Share News

Jharkhand: అసెంబ్లీ ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. హస్తినలో చంపయీ సోరెన్

ABN , Publish Date - Aug 18 , 2024 | 12:48 PM

జార్ఖాండ్‌ అసెంబ్లీ ఎన్నికల ముందు అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, జేఎంఎం సీనియర్ నేత చంపయీ సోరెన్ ముగ్గురు ఎమ్మెల్యేలతో కలిసి హస్తినకు ఆదివారంనాడు చేరుకున్నారు. చంపయీ సోరెన్ బీజేపీలో చేరనున్నారంటూ గత రెండురోజులుగా వినిపిస్తున్న ఊహాగానాలకు తాజా పరిణామం బలం చేకూరుస్తోంది.

Jharkhand: అసెంబ్లీ ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. హస్తినలో చంపయీ సోరెన్

న్యూఢిల్లీ: జార్ఖాండ్‌ (Jharkhand) అసెంబ్లీ ఎన్నికల ముందు అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, జేఎంఎం సీనియర్ నేత చంపయీ సోరెన్ (Champai Soren) ముగ్గురు ఎమ్మెల్యేలతో కలిసి హస్తినకు ఆదివారంనాడు చేరుకున్నారు. చంపయీ సోరెన్ బీజేపీ (BJP)లో చేరనున్నారంటూ గత రెండురోజులుగా వినిపిస్తున్న ఊహాగానాలకు తాజా పరిణామం బలం చేకూరుస్తోంది. ''నేను ఎక్కడైతే అన్నానో అక్కడే ఉన్నాను'' అని మీడియాకు చెప్పిన కొద్ది గంటల్లోనే ఆయన హస్తినకు పయనమయ్యారు. వ్యక్తిగత కారణాల రీత్యా ఢిల్లీ వచ్చినట్టు మీడియా అడిగిన ప్రశ్నకు ముక్తసరిగా ఆయన సమాధానమిచ్చారు.


చంపయూ సోరెన్ ప్రస్తుతం హేమంత్ సోరెన్ సారథ్యంలోని జార్ఖాండ్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. జేఎంఎం మాజీ ఎమ్మెల్యే లోబిన్ మెమ్‌బ్రోమ్ ద్వారా బీజేపీతో చంపయూ సోరెన్ సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది. చంపయూతో పాటు లోబిన్ కూడా బీజేపీలో చేరనున్నారని సమాచారం. ఐదు నెలలు కూడా తిరక్కుండానే తనను ముఖ్యమంత్రి పదవి నుంచి హేమంత్ సోరెన్ రాజీనామా చేయించడంపై చంపయీ సోరెన్ అసంతృప్తితో ఉన్నారని, అందుకోసమే బీజేపీలో చేరేందుకు ఆయన మార్గం సుగమం చేసుకున్నారని అభిజ్ఞ వర్గాల భోగట్టా. అసంతృప్తి నేతలంతా కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను హస్తినలో కలుసుకోనున్నారని తెలుస్తోంది.


ఇదీ జరిగింది...

మనీలాండరింగ్ కేసులో జనవరి 31న జేఎంఎం అధ్యక్షుడు, ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను ఈడీ అరెస్టు చేయడానికి ముందే ఆయన తన పదవికి రాజీనామా చేశారు. దీంతో చంపయీ సోరెన్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. ఐదు నెలల పాటు జైలులో ఉన్న హేమంత్ సోరన్ హైకోర్టు ఇచ్చిన బెయిలుపై ఇటీవల బయటకు రాగానే తిరిగి శానససభా పక్ష నేతగా ఎన్నికయ్యారు. దీంతో చంపయీ సోరెన్ రాజీనామా చేయడం, హేమంత్ సీఎం పగ్గాలు చేపట్టడం వంటి వరుస పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే చంపయీ సోరెన్ బీజేపీ తీర్ధం తీసుకోనున్నారని, బీజేపీ టిక్కెట్‌పైనే పోటీ చేసి హేమంత్‌కు గట్టి పోటీ ఇవ్వనున్నారనే ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తల గురించి తనకు తెలియదని, ప్రస్తుతం ఎక్కడున్నానో అక్కడే ఉన్నానని చెప్పిన కొద్ది గంటల్లోనే చంపయూ సోరెన్ యూటర్న్ తీసుకోవడంతో జార్ఖాండ్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

Updated Date - Aug 18 , 2024 | 01:57 PM