Share News

కేరళకు చేరిన 45 మంది భారతీయుల మృతదేహాలు

ABN , Publish Date - Jun 15 , 2024 | 05:10 AM

గల్ఫ్‌ దేశం కువైట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన 45 మంది భారతీయుల మృతదేహాలతో ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ప్రత్యేక విమానం శుక్రవారం ఉదయం కేరళలోని కొచ్చికి చేరుకుంది. మృతుల్లో 23 మంది కేరళ వారే ఉండటంతో కువైట్‌ నుంచి నేరుగా కొచ్చికే విమానం బయలుదేరింది. అప్పటికే మృతుల కుటుంబీకులు కొచ్చి విమానాశ్రయానికి భారీగా చేరుకోవడంతో పరిస్థితి ఉద్విగ్నంగా మారింది.

కేరళకు చేరిన 45 మంది భారతీయుల మృతదేహాలు

  • సీఎం విజయన్‌, మంత్రుల నివాళులు

  • చికిత్స పొందుతూ మరో భారతీయుడి మృతి

న్యూఢిల్లీ/కువైట్‌ సిటీ, జూన్‌ 14: గల్ఫ్‌ దేశం కువైట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన 45 మంది భారతీయుల మృతదేహాలతో ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ప్రత్యేక విమానం శుక్రవారం ఉదయం కేరళలోని కొచ్చికి చేరుకుంది. మృతుల్లో 23 మంది కేరళ వారే ఉండటంతో కువైట్‌ నుంచి నేరుగా కొచ్చికే విమానం బయలుదేరింది. అప్పటికే మృతుల కుటుంబీకులు కొచ్చి విమానాశ్రయానికి భారీగా చేరుకోవడంతో పరిస్థితి ఉద్విగ్నంగా మారింది. అలాగే కేరళ సీఎం పినరయి విజయన్‌, క్యాబినెట్‌ మంత్రులు, కేంద్ర మంత్రి సురేశ్‌ గోపీ, ప్రతిపక్ష నేత వీడీ సతీశన్‌ తదితరులు అక్కడికి చేరుకుని నివాళులర్పించారు.

అనంతరం శవపేటికలను బంధువులకు అప్పగించారు. ప్రమాద వార్త విని కువైట్‌ వెళ్లిన కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్‌ సింగ్‌ కూడా అదే విమానంలో తిరిగొచ్చారు. మృతుల్లో తమిళనాడుకు చెందిన ఏడుగురు, ఏపీ, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల వారు ముగ్గురు చొప్పున, ఒడిశాకు చెందిన ఇద్దరు, బిహార్‌, పంజాబ్‌, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌, ఝార్ఖండ్‌, హరియాణలకు చెందిన వారు ఒక్కొక్కరున్నారు. దక్షిణాది రాష్ట్రాలకు చెందినవారి మృతదేహాలను కొచ్చి నుంచే తరలిస్తామని.. మిగతావారి మృతదేహాలను ఢిల్లీకి పంపి అక్కడి నుంచి ఆయా రాష్ట్రాలకు చేరవేస్తామని అధికారులు వెల్లడించారు. ఇక అగ్నిప్రమాదంలో గాయపడిన మరో భారతీయుడు చికిత్స పొందుతూ చనిపోయాడు. దీంతో దేశానికి చెందిన మృతుల సంఖ్య 46కి చేరింది. మృతుడిది యూపీ అని సమాచారం.

Updated Date - Jun 15 , 2024 | 07:27 AM