Share News

Union Budget : అభివృద్ధి.. జనాకర్షకం

ABN , Publish Date - Jul 22 , 2024 | 04:36 AM

మోదీ 3.0 ప్రభుత్వం మంగళవారం ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌లో అభివృద్ధి-సంక్షేమంతో పాటు ఆర్థిక లోటు తగ్గించేందుకు చర్యలు ఉంటాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. లోక్‌సభలో బీజేపీ సంఖ్యాబలం తగ్గడం, మిత్రపక్షాలపై

Union Budget : అభివృద్ధి.. జనాకర్షకం

ఆదాయపన్ను మినహాయింపు పరిమితిని రూ.3.5 లక్షలకు పెంచే అవకాశం

గృహ రుణాలపై ఇస్తున్న రాయితీ పెంపు?

కేంద్ర బడ్జెట్‌పై మధ్యతరగతికి ఆశలు'

బడ్జెట్‌ రూపకల్పనలో మోదీ 3.0 సర్కార్‌ ప్రాధాన్యాలివే

ఆంధ్రప్రదేశ్‌, బిహార్‌ రాష్ట్రాలకు చేయూతనిచ్చే వరాలు!

మౌలిక సదుపాయాలకు భారీగా నిధులు

ఆదాయపన్ను మినహాయింపు పరిమితిని

రూ.3.5 లక్షలకు పెంచే అవకాశం

గృహ రుణాలపై ఇస్తున్న రాయితీ పెంపు?

గ్రామీణప్రాంత ఎంఎస్‌ఎంఈలకు అండ

అగ్నివీర్‌ పథకంలో మార్పులు చేసే చాన్స్‌

మధ్యతరగతికి ఊరట కల్పించే చర్యలు

గృహ నిర్మాణ రంగానికి ప్రోత్సాహకాలు

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాల వెల్లడి!

బడ్జెట్‌ అనగానే ఏటా ఆదాయపన్ను శ్లాబుల్లో ఏమైనా మార్పులు వస్తాయేమోనని ఆశగా ఎదురుచూడ్డం.. ఏ మార్పులూ లేకపోవడం చూసి నిరాశపడ్డం.. గడిచిన పదేళ్లుగా ఇదీ తంతు. ఇప్పుడు మరో బడ్జెట్‌కు వేళయ్యింది. ఎన్నికలకు ముందు మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్‌.. రేపు పూర్తిస్థాయి బడ్జెట్‌ను సభ ముందుంచేందుకు సిద్ధమయ్యారు. దీంట్లోనైనా వేతనజీవులకు, మధ్యతరగతికి ఊరట కల్పిస్తారా? సంస్కరణలతోపాటే సంక్షేమానికీ పెద్ద పీట వేస్తారా? మౌలిక సదుపాయాలకు భారీ నిధులు ప్రకటిస్తూనే.. జనాకర్షక విధానాలను ప్రకటిస్తారా? అంటే.. ఆర్థిక నిపుణులు అవుననే అంచనా వేస్తున్నారు.

న్యూఢిల్లీ, జూలై 21 (ఆంధ్రజ్యోతి): మోదీ 3.0 ప్రభుత్వం మంగళవారం ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌లో అభివృద్ధి-సంక్షేమంతో పాటు ఆర్థిక లోటు తగ్గించేందుకు చర్యలు ఉంటాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. లోక్‌సభలో బీజేపీ సంఖ్యాబలం తగ్గడం, మిత్రపక్షాలపై ఆధారపడాల్సి రావడం, ఈ ఏడాది ఆఖరులో మూడు కీలక రాష్ట్రాల్లో ఎన్నికల వంటివాటి నేపథ్యంలో.. సంస్కరణలకు, జనాకర్షక విధానాలకు, రాష్ట్రాల అవసరాలకు సమానంగా ప్రాధాన్యమిస్తూ ఈ బడ్జెట్‌ రూపకల్పన జరిగిందని ఆ వర్గాలు వివరించాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌, బిహార్‌ను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్‌లో పలు చర్యలను ప్రకటించవచ్చునని సూచనప్రాయంగా వెల్లడించాయి. ఇప్పటికి వరుసగా ఆరుసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌.. ఎప్పటిలాగానే ఈసారి కూడా మౌలిక సదుపాయాల కల్పనకు పెట్టుబడులను భారీగా పెంచనున్నారు. అందులో భాగంగా రైల్వే, రహదారులు, టెలి కమ్యూనికేషన్లు, ఆటోమొబైల్‌ రంగం, ఆరోగ్య సంరక్షణ, రేవుల అభివృద్ధికి భారీ ఎత్తున నిధులు పెరగనున్నాయి. ఈ బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయం.. జీడీపీలో 7.7 శాతానికి, మూలధన వ్యయం 3.5 శాతానికి చేరుకుంటుందని భావిస్తున్నారు. అలాగే.. స్థూల ఆర్థిక లోటును 5.6 శాతానికి తగ్గించడం లక్ష్యంగా ఆర్థిక మంత్రి చర్యలు చేపట్టనున్నట్టు సమాచారం. మొత్తమ్మీద.. మోదీ గత రెండు ప్రభుత్వాల్లో లేనట్టుగా ఈసారి జనాకర్షక విధానాలకు కూడా పెద్ద పీట వేయనున్నట్లు ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా మధ్యతరగతివారిని, మహిళలు, రైతులు, వృద్ధులను ఆకట్టుకునేందుకు చర్యలు ప్రకటిస్తారని అంచనాలు వినపడుతున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈసారి బడ్జెట్‌లో..

  • సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి రంగాల (ఎంఎ్‌సఎంఈ) పటిష్ఠతకు పలు చర్యలు ప్రకటించనున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎంఎ్‌సఎంఈ రంగానికి చేయూతనిచ్చే అవకాశాలున్నాయి. స్టార్టప్‌ ఇండియా సీడ్‌ నిధి క్రింద ఈ రంగానికి నిధులు పెరిగే అవకాశం ఉంది.

  • చైనాతో సరిహద్దుల్లో తరచూ ఉద్రిక్తతలు ఏర్పడుతున్న నేపథ్యంలో.. ఈసారి రక్షణ రంగ బడ్జెట్‌ రూ.6 లక్షల కోట్లకు పైగా ఉండవచ్చని అంచనా.

  • అగ్నిపథ్‌ పథకంపై మిత్రపక్షాల నుంచి కూడా తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఆర్మీ నిపుణుల నుంచి వచ్చిన సంస్కరణలను దృష్టిలో ఉంచుకుని అగ్నిపథ్‌లో మార్పులు వచ్చే ఆవకాశాలున్నాయి.

  • ఆదాయపన్ను కనీస మినహాయింపు పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.3.5 లక్షల వరకు పెంచవచ్చు. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్‌ 80డి కింద ఆరోగ్య బీమా ప్రీమియంలకు మినహాయింపు పరిమితిని మరింత పెంచే చాన్స్‌. అలాగే, మధ్యతరగతిని ఆకట్టుకునేందుకు గృహరుణాలపై సబ్సిడీని మరింత పెంచవచ్చు.

  • ఆయుష్మాన్‌ భారత్‌ క్రింద రూ.5 లక్షల వరకూ బీమాను 70 ఏళ్లు దాటినవారికి కూడా వర్తింపజేస్తామంటూ బీజేపీ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన హామీని ఈ బడ్జెట్‌లో నెరవేర్చవచ్చని భావిస్తున్నారు. మహిళ లకు కూడా ఈ పథకం క్రింద ఆరోగ్య సేవలను పెంచే అవకాశాలున్నాయి.

  • ముద్రా యోజన పరిమితిని రూ.20 లక్షలకు పెంచడంతో పాటు సురక్షితం కాని ఎంఎ్‌సఎంఈ రుణాలను రూ.2 కోట్లనుంచి రూ.5 కోట్లకు పెంచవచ్చు. స్టార్ట్‌పలపై ఆర్థిక భారం తగ్గించేందుకు మరిన్ని పన్ను రాయితీలు కల్పించవచ్చు.

  • రియల్‌ ఎస్టేట్‌ రంగానికి పరిశ్రమ హోదా కల్పించి.. స్వదేశీ, విదేశీ సంస్థల నుంచి పెట్టుబడులను ఆకర్షించేందుకు చర్యలను ప్రక టించే అవకాశాలు లేకపోలేదు. మెట్రో సిటీల్లో శాటిలైట్‌ టౌన్‌షి్‌పల ఏర్పాటుతో పాటు అందుబాటు ధరల్లో ఉండేలా గృహ నిర్మాణాన్ని ప్రోత్సహించే చర్యలు ప్రక టించవచ్చు.

  • కిసాన్‌ సమ్మాన్‌ నిధి, ప్రధాన పంటలకు కనీస మద్దతు ధరల పెంపు, గిడ్డంగుల అభివృద్ది, నీటి పారుదల ప్రాజెక్టులకు, ఆహారోత్పత్తుల పరిశ్రమలకు నిధుల పెంచే అవకాశాలున్నాయి.

  • పునరుత్పాదక ఇంధన రంగానికి బడ్జెట్‌ లో నిధులు పెరగవచ్చని భావిస్తున్నారు. సోలార్‌, హైడ్రో, పవన విద్యుత్‌ ప్రాజెక్టులకు మరిన్ని ప్రోత్సాహకాలు కల్పించవచ్చు.

  • విద్యారంగం, నైపుణ్య అభివృద్దికి బడ్జెట్‌ లో కేటాయింపులు గణనీయంగా పెరుగుతాయని భావిస్తున్నారు. ప్రభుత్వ ప్రైవేట్‌ భాగస్వామ్యం ద్వారా నైపుణ్యాభివృద్దికి, ఉపాధి అవకాశాల కల్పనకు చర్యలు తీసుకోవచ్చని అంచనాలున్నాయి.


చిట్యాల-జగ్గయ్యపేట లైన్‌కు మోక్షం!

హైదరాబాద్‌, జూలై 21 (ఆంధ్రజ్యోతి): కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రంలో ప్రతిపాదించిన పలు రైల్వే అభివృద్ధి ప్రాజెక్టులకు ఆశించిన స్థాయిలో నిధుల కేటాయింపులుంటాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు భావిస్తున్నారు. ప్రధానంగా పలు కొత్త ప్రాంతాలను రైల్వేలైన్‌కు అనుసంధానం చేసేందుకు రూ.4,104 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదించిన చిట్యాల-జగ్గయ్యపేట రైల్వేలైన్‌ పనులకు మోక్షం లభించే అవకాశం ఉంది. అలాగే 2,588 కి.మీ దూరానికి డబ్లింగ్‌, ట్రిప్లింగ్‌ తదితర అభివృద్ధి పనులతో పాటు మరో 11 ప్రాజెక్టులకు రూ.32,695 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన ప్రతిపాదనలకు కేంద్రం బడ్జెట్‌ లో నిధులు కేటాయించే అవకాశం ఉంది.

ఏపీ, బిహార్‌ కు బడ్జెట్‌ లో చేయూత!

సొంతంగా మెజారిటీ సాధించలేక.. లక్ష్యానికి అల్లంత దూరంలో నిలిచిపోయిన బీజేపీకి టీడీపీ, జేడీయూ అండగా నిలిచి మోదీ 3.0 సర్కారు ఏర్పడడంలో కీలకపాత్ర పోషించిన నేపథ్యంలో ఈసారి బడ్జెట్‌లో ఏపీ, బిహార్‌కు ఆర్థికంగా చేయూతనిచ్చేలా కొన్ని ప్రకటనలు చేసే అవకాశాలున్నాయని అంచనా. చంద్రబాబు ఏపీ సమగ్రంగా కోలుకునేందుకు ఆర్థిక ప్రణాళికను ఆశిస్తుండగా, నితీష్‌ కుమార్‌ బిహార్‌ లో మౌలిక సదుపాయాల అభివృద్దిని ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. రెండు రాష్ట్రాలకూ లబ్ధిచేకూర్చేలా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక సహాయం, విదేశీ సహాయ ప్రాజెక్టులకు రుణాల చెల్లింపు ద్వారా మద్దతు, నిర్దిష్టమైన నష్టపరిహార ప్యాకేజీని రూపొందించేందుకు నిపుణుల కమిటీ నియామకంతో పాటు రైల్వే ప్రాజెక్టులకు నిధుల పెంపు వంటివాటికి బడ్జెట్‌లో చోటు ఉంటుందని భావిస్తున్నారు. ఈ ప్రకటనల వల్ల ఏపీ ఆశిస్తున్న రాజధాని, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్రం మద్దతు ఉంటుందనే అంచనాలున్నాయి.

Updated Date - Jul 22 , 2024 | 04:36 AM