Share News

PM Modi : వచ్చే ఐదేళ్లూ అవినీతిపై కొరడా..

ABN , Publish Date - May 05 , 2024 | 03:19 AM

దేశంలోని అవినీతిపరుల మాస్కులను ఎన్డీయే ప్రభుత్వం తొలగించివేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.

PM Modi : వచ్చే ఐదేళ్లూ అవినీతిపై కొరడా..

  • అవినీతిపరుల మాస్కులను ఎన్డీయే ప్రభుత్వం తొలగించింది

  • అవినీతి ఊబిలో ఇండియా కూటమి నేతలు

  • పాక్‌ విషయంలో గత కాంగ్రెస్‌ సర్కారు మెతకవైఖరి

  • ఉగ్రదాడుల వేళ ఆ దేశానికి ప్రేమలేఖలు పంపింది: మోదీ

సిసయీ, పలాము(ఝార్ఖండ్‌), మే 4: దేశంలోని అవినీతిపరుల మాస్కులను ఎన్డీయే ప్రభుత్వం తొలగించివేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. అవినీతికి పాల్పడినవారందరూ వచ్చే ఐదేళ్లలో చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అవినీతిపరులకు మద్దతుగా ప్రతిపక్ష ఇండియా కూటమి ర్యాలీలు చేస్తోందని ఎద్దేవా చేశారు. ఝార్ఖండ్‌లోని లోహర్‌దగా, పలాము నియోజకవర్గాల్లో శనివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘అవినీతికి పాల్పడినందుకు ఝార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి(హేమంత్‌ సోరెన్‌) కటకటాలపాలయ్యారు.


అవినీతికి పాల్పడినవారందరూ వచ్చే ఐదేళ్లలో చట్టపరమైన చర్యలు ఎదుర్కొంటారు. పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిన ఇండియా కూటమి నేతలు అవినీతిపరులకు మద్దతుగా ఢిల్లీ, రాంచీలలో సహా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అదే వారి నిజస్వరూపాన్ని బట్టబయలు చేస్తోంది’ అన్నారు. ఉగ్రవాదం విషయంలో పాకిస్థాన్‌ పట్ల గత కాంగ్రెస్‌ ప్రభుత్వం మెతక వైఖరి అవలంభించిందని మోదీ విమర్శించారు. ఈ ఎన్నికల తర్వాత రాహుల్‌ గాంధీ ప్రధానమంత్రి అవ్వాలని పాక్‌ నేతలు కోరుకుంటున్నారని చెప్పారు. ‘గతంలో ఉగ్రవాదులు స్వేచ్ఛగా అమాయకులను చంపేసేవారు.


నాటి ప్రభుత్వాలు పాకిస్థాన్‌కు ప్రేమ లేఖలు రాసేవి. వాటికి స్పందనగా పాకిస్థాన్‌ మరింతమంది ఉగ్రవాదులను పంపేది. కానీ, మీ ఒక్క ఓటు బలంతో నేను ఇక చాలని చెప్పాను. నేటి కొత్త భారతదేశం పత్రాలు ఇవ్వదు. ఇంట్లోకి దూరి కొట్టింది’ అన్నారు. ఇటీవల మిలటరీ సమర్థ చర్యలు పాకిస్థాన్‌ను కోలుకోకుండా చేశాయని, దీంతో అంతర్జాతీయ సాయం కోసం ఆ దేశం వేడుకుంటోందని మోదీ ఎద్దేవా చేశారు. ‘సర్జికల్‌ స్ర్టైక్స్‌, బాలాకోట్‌ దాడి పాకిస్థాన్‌ను వణికించాయి.


దీంతో ఆ దేశం ఏడుస్తూ ప్రపంచమంతా తిరుగుతోంది. కాపాడండి.. కాపాడండి.. అని అరుస్తోంది’ అన్నారు. గిరిజన జిల్లాల వెనుకబాటుకు కాంగ్రెసే కారణమని మోదీ నిందించారు. ఓటు బ్యాంకు కోసం గత కాంగ్రెస్‌ ప్రభుత్వం మావోయిస్టులపై చర్యలు చేపట్టలేదన్నారు. యూపీఏ పాలనలో గిరిజన చిన్నారులు పోషకాహార లోపంతో చనిపోతుంటే ఆహారధాన్యాలు గిడ్డంగుల్లో ముక్కిపోయేవని విమర్శించారు. ఇప్పుడు ఆ రాజకుటుంబం ఏమి చెప్పినా.. పేదలకు ఉచిత రేషన్‌ పంపిణీని భూమిపైనున్న ఏ శక్తీ అడ్డుకోలేదన్నారు. ఇదే మోదీ గ్యారెంటీ అని చెప్పారు.

Updated Date - May 05 , 2024 | 04:38 AM