు విజయనగరం జిల్లాలో 10, పార్వతీపురం మన్యం జిల్లాలో 2.7 సెంటీమీటర్లు చొప్పున వర్షపాతం నమోదైంది.


మరోవైపు గోదావరి జిల్లాల్లోనూ వర్షాలు కొనసాగుతున్నాయి. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో సుబ్బారెడ్డి సాగర్ ఏటి కాలువ పొంగి పొర్లుతోంది. పెద్దిపాలెం వేములపాలెంలతో పాటు గిరిజన గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి.

అనకాపల్లి జిల్లా రావికమతం మండలం కళ్యాణపురంలో రిజర్వాయర్‌లోకి భారీగా వరద నీరు చేరుతోంది. 2 గేట్లు ఎత్తి 200 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు.

Updated Date - Sep 09 , 2024 | 10:40 AM