Share News

Karnataka : కన్నడనాట కమలం హవా

ABN , Publish Date - Jun 05 , 2024 | 04:50 AM

కర్ణాటక లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగింది. మంగళవారం వెలువడిన ఫలితాల్లో కమలం పార్టీ 17 స్థానాలు కైవసం చేసుకోగా.. మిత్రపక్షం జేడీఎ్‌సకు 2 దక్కాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ 9 స్థానాలకు పరిమితమైంది.

Karnataka : కన్నడనాట కమలం హవా

బెంగళూరు, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): కర్ణాటక లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగింది. మంగళవారం వెలువడిన ఫలితాల్లో కమలం పార్టీ 17 స్థానాలు కైవసం చేసుకోగా.. మిత్రపక్షం జేడీఎ్‌సకు 2 దక్కాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ 9 స్థానాలకు పరిమితమైంది. కర్ణాటకపై బీజేపీ, కాంగ్రెస్‌ అగ్రనేతలు పెట్టుకున్న ఆశలు కొంతమేర ఫలించాయి. బీజేపీకి గతంతో పోలిస్తే దెబ్బ పడింది.

బెంగళూరు, మైసూరు రీజియన్‌, తీర ప్రాంత జిల్లాలతోపాటు ఉత్తర కర్ణాటకలోనూ బీజేపీ ప్రాబల్యం చాటుకున్నా 8 స్థానాలు తగ్గడం జాతీయస్థాయిలోనూ వెనుకబాటుకు కారణమైంది. ఇదిలా ఉండగా, కర్ణాటకలో సిట్టింగులలో ఏడుగురు మాత్రమే విజయం సాధించగా వారంతా బీజేపీకి చెందినవారే.

అధికార కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఆరుగురు మంత్రుల వారసులు బరిలో నిలవగా ముగ్గురు విజయం సాధించారు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్‌జోషి ధారవాడ నుంచి, మరో కేంద్రమంత్రి శోభాకరంద్లాజె బెంగళూరు ఉత్తర నుంచి గెలిచారు.

మాజీ సీఎంలు బసవరాజ్‌ బొమ్మై హావేరి నుంచి, జగదీశ్‌ శెట్టర్‌ బెళగావి నుంచి, జేడీఎ్‌సకు చెందిన కుమారస్వామి మండ్య నుంచి గెలుపొందారు. శాసనసభ ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ అదే ఊపుతో కనీసం 15 నుంచి 20 స్థానాలు సాధిస్తామని భావించగా 9 స్థానాలతోనే సరిపెట్టుకుంది.

Updated Date - Jun 05 , 2024 | 04:50 AM