Share News

సామర్ధ్యాల పెంపునకు లిప్‌

ABN , Publish Date - Aug 28 , 2024 | 12:16 AM

సాధారణంగా తరగతికి ప్రవేశం పొందే విద్యార్థికి కింది తరగతుల అభ్యసన సామర్ధ్యాలు ఉండాలి. అయితే కొందరు విద్యార్థులకు అభ్యసన సామర్ధ్యాలు లేకుండానే పైతరగతుల్లో ప్రవేశం పొందుతున్నట్టు విద్యాశాఖ గుర్తించింది. ఈ పరిస్థితులను అధిగమించేందుకు విద్యాశాఖ లెర్నింగ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రోగ్రాం(లి్‌ప)ను అమలు చేస్తోంది. ఉమ్మడి జిల్లాలోని అన్ని మేనేజ్‌మెంట్ల పరిధిలోని పాఠశాలలో 6 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేక అభ్యసన కార్యక్రమం అమలు చేస్తున్నారు.

సామర్ధ్యాల పెంపునకు లిప్‌
వేములపల్లిలోని మోడల్‌ స్కూల్‌లో విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాన్ని పరిశీలిస్తున్న డీఈవో భిక్షపతి

ఈ విద్యాసంవత్సరంలో 6 నుంచి 9వ తరగతి వరకు పకడ్బందీగా అమలు

నల్లగొండ, ఆగస్టు 27: సాధారణంగా తరగతికి ప్రవేశం పొందే విద్యార్థికి కింది తరగతుల అభ్యసన సామర్ధ్యాలు ఉండాలి. అయితే కొందరు విద్యార్థులకు అభ్యసన సామర్ధ్యాలు లేకుండానే పైతరగతుల్లో ప్రవేశం పొందుతున్నట్టు విద్యాశాఖ గుర్తించింది. ఈ పరిస్థితులను అధిగమించేందుకు విద్యాశాఖ లెర్నింగ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రోగ్రాం(లి్‌ప)ను అమలు చేస్తోంది. ఉమ్మడి జిల్లాలోని అన్ని మేనేజ్‌మెంట్ల పరిధిలోని పాఠశాలలో 6 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేక అభ్యసన కార్యక్రమం అమలు చేస్తున్నారు. 2023-24 విద్యా సంవత్సరంలోనే ఈ కార్యక్రమం అమలులోకి వచ్చినా, ఉపాధ్యాయులపై రికార్డుల భారం అధికంగా ఉండేది. దీన్ని దృష్టిలో ఉంచుకొని 2024-25 విద్యా సంవత్సరంలో ఈ కార్యక్రమాన్ని సరళతరం చేసి అమలుచేస్తున్నారు.

ఉపాధ్యాయులు చేపట్టాల్సిన అంశాలివి..

. ప్రతీ ఉపాధ్యాయుడు 6 నుంచి 9వ తరగతి వరకు బోధించే సబ్జెక్టులకు వార్షిక ప్రణాళిక రూపొందించాల్సి ఉంటుంది. టీచర్‌ డైరీ తప్పకుండా రాయాలి. పిరియడ్‌ ప్లాన్‌, సబ్జెక్టు పాఠ్యాంశం, ఉప భావనలు, సంబంధిత పాఠ్యాంశ బోధనలో విద్యార్థులు సాధించే అభ్యసన ఫలితాలను పొందుపరచాలి.

. సబ్జెక్టు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ప్రతీ మూడు నెలలకొకసారి స్వీయ పరిశీలన పత్రాన్ని తెలంగాణ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ యాప్‌లో పొందుపరచాలి.

. విద్యా సంవత్సరంలో 6 నుంచి 9వ తరగతి చదువుతున్న విద్యార్థుల అభ్యసన స్థాయిలను తెలుసుకునేందుకు ప్రతీ మూడు నెలలకొకసారి పరీక్షలు నిర్వహించి స్కూల్‌ ఎడ్యుకేషన్‌ యాప్‌లో నమోదు చేయాలి. ఆగస్టు నెలలో బేస్‌లైన్‌, డిసెంబరు చివరి వారంలో మధ్యంతర పరీక్ష, మార్చిలో అంత్య పరీక్ష నిర్వహించి విద్యార్థుల ప్రగతిని నమోదు చేయాలి.

. నిర్దేశించిన బోధన సోపానాలను అనుసరించి బోధన చేయాలి.

. ఉపాధ్యాయుడు సంబంధిత తరగతికి నిర్దేశించిన కనీస సామర్ధ్యాలు ప్రతీ విద్యార్థి సాధించేలా బోధనా పద్ధతులను అనుసరించాలి.

. ప్రతీ సబ్జెక్టు వారీగా ఈ కార్యక్రమం అమలులో సంబంధిత ఉపాధ్యాయులు అనుసరించాల్సిన విధి, విధానాలను ఉత్తర్వుల్లో సూచించిన మేరకు ఆచరించాలి.

. ఉపాధ్యాయుడు బోధిస్తున్న సమయంలో నిర్దేశించిన పరిశీలన పత్రాలను అనుసరించి ప్రధానోపాధ్యాయుడు, లేదంటే పరిశీలన అధికారి పరిశీలించి నమోదు చేయాలి.

. ప్రస్తుతం కార్యక్రమ అమలులో సంబంధిత తరగతికి నిర్దేశించిన అభ్యసన ఫలితాలు సాధించడంతో పాటు నిర్ణీత సమయంలోగా అన్ని తరగతుల సిలబస్‌ పూర్తి చేయాలి.

‘లిప్‌’పై ప్రత్యేక శ్రద్ధ : బొల్లారం భిక్షపతి, నల్లగొండ డీఈవో

అభ్యసన అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయులు ప్రథమ పర్యవేక్షకులుగా భావించి పరిశీలించాలి. అందుకు సంబంధించి మార్గదర్శకాలు కూడా ఇచ్చాం. మండల విద్యాధికారులు, నోడల్‌ అధికారులు, స్కూల్‌ కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలి. మండల, క్లస్టర్‌ నోడల్‌ అధికారులు వారంలో రెండు రోజులు పాఠశాలను సందర్శించి మార్గనిర్దేశనం చేయాలి. టీచర్‌ సపోర్ట్‌ గ్రూపు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ప్రధానోపాధ్యాయులు, మానిటరింగ్‌ అధికారులు స్కూల్‌ ఎడ్యుకేషన్‌ యాప్‌లో పర్యవేక్షణ అంశాలను పొందుపరచాలి. పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులకు త్వరలో శిక్షణ ఇస్తాం. ఇప్పటికే జిల్లాలోని పాఠశాలల్లో ఎస్‌ఈఆర్‌టీ రూపొందించిన ప్రశ్నపత్రాలతో బేస్‌లైన్‌ పరీక్షలు నిర్వహించాం.

Updated Date - Aug 28 , 2024 | 12:16 AM