Share News

Supreme Court: సీజేఐ ముందు మందు బాటిళ్లు.. తరువాత ఏం జరిగిందంటే..!

ABN , Publish Date - Jan 06 , 2024 | 05:46 PM

భారత అత్యున్నత న్యాయస్థానంలో ఇంట్రస్టింగ్ సీన్ నడిచింది. ఓ కేసులో విచారణ సందర్భంగా ప్రముఖ న్యాయవాది ముఖుల్ రోహత్గీ రెండు మద్యం బాటిళ్లను తీసుకువచ్చి సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ముందు పెట్టారు. ఆ బాటిళ్లను చూసి సీజేగా గట్టిగా నవ్వేశారు. ఈ బాటిళ్లను మీరే తెచ్చారా? అంటూ న్యాయవాదిని అడిగారు. దానికి అవునని బదులిచ్చిన న్యాయవాది.. కేసులో సారూప్యతను వివరించడం కోసం వీటిని తీసుకురావడం జరిగిందని వివరించారు.

Supreme Court: సీజేఐ ముందు మందు బాటిళ్లు.. తరువాత ఏం జరిగిందంటే..!
Supreme Court

న్యూఢిల్లీ, జనవరి 06: భారత అత్యున్నత న్యాయస్థానంలో ఇంట్రస్టింగ్ సీన్ నడిచింది. ఓ కేసులో విచారణ సందర్భంగా ప్రముఖ న్యాయవాది ముఖుల్ రోహత్గీ రెండు మద్యం బాటిళ్లను తీసుకువచ్చి సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ముందు పెట్టారు. ఆ బాటిళ్లను చూసి సీజేగా గట్టిగా నవ్వేశారు. ఈ బాటిళ్లను మీరే తెచ్చారా? అంటూ న్యాయవాదిని అడిగారు. దానికి అవునని బదులిచ్చిన న్యాయవాది.. కేసులో సారూప్యతను వివరించడం కోసం వీటిని తీసుకురావడం జరిగిందని వివరించారు. విచారణ అనంతరం.. బాటిళ్లను తీసుకెళ్లగలరా? అని న్యాయవాది కోరగా.. ఎస్ ప్లీజ్ అంటూ నవ్వుతూ బదులిచ్చారు సీజేఐ. మరి ఇంతకీ ఈ కేసు పూర్వాపరాలేంటో ఓసారి చూద్దాం.

రెండు లిక్కర్ కంపెనీల మధ్య ట్రేడ్ మార్క్ ఉల్లంఘనకు సంబంధించి కేసు నడుస్తోంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన జేకే ఎంటర్‌ప్రైజెస్ లిక్కర్ కంపెనీ.. తమ కంపెనీకి చెందిన బ్రాండ్స్ 'బ్లెండర్స్ ప్రైడ్', 'ఇంపీరియల్‌ బ్లూ' పేర్లను కాపీ కొట్టి 'లండన్ ప్రైడ్', 'ఇంపీరియల్ వ్యాట్' పేరుతో మద్యం తయారు చేస్తోందని మరో మద్యం కంపెనీ పెర్నోడ్ రికార్డ్ ఆరోపిస్తోంది. ట్రేడ్ మార్క్, బాటిల్ రూపాన్ని కాపీ కొట్టి నిబంధనలను ఉల్లంఘించిందని పేర్కొంది. జేకే ఎంటర్‌ప్రైజెస్‌పై నిషేధం విధించాలని కోరుతూ మధ్యప్రదేశ్‌ హైకోర్టును ఆశ్రయించింది. అయితే, పెర్నోడ్ కంపెనీ దాఖలు చేసిన ఆ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది.

దీంతో పెర్నోడ్ కంపెనీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించింది. పెర్నోడ్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ.. రెండు కంపెనీలకు చెందిన ఉత్పత్తులను కోర్టులోకి తీసుకురావడానికి అనుమతించాలని ధర్మాసనాకి విజ్ఞప్తి చేశారు. సీజేఐ అనుమతించడంతో.. వెంటనే రెండు మద్యం బాటిళ్లను బెంచ్ ముందు ఉంచి వాదనలు వినిపించారు.

అయితే, సుప్రీంకోర్టులో బెంచ్ ముందు రెండు విస్కీ బాటిల్స్‌ చూసిన సీజేఐ చంద్రచూడ్‌ గట్టిగా నవ్వారు. ‘ఈ బాటిల్స్ మీతోపాటు తీసుకువచ్చారా?’ అని న్యాయవాది ముకుల్‌ రోహత్గీని అడిగారు. అవునని చెప్పిన ఆయన.. రెండు ఉత్పత్తుల మధ్య సారూప్యతను చూపించడానికి వాటిని తీసుకువచ్చినట్లు వివరించారు. ఈ కేసులో ట్రేడ్‌మార్క్ ఉల్లంఘన ఎలా జరిగిందనే విషయాన్ని కోర్టుకు స్పష్టంగా వివరించారు రోహత్గీ.

వాదనలు విన్న సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం.. మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. కాగా, విచారణ అనంతరం ఈ బాటిల్స్‌ తీసుకెళతారా? అని సీజేఐ చంద్రచూడ్‌ను సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ సరదాగా అడిగారు. దీనికి స్పందించిన సీజేఐ ‘ఎస్‌ ప్లీజ్‌’ అని నవ్వుతూ బదులిచ్చారు.

Updated Date - Jan 06 , 2024 | 05:52 PM