Share News

Modi Bhutan visit: 'మోదీ కీ గ్యారెంటీ'.. థాంక్స్ చెప్పిన భూటాన్ పీఎం

ABN , Publish Date - Mar 23 , 2024 | 08:01 PM

భూటాన్‌ లో రెండ్రోజుల అధికార పర్యటన ముగించుకున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం సాయంత్రం స్వదేశానికి బయలుదేరారు. భూటాన్‌లో అధికారికంగా పర్యటించిన మోదీకి భూటాన్ ప్రధాని త్రెసింగ్ టొబగే కృతజ్ఞతలు తెలిపారు. ఇచ్చిన గ్యారెంటీ నిలుపొన్నారని ప్రశంసించారు.

Modi Bhutan visit: 'మోదీ కీ గ్యారెంటీ'.. థాంక్స్ చెప్పిన భూటాన్ పీఎం

థింపు: భూటాన్‌ (Bhutan)లో రెండ్రోజుల అధికార పర్యటన ముగించుకున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) శనివారం సాయంత్రం స్వదేశానికి బయలుదేరారు. భూటాన్‌లో అధికారికంగా పర్యటించిన మోదీకి భూటాన్ ప్రధాని త్రెసింగ్ టొబగే (Tshering Tobgay) కృతజ్ఞతలు తెలిపారు. మోదీని తన సోదరుడిగా పేర్కొంటూ, వాతావరణ ప్రతికూలత ఎదురైనప్పటికీ, స్వదేశంలో లోక్‌సభ ఎన్నికల బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మోదీ ఇచ్చిన గ్యారెంటీ నిలుపుకొన్నారని ప్రశంసించారు. దీనిని ''మోదీ కీ గ్యారెంటీ'' ఫెనోమెనన్ అని సామాజిక మాధ్యమం 'ఎక్స్'‌లో ఆయన తన సందేశాన్ని తెలియజేశారు.


వాతావరణ ప్రతికూలత కారణంగా షెడ్యూల్‌కు ఒకరోజు ఆలస్యంగా భూటాన్ వెళ్లిన నరేంద్ర మోదీ తన పర్యటన ముగించుకుని పారో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తిరిగి పయనమయ్యారు. ప్రత్యేక గౌరవార్ధం విమానాశ్రయం వద్ద ఆయనకు భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగ్వేల్ వాంగ్‌చుక్, ప్రధాని త్రెసింగ్ వీడ్కోలు పలికారు. అనంతరం మోదీ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో కృతజ్ఞతలు తెలిపారు. భూటాన్‌లో పర్యటన తనకు ఎంతో ప్రత్యేకంగా నిలిచిందని, భూటాన్ రాజు, ప్రధాని, ఇతర ప్రముఖులను కలుసుకునే అవకాశం లభించిందని, ఇరుదేశాల మైత్రీసంబంధాలను మరింత పెంపొందించే విధంగా తమ మధ్య చర్చలు జరిగాయని అన్నారు. తనకు భూటాన్ ప్రతిష్ఠాత్మక పౌర పురస్కారం ''డ్రూక్ గాల్పో'' లభించినందుకు కృతజ్ఞతలని, భూటాన్ ప్రజలు చూపించిన ప్రేమ, ఆదరణకు ధన్యవాదాలని అన్నారు. భారతదేశం ఎప్పటికీ భూటాన్‌కు విశ్వసనీయ మిత్రుడిగా, భాగస్వామిగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.

Updated Date - Mar 23 , 2024 | 08:01 PM