Share News

Saudi Arabia: భూమి ఇస్తారా? చస్తారా?

ABN , Publish Date - May 10 , 2024 | 03:58 AM

భవిష్యత్తు అవసరాల కోసం ప్రభుత్వాలు ఏమైనా ప్రాజెక్టుల నిర్మాణం చేపడి తే ప్రజల నుంచి భూమిని సేకరించడం, బాధితులకు పరిహారం ఇవ్వడం, పునరావాసం కల్పించడం సహజంగా జరిగేవి.

Saudi Arabia: భూమి ఇస్తారా? చస్తారా?

నియోమ్‌ నగర నిర్మాణం కోసం సౌదీ క్రూరత్వం.. భూసేకరణకు అడ్డుపడితే చంపేయాలని ఆదేశం

  • ఒకరి కాల్చివేత, 47 మందిపై ఉగ్రకేసులు, ఐదుగురికి మరణశిక్ష

  • 500 బిలియన్‌ డాలర్ల వ్యయంతో స్మార్ట్‌ సిటీ నిర్మాణం

  • 3 గ్రామాలు ఖాళీ, 6వేల మంది తరలింపు

న్యూఢిల్లీ, మే 9: భవిష్యత్తు అవసరాల కోసం ప్రభుత్వాలు ఏమైనా ప్రాజెక్టుల నిర్మాణం చేపడి తే ప్రజల నుంచి భూమిని సేకరించడం, బాధితులకు పరిహారం ఇవ్వడం, పునరావాసం కల్పించడం సహజంగా జరిగేవి. కానీ ఈ విషయంలో సౌదీ అరేబియా పాలకుల పద్ధతే వేరు. సౌదీ యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ మానసపుత్రిక.. కలల నగరం ‘నియోమ్‌’ నిర్మాణం విషయంలో అక్కడి పాలకులు అత్యంత క్రూరంగా వ్యవహరిస్తున్నారు. మహానగర నిర్మాణానికి ఎవరైనా అడ్డుపడినా, భూమిచ్చేందుకు నిరాకరించిన వారి ప్రాణాలు తీయాలని అక్కడి అధికారులను ఆదేశించారని తెలిసింది.


ఈ ఆదేశాల ప్రకారం దళాలు ఓ వ్యక్తిని కాల్చిచంపారు. సాదీ అత్యంత ప్రాధాన్యమిస్తున్న ఈ నియోమ్‌ ప్రాజె క్టు వెనక జరుగుతున్న దారుణాలను ఆ దేశ ఇంటెలిజెన్స్‌ మాజీ అధికారి, కల్నల్‌ రభిహ్‌ ఎలెన్జీ బయటపెట్టారు. ప్రాణభయంతో సౌదీ నుంచి పారిపోయి ప్రస్తుతం యూకేలో ఆశ్రయం పొందుతున్న రభిహ్‌.. నియోమ్‌లో చీకటి కోణాన్ని ప్రముఖ వార్తాసంస్థ బీబీసీకి వెల్లడించారు. భూసేకరణకు నిరాకరించిన వారిని చంపేయాలని తనకు ఆదేశాలు అందాయని రభీహ్‌ పేర్కొన్నారు.


ఏమిటీ నియోమ్‌ ?

దేశంలో చమురు నిల్వలు తగ్గిపోతుండడం, ప్రపంచమంతా గ్రీన్‌ ఎనర్జీ (పునరుత్పాదక ఇం ధన వనరులు)వైపు చూస్తుండడంతో సౌదీ అరేబియా ప్రత్యామ్నాయ ఆదాయ వనరుల సృష్టిపై దృష్టిపెట్టింది. భవిష్యత్తులో తమ దేశ ఆదాయానికి ఇబ్బందిలేకుండా ఉండేందుకు పాలకులు నియోమ్‌ నగరాన్ని తెరమీదకు తెచ్చారు. సౌదీ యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ ఈ నియోమ్‌ స్మార్ట్‌ సిటీని పర్యాటక కేంద్రం, గ్లోబల్‌ హబ్‌గా తీర్చిదిద్దాలని ప్రణాళికలు చేశారు. 500 బిలియన్‌ డాలర్ల బడ్జెట్‌తో ఎర్రసముద్రం తీరం లో 26,500 చదరపు కిలోమీటర్ల పరిధిలో 10 రీజియన్లుగా నియోమ్‌ నిర్మాణం చేపడుతున్నా రు. ఈ మెగాసిటీ న్యూయార్క్‌ కంటే 33రెట్లు పెద్దది. నియోమ్‌లో ఫ్లోటింగ్‌ పోర్టు, స్కైరిసార్ట్‌లు, మిర్రర్‌ సిటీ వంటివి ఉన్నాయి.


‘ది లైన్‌’ పేరిట చేపట్టిన నిర్మాణం ఈ ప్రాజెక్టులో అత్యం త కీలకమైనది. 100మీటర్ల ఎత్తులో 200మీటర్ల వెడల్పుతో 170కిలోమీటర్ల పొడవున్న నిర్మించినున్న ది లైన్‌ను కార్‌ ఫ్రీ(కార్లు లేని ప్రాంతం) సిటీగాతీర్చిదిద్దుతున్నారు. దిలైన్‌లో త్రీడీ కమ్యూనికేషన్‌ వ్యవస్థలు, కృత్రిమ మేధ సేవలు అం దుబాటులో ఉంటాయి. ప్రజలు 5 నిమిషాలు నడిస్తే నిత్యావసరాలు దొరుకుతాయి. దీని నిర్మాణంలో అద్దాల వినియోగం అధికంగా ఉం డనుంది. దిలైన్‌ కోసం పలు ప్రముఖ అంతర్జాతీయ నిర్మాణ రంగ సంస్థలు పని చేస్తుండగా 2030నాటికి 2.4 కిలోమీటర్ల నిర్మాణమే పూర్తవుతుందని అంచనా. ఇక, 2022లో వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ కథనం ప్రకారం నియోమ్‌ ప్రాజెక్టులో భాగంగా ఫుట్‌బాల్‌ మైదానాల కంటే పెద్దవిగా ఉండే 10ప్యాలె్‌సలు నిర్మించాలని సౌదీ యువరాజు ఆదేశించారు.


ఇక ది లైన్‌ నిర్మాణం కోసం భారీగా భూసేకరణ చేపట్టారు. ఇందులో భాగంగా హువైటీ అనే తెగ ప్రజలు నివాసముండే 3 గ్రామాలను సౌదీ బలగాలు 2020లో ఖాళీ చేయించాయి. అప్పుడు భూసేకరణకు అడ్డుకున్న వారిని కాల్చిచంపాలని కల్నల్‌ రభీ్‌హకు ఆదేశాలు అందాయి. ఈ క్రమంలో తన భూమిలోకి అధికారులు రాకుండా అడ్డుపడిన అబ్దుల్‌ రహీమ్‌ అల్‌ హువైటీని బలగాలు కాల్చిచంపాయి. ఈ హత్యకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టిన గ్రామస్థుల్లో 49మందిని ఉగ్రనేరాల కింద అరెస్టు చేశారు. వారిలో ఐదుగురికి మరణశిక్ష విధించారు. వారి అంత్యక్రియ ల్లో పాల్గొన్న వారిపైనా కేసులు పెట్టారు. ప్రభు త్వ గణాంకాల ప్రకారం నియోమ్‌ ప్రాజెక్టు కోసం 6000మందిని ఇతర ప్రాంతాలకు తరలించారు. యూకే కేంద్రంగా పనిచేసే ఓ మానవ హక్కుల సంస్థ అంచనా ప్రకారం ఆసంఖ్య చా లా ఎక్కువుంటుంది. నగర నిర్మాణం పూర్తయ్యే లోపు సౌదీ ఇంకెన్నిఆగడాలకు పాల్పడుతుందో.!!

Updated Date - May 10 , 2024 | 03:58 AM