Share News

Prajwal Revanna: ప్రజ్వల్‌ కోసం విదేశాలకు 'సిట్' వెళ్తుందా?

ABN , Publish Date - May 12 , 2024 | 03:49 PM

లోక్‌సభ ఎన్నికల మధ్యలో సంచలనం సృష్టించిన హస్సన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక హోం మంత్రి జి.పరమేశ్వర రాజకీయ పార్టీలు, నేతలకు అదివారంనాడు కీలక సూచనలు చేశారు. కేసు సున్నితత్వం దృష్ట్యా ఎవరూ ఎలాంటి బహిరంగ ప్రకటనలు కాని, సమాచారం షేర్ చేయడం కానీ చేయవద్దని కోరారు.

Prajwal Revanna: ప్రజ్వల్‌ కోసం విదేశాలకు 'సిట్' వెళ్తుందా?

బెంగళూరు: లోక్‌సభ ఎన్నికల మధ్యలో సంచలనం సృష్టించిన హస్సన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna) లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక హోం మంత్రి జి.పరమేశ్వర (G Parameshwara) రాజకీయ పార్టీలు, నేతలకు అదివారంనాడు కీలక సూచనలు చేశారు. కేసు సున్నితత్వం దృష్ట్యా ఎవరూ ఎలాంటి బహిరంగ ప్రకటనలు కాని, సమాచారం షేర్ చేయడం కానీ చేయవద్దని కోరారు. ప్రజల్వ్‌ను వెనక్కి రప్పించేందుకు దర్యాప్తు బృందం 'సిట్' (SIT) విదేశాలకు వెళ్లడం లేదని చెప్పారు. అతనికి సంబంధించిన సమాచారాన్ని ఇంటర్ పోల్ పంచుకుంటుందని తెలిపారు.


మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజల్వ్ రేవణ్ణ పలువురు మహిళలపై లైంగిక వేధింపులు జరిపినట్టు ఇటీవల పలు వీడియోలు వెలుగుచూడటం కర్ణాటక రాజకీయాలను కుదిపేసింది. బీజేపీ-జేడీఎస్ కూటమి అభ్యర్థిగా ప్రజ్వల్ పోటీ చేసిన హస్సన్ లోక్‌సభ నియోజకవర్గంలో ఏప్రిల్ 26న పోలింగ్ జరుగగా, ఆ మరుసటి రోజే ఆయన విదేశాలకు వెళ్లిపోయారు. ఈ కేసుపై 'సిట్' దర్యాప్తు చేపట్టడం, ప్రజ్వల్‌కు నోటీసులు ఇవ్వడం, ఆయన గడువు కోరడంతో 'సిట్' లుకౌట్ నోటీసులు జారీ చేయడం వంటి పరిణామాలు చకచకా చోటుచేసుకున్నాయి. అనంతరం 'బ్లూ కార్నర్' నోటీసులను కూడా సిట్ జారీ చేసింది.


ఇంటర్‌పోల్ సమాచారం ఇస్తుంది..

కాగా, ప్రజ్వల్‌ను రప్పించేందుకు విదేశాలకు సిట్ వెళ్లడం లేదని, బ్లూ కార్నర్ నోటీసు ఇచ్చినందున ప్రజ్వల్‌ ఎక్కడ కనిపించినా సంబంధిత దేశాలు ఇంటర్‌పోల్‌కు సమాచారం ఇస్తాయని, అప్పుడు మన ఏజెన్సీలు, సీబీఐకి సమాచారం తెలుస్తుందని, వారి ద్వారా తమకు సమచారం అందుతుందని హోం మంత్రి పరమేశ్వర తెలిపారు. అయితే, ఇంతవరకూ తమకు ఎలాంటి సమాచారం అందలేదని చెప్పారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉన్నందున, అది పూర్తయ్యేంత వరకూ ఎలాంటి సమాచారం బహిర్గతం చేయలేమని అన్నారు. సున్నితమైన కేసు అయినందున ప్రజలు, నేతలు సైతం బహిరంగ ప్రకటనలు ఇవ్వరాదని సూచించారు. అలా చేస్తే వారిని కూడా విచారణ ముందుకు రప్పించి వారి స్టేట్‌మెంట్లు రికార్డు చేస్తామన్నారు. జేడీఎస్ నేత హెడ్‌డీ కుమారస్వామికి కూడా నోటీసు ఇవ్వనున్నారా అని అడిగినప్పుడు, ఆయన మాజీ సీఎం అని, ఆయన సైతం ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నట్టు తాను భావిస్తున్నానని అన్నారు. అయితే బహిరంగంగా స్టేట్‌మెంట్లు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, అది ఎవరికైనా వర్తిస్తుందని మంత్రి సమాధానమిచ్చారు.

Read Latest National News and Telugu News

Updated Date - May 12 , 2024 | 03:52 PM