Share News

Terror Attack: జమ్ము ఉగ్రదాడిలో కొత్త కోణం.. చనిపోయినట్లు నటించి..

ABN , Publish Date - Jun 10 , 2024 | 06:53 PM

జమ్ముకశ్మీర్‌లో ఓ పర్యాటక బస్సుపై జరిగిన ఉగ్రదాడి వ్యవహారంలో ఓ ఆసక్తికరమైన కోణం వెలుగులోకి వచ్చింది. ఈ దాడి నుంచి ప్రాణాలతో బయటపడిన కొందరు బాధితులు..

Terror Attack: జమ్ము ఉగ్రదాడిలో కొత్త కోణం.. చనిపోయినట్లు నటించి..
Reasi Terror Survivors

జమ్ముకశ్మీర్‌లో ఓ పర్యాటక బస్సుపై జరిగిన ఉగ్రదాడి (Jammu Terror Attack) వ్యవహారంలో ఓ ఆసక్తికరమైన కోణం వెలుగులోకి వచ్చింది. ఈ దాడి నుంచి ప్రాణాలతో బయటపడిన కొందరు బాధితులు.. దాడుల సమయంలో తాము కాసేపు చనిపోయినట్లు నటించామని పేర్కొన్నారు. ఎలాగైనా ప్రాణాలతో బయటపడాలన్న ఉద్దేశంతో.. తామంతా బస్సు లోపలే మౌనంగా ఉండిపోయామని తెలిపారు. సుమారు 15 నిమిషాల పాటు వాళ్లు కాల్పులు జరిపారని చెప్పారు.


చనిపోయినట్లు నటించాం

‘‘ఆరేడు ఉగ్రవాదులు తొలుత బస్సుపై కాల్పులకు తెగబడ్డారు. వాళ్లందరూ ముఖానికి మాస్కులు వేసుకొని ఉన్నారు. అన్నివైపులా నుంచి కాల్పులు జరపడం మొదలుపెట్టారు. ఇంతలో బస్సు లోయలో పడిపోయింది. అప్పటికీ ఆ ముష్కరులు విడిచిపెట్టలేదు. అటుగా వచ్చి మళ్లీ కాల్పులు కొనసాగించారు. ఆ సమయంలో మేమంతా చనిపోయినట్లు నటించాం. ఎలాగైనా ఇంటికి తిరిగి వెళ్లాలన్న ఉద్దేశంతో.. ఏమాత్రం కదలకుండా మౌనంగా ఉండిపోయాం. పది, పదిహేను నిమిషాల తర్వాత అక్కడికి స్థానికులతో పాటు పోలీసులు చేరుకొని మమ్మల్ని కాపాడారు’’ అని ఈ ఉగ్రదాడి నుంచి బయటపడిన బాధితులు మీడియాకు తెలిపారు.


యాత్రికులే లక్ష్యంగా దాడి

ఇదిలావుండగా.. కట్రాలోని మాతా వైష్ణోదేవి ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత యాత్రికులు శివఖోరి ఆలయానికి తిరుగు పయనమయ్యారు. అయితే.. మార్గమధ్యంలో ఉగ్రవాదులు ఈ బస్సుపై మెరుపుదాడి చేశారు. ఈ దాడిలో డ్రైవర్‌కు బుల్లెట్ తగలడంతో.. వాహనం అదుపు తప్పి, పక్కనే ఉన్న లోయలో పడింది. అటుగా వచ్చి ఉగ్రవాదులు మళ్లీ కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 9 మంది చనిపోగా, 33 మంది గాయపడ్డారు. డ్రైవర్‌తో పాటు కండక్టర్‌ కూడా మరణించినట్లు అధికారులు తేల్చారు. ఈ దారుణానికి పాల్పడింది తామేనంటూ.. పాకిస్తాన్ లష్కరే తొయిబాకు చెందిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించింది.


రంగంలోకి దిగిన ఎన్ఐఏ

ఈ దాడులు జరిపింది తామేనని పాక్ ఉగ్రవాదులు ప్రకటించిన నేపథ్యంలో.. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) రంగంలోకి దిగింది. స్థానిక పోలీసులు కలిసి దర్యాప్తు మొదలుపెట్టింది. ఇదే సమయంలో.. ఉగ్రవాదుల ఆచూకీ కోసం భద్రతా బలగాలు కూంబింగ్‌ ఆపరేషన్‌ చేపట్టాయి. డ్రోన్లతోనూ పరిసర ప్రాంతాల్లో గాలిస్తున్నాయి. మరోవైపు.. బాధిత కుటుంబాలను నిశితంగా పరిశీలించి, వారిని ఆదుకోవాలని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాకు ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలు జారీ చేశారు. బాధితుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన రూ.50 వేలు చొప్పున ఆర్థికసహాయం ప్రకటించారు.

Read Latest National News and Telugu News

Updated Date - Jun 10 , 2024 | 06:53 PM