Share News

PM Modi: భారత్ అభివృద్ధి చూసి ప్రపంచం నివ్వెరపోతోంది: మోదీ

ABN , Publish Date - Jul 09 , 2024 | 12:29 PM

మాస్కో: భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ రష్యాలో రెండో రోజు మంగళవారం పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్బంగా ప్రవాస భారతీయులనుద్దేశించి మోదీ ప్రసంగించారు. పేదల కోసం 3 కోట్ల ఇళ్లు నిర్మిస్తామని, జీ-20 సదస్సును విజయవంతంగా నిర్వహించామని, భారత దేశం మారుతోందని ప్రపంచమంతా గుర్తించిందని, భారత్ అభివృద్ధి చూసి ప్రపంచం నివ్వెరపోతోందని మోదీ వ్యాఖ్యానించారు.

PM Modi: భారత్ అభివృద్ధి చూసి ప్రపంచం నివ్వెరపోతోంది: మోదీ

మాస్కో: భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) రష్యా (Russia)లో రెండో రోజు మంగళవారం పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్బంగా ప్రవాస (NRI) భారతీయులతో సమావేశం అయ్యారు. వారినుద్దేశించి మోదీ ప్రసంగించారు. పేదల కోసం 3 కోట్ల ఇళ్లు నిర్మిస్తామని, జీ-20 సదస్సును (G-20 Summit) విజయవంతంగా నిర్వహించామని, భారతదేశం మారుతోందని ప్రపంచమంతా గుర్తించిందని, భారత్ అభివృద్ధి చూసి ప్రపంచం నివ్వెరపోతోందని మోదీ వ్యాఖ్యానించారు. డిజిటల్‌ పేమెంట్లలో రికార్డులు సృష్టిస్తున్నామన్నారు. పదేళ్లలో 40 వేల కి.మీ. రైల్వే లైన్లను ఎలక్ట్రిఫికేషన్‌ చేశామని, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి నిర్మించామని పేర్కొన్నారు. అభివృద్ధిలో 140 కోట్ల మంది ప్రజల భాగస్వామ్యం ఉందని ప్రధాని మోదీ తెలిపారు. కాగా ఇవాళ మోదీ, పుతిన్ 22వ భారత్-రష్యా వార్షిక సదస్సులో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షి సంబంధాలు, వాణిజ్యం, ఇంధన, రక్షణ రంగాల్లో సహకారానికి ఉన్న అవకాశాలపై చర్చలు జరపనున్నారు.


Modi-Russia.jpg

రెండు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం సాయంత్రం రష్యాకి చేరుకున్నారు. రష్యా రాజధాని మాస్కోలో ప్రధాని విమానం ల్యాండ్ కాగానే అక్కడి అధికారులు మోదీకి రెడ్ కార్పెట్ వేసి సాదర స్వాగతం తెలిపారు. దాండియా, గర్భా నృత్యాలతో రష్యా అధికారులు ఆయనకు వెల్‌కం చెప్పారు. ఈ పర్యటనలో భారత్, రష్యాల మధ్య పలు ముఖ్యమైన ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. రష్యా ఐదవ తరం ఫైటర్ జెట్ సుఖోయ్ 57కు సంబంధించి ఇద్దరు నేతలు చర్చించనున్నారు. యాంటీ ట్యాంక్ షెల్స్‌ను తయారు చేయడంపై ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది. ప్రధాని మోదీ రష్యా పర్యటనలో రక్షణ, చమురు రంగాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు.


Modi-Russia-Tour.jpg

22వ ద్వైపాక్షిక సదస్సు పేరుతో మోదీ-పుతిన్ భేటీ జరుగుతున్నప్పటికీ.. ఈ సమావేశం ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉండే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నుండి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో పాటు జెలెన్స్‌కీ నుండి నాటో వరకు ప్రతి ఒక్కరూ ఈ సమావేశంపై దృష్టి పెట్టారు. 2025 నాటికి భారత్, రష్యాల మధ్య వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. రష్యా 2025 నాటికి 50 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనుంది.


రక్షణపర అంశాల్లో కీలక చర్చలు..

ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య పలు అంశాలపై చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. వాటిలో ప్రధానంగా ఫైటర్ జెట్ SU-57పై ఒప్పందం. భారతదేశంలో యాంటీ ట్యాంక్ షెల్స్‌ను తయారీ పరిశ్రమకు సంబంధించి ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది. మ్యాంగో ఆర్మర్-పియర్సింగ్ ట్యాంక్ రౌండ్ ఫ్యాక్టరీ డీల్, సైనిక లాజిస్టిక్స్ ఒప్పందంపై చర్చ, ప్రాంతీయ, ప్రపంచ భద్రతకు ప్రాధాన్యత, ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై చర్చ, రక్షణ, చమురు, గ్యాస్‌కు సంబంధించిన అంశాలపై ఇద్దరు నేతలు చర్చించనున్నారు.

Updated Date - Jul 09 , 2024 | 02:43 PM