Share News

Maharashtra: ఒక్కో పార్టీ 85 చోట్ల పోటీ!

ABN , Publish Date - Oct 24 , 2024 | 04:54 AM

మహారాష్ట్రలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు విపక్ష కూటమి మహా వికాస్‌ అఘాడీ (ఎమ్‌వీఏ) సీట్ల పంపకం ఓ కొలిక్కి వచ్చింది.

Maharashtra: ఒక్కో పార్టీ 85 చోట్ల పోటీ!

  • మహారాష్ట్రలో మహావికాస్‌ అఘాడీ సీట్ల పంపకం కొలిక్కి

ముంబై, అక్టోబరు 23: మహారాష్ట్రలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు విపక్ష కూటమి మహా వికాస్‌ అఘాడీ (ఎమ్‌వీఏ) సీట్ల పంపకం ఓ కొలిక్కి వచ్చింది. ఆ కూటమిలో ప్రధాన పక్షాలైన కాంగ్రెస్‌, ఉద్ధవ్‌ థాక్రే శివసేన, శరద్‌ పవార్‌ నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) చెరో 85 సీట్లలో పోటీ చేసేందుకు ఒప్పందం చేసుకున్నాయి. మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాలున్న ఆ రాష్ట్రంలో 270 స్థానాల గురించి ఏకాభిప్రాయం కుదరగా.. మిగిలిన 18 సీట్ల గురించి సమాజ్‌వాదీ పార్టీ సహా ఇతర భాగస్వామ్యపక్షాలకు ఇచ్చేందుకు చర్చలు జరుపుతున్నట్లు మహారాష్ట్ర కాంగ్రెస్‌ అధినేత నానా పటోలే బుధవారం చెప్పారు. మరోవైపు అజిత్‌ పవార్‌ నేతృత్వంలోని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) 38 అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసింది. 32 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు ఈ జాబితాలో చోటిచ్చింది. పార్టీ అధినేత అజిత్‌ పవార్‌ తమ కుటుంబానికి కంచుకోట అయిన బారామతి నుంచి పోటీ చేయనున్నారు.


  • ఐదుగురి పేర్లను ప్రకటించిన మజ్లిస్‌

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు మజ్లిస్‌ పార్టీ సమాయాత్తమవుతోంది. మొత్తం 40 స్థానాల్లో రంగంలోకి దిగాలని భావిస్తున్న మజ్లిస్‌ బుధవారం ఐదుగురు అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించింది. ధూలే సిటీ నుంచి పోటీకి దిగనున్న సిటింగ్‌ ఎమ్మెల్యే షా ఫరూఖ్‌ అన్వర్‌కు హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయం దారుల్‌ సలాంలో అసదుద్దీన్‌ ఒవైసీ బీ ఫాం అందజేశారు. మాలేగావ్‌ సెంట్రల్‌ నుంచి సిటింగ్‌ ఎమ్మెల్యే ముఫ్తీ మహ్మద్‌ ఇస్మాయిల్‌ అబ్దుల్‌, ఔరంగాబాద్‌ నుంచి ఇంతియాజ్‌ జలీల్‌, షోలాపూర్‌ నుంచి ఫరూఖ్‌ మహ్మద్‌ ఖలీల్‌షాహి, వెర్సొవా నుంచి రయీస్‌ లష్కారియా పోటీ చేయనున్నట్టు మజ్లిస్‌ పార్టీ ప్రకటించింది. 2019 ఎన్నికల్లో 40 స్థానాల్లో బరిలోకి దిగిన మజ్లిస్‌ 2 చోట్ల విజయం సాధించింది.

Updated Date - Oct 24 , 2024 | 04:54 AM