Share News

Sheikh Hasina: బంగ్లా నుంచి భారత్ చేరుకున్న షేక్ హసీనా.. ఢిల్లీకి పయనం.. ఇక్కడి నుంచి లండన్‌కు!

ABN , Publish Date - Aug 05 , 2024 | 06:01 PM

రిజర్వేషన్ల కోటా అంశంపై ఆందోళనకారులు, అధికార పార్టీ శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణలతో బంగ్లాదేశ్ అట్టుడికిపోతున్న వేళ ఆ దేశంలో శరవేగంగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా ఆర్మీ హెలీకాఫ్టర్‌లో భారత్‌లో అడుగుపెట్టారు.

Sheikh Hasina: బంగ్లా నుంచి భారత్ చేరుకున్న షేక్ హసీనా.. ఢిల్లీకి పయనం.. ఇక్కడి నుంచి లండన్‌కు!
Sheikh Hasina

న్యూఢిల్లీ: రిజర్వేషన్ల కోటా అంశంపై ఆందోళనకారులు, అధికార పార్టీ శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణలతో బంగ్లాదేశ్ అట్టుడికిపోతున్న వేళ ఆ దేశంలో శరవేగంగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా సి-130 ఎయిర్‌క్రాఫ్ట్‌లో ప్రయాణించి భారత్‌లో అడుగుపెట్టారు. న్యూఢిల్లీకి సమీపంలోని ఉత్తరప్రదేశ్‌లో ఉన్న హిండన్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌లో ఆమె దిగారు. అనంతరం ఆమె దేశ రాజధాని న్యూఢిల్లీకి బయలుదేరారు. అక్కడి నుంచి నేరుగా ఆమె లండన్‌ వెళ్లనున్నారని బంగ్లాదేశ్ ప్రధానమంత్రి కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. హింస చెలరేగడంతో ఆమె ఢాకాలోని అధికారిక నివాసాన్ని ఖాళ్లీ చేశారని, ప్రస్తుతం ఆమె ఆచూకీ తెలియరాలేదని ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు. ఢాకాలో ప్రస్తుత పరిస్థితులు అత్యంత సున్నితంగా ఉన్నాయని, ప్రధానమంత్రి నివాసాన్ని ఒక సమూహం చుట్టుముట్టిందని సదరు అధికారి వివరించారు.


కాగా షేక్ హసీనా తన రాజీనామా లేఖను మధ్యాహ్నం 12 గంటల సమయంలో అధ్యక్షుడు షహబుద్దీన్ అహ్మద్‌కు సమర్పించారని స్థానిక మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. కాగా రాజధాని ఢాకాకు లక్షలాది మంది ప్రజలు తరలి వెళ్లారు. మరోవైపు మంత్రులు ఎవరూ తప్పించుకోకుండా ఢాకా విమానాశ్రయం మూసివేసినట్టుగా కూడా కథనాలు వెలువడుతున్నాయి.


ఎందుకీ రక్తపాతం?

బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అక్కడి విద్యార్థులు కొన్ని రోజులుగా నిరసనలు తెలుపుతున్నారు. బంగ్లాదేశ్‌ విముక్తి కోసం 1971లో అశువులు బాసిన వారి వారసులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం కోటా అమలులో ఉండగా.. ఈ పద్ధతిని సంస్కరించి ప్రతిభ ఆధారంగా పట్టం కట్టాలని అక్కడి వర్సిటీ విద్యార్థులు, ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారు జరిపిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. అల్లర్లలో పెద్ద మొత్తంలో ప్రాణనష్టం జరిగింది. అల్లర్లకు బాధ్యత వహిస్తూ షేక్ హసీనా రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. అయితే నిరసన ప్రదర్శనలను షేక్ హసీనా, ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న అధికార అవామీ లీగ్ పార్టీకి వ్యతిరేకించింది. దీంతో ఆందోళనకారులు, అవామీ లీగ్ పార్టీ నాయకులు మధ్య హింసాత్మక ఘర్షణలు జరిగాయి. ఇప్పటివరకు ఏకంగా 300 మందికి పైగా మరణించారు.


దేశంలో ఇంత కల్లోల పరిస్థితులు చెలరేగినా షేక్ హసీనా రాజీనామా చేయకపోవడంతో లక్షలాది మంది నిరసనకారులు సోమవారం ఆమె అధికార నివాసాన్ని చుట్టిముట్టారు. దీంతో ఆమె తన పదవికి రాజీనామా చేసి దేశాన్ని వీడారు. భద్రత కోసం ఆర్మీ హెలీకాఫ్టర్‌లో భారత్‌కు చేరుకున్నారు.


సైనిక పాలన విధింపు..

బంగ్లాదేశ్‌లో అత్యంత సున్నితమైన పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశ ఆర్మీ ఛీఫ్ కీలక ప్రకటన చేశారు. దేశంలో సైనిక పాలన విధిస్తున్నట్టు తెలిపారు. దేశంలో శాంతి భద్రతలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని, దేశంలోని అన్ని పార్టీలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఇవాళ (సోమవారం) రాత్రి కల్లా పరిస్థితిని అదుపులోకి తీసుకొస్తామని ఆర్మీ చీఫ్ విశ్వాసం వ్యక్తం చేశారు. దేశంలో శాంతిని నెలకొల్పేందుకు పౌరులు అందరూ సహకరించాలని, ప్రజలంతా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి

బంగ్లాదేశ్ ప్రధానమంత్రి రాజీనామా!.. దేశం విడిచి వెళ్లిపోయిన షేక్ హసీనా

భారత్ - బంగ్లా సరిహద్దుల్లో హైఅలర్ట్.. అదనపు బలగాలను మోహరిస్తున్న బీఎస్ఎఫ్

Updated Date - Aug 05 , 2024 | 06:17 PM