Share News

West Bengal: మళ్లీ ఆందోళన బాట పట్టిన జూనియర్ డాక్టర్లు

ABN , Publish Date - Oct 01 , 2024 | 02:19 PM

ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైయినీ వైద్యురాలి హత్యాచార కేసు.. అనంతరం జరిగిన చర్చల్లో తమ డిమాండ్లు నెరవేర్చడంలో మమతా బెనర్జీ ప్రభుత్వం అనుసరించిన వైఖరిపై జూనియర్ డాక్టర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ క్రమంలో మంగళవారం వారు మరోమారు నిరవధిక ఆందోళనకు దిగారు.

West Bengal: మళ్లీ ఆందోళన బాట పట్టిన జూనియర్ డాక్టర్లు

కోల్‌కతా, అక్టోబర్ 01: ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైయినీ వైద్యురాలి హత్యాచార కేసు.. అనంతరం జరిగిన చర్చల్లో తమ డిమాండ్లు నెరవేర్చడంలో మమతా బెనర్జీ ప్రభుత్వం అనుసరించిన వైఖరిపై జూనియర్ డాక్టర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ క్రమంలో మంగళవారం వారు మరోమారు నిరవధిక ఆందోళనకు దిగారు. రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో వైద్యులకు రక్షణతోపాటు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన చేపట్టినట్లు జూనియర్ డాక్టర్లు ఓ ప్రకటనలో తెలిపారు.


ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ అయితే లభించలేదని పేర్కొన్నారు. దీంతో మరో మార్గం లేక పోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. మరోవైపు పోస్ట్‌గ్రాడ్యుయేషన్ ట్రైయినీ వైద్యురాలి హత్యాచార కేసులో సీబీఐ దర్యాప్తు చాలా నెమ్మదిగా జరుగుతుందన్నారు. ఈ హత్య కేసుకు సంబంధించిన ఇప్పటి వరకు నిజమైన దోషులను సీబీఐ అరెస్ట్ చేయలేదని ఈ సందర్భంగా వారు విమర్శించారు. ఈ హత్యాచార కేసు దర్యాప్తులో సుప్రీంకోర్టు గతంలో చొరవ తీసుకుందన్నారు. కానీ ఆ తర్వాత ఈ కేసులో వాయిదాలు కొనసాగుతున్నాయని చెప్పారు. దీంతో ఈ కేసు విచారణలో తీవ్ర జాప్యం జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.


ఈ ఏడాది ఆగస్ట్ 9వ తేదీ ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో 31 ఏళ్ల ట్రైయినీ వైద్యురాలు హత్యాచారానికి గురైంది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో ఆమెకు న్యాయం జరగాలంటూ జూనియర్ డాక్టర్లు రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక ఆందోళన బాట పట్టారు. దీంతో మమతా బెనర్జీ ప్రభుత్వం రంగంలోకి దిగి.. వారితో చర్చలకు ఆహ్వానించింది. ఆ క్రమంలో పలు డిమాండ్లను జూనియర్ డాక్టర్లు తెరపైకి తీసుకు వచ్చారు. వాటిలో కొన్నింటింని నెరవేర్చేందుకు మమత ప్రభుత్వం అంగీకరించింది.


దీంతో ఆసుపత్రుల్లో పాక్షిక సేవలు అందించేందుకు జూనియర్ డాక్టర్లు 10 రోజుల క్రితం తమ సమ్మెను విరమించారు. కానీ ఈ కాల వ్యవధిలో మమతా బెనర్జీ ప్రభుత్వం.. ఆసుపత్రుల వద్ద భద్రతను పెంచలేదు. అలాగే ఆసుపత్రిలోని మౌలిక సదుపాయాలను సైతం మెరుగు పరచ లేదు. అలాగే వైద్య ఆరోగ్య శాఖలోని పలువురు కీలక ఉన్నతాధికారులను సైతం బదిలీ చేయలేదు. అందుకు నిరసనగా జూనియిర్ డాక్టర్లు మరోమారు ఆందోళన బాట చేపట్టారు.

Updated Date - Oct 01 , 2024 | 02:19 PM