Zoo Park: జూ నుంచి అదృశ్యమైన హనుమాన్ వానరాలు
ABN , Publish Date - Feb 15 , 2024 | 12:34 PM
స్థానిక వండలూరు జులాజికల్ పార్కు(Zoological Park) నుంచి హనుమాన్ వానరాలు అదృశ్యమయ్యాయి. ఈ పార్కులో 1,500లకు పైగా జంతువులను సంరక్షిస్తున్నారు.
చెన్నై: స్థానిక వండలూరు జులాజికల్ పార్కు(Zoological Park) నుంచి హనుమాన్ వానరాలు అదృశ్యమయ్యాయి. ఈ పార్కులో 1,500లకు పైగా జంతువులను సంరక్షిస్తున్నారు. జంతువుల పరస్పర మార్పిడి పథకం కింద మరో పార్కు నుంచి వండలూరుకు జంతువులు దిగుమతి చేసుకోవడం, ఇక్కడి నుంచి ఎగుమతి చేయడం జరుగుతుంటుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ జూ పార్కు నుంచి 10 హనుమాన్ వానరాలు, 5 గుడ్లగూబలు, జత హిమాలయ గద్దలు, జత ఈజిప్ట్ గద్దలు గత జనవరిలో దిగుమతి అయ్యాయి. పార్కు ఆసుపత్రి సమీపంలో ప్రత్యేక బోనులో ఉంచిన రెండు హనుమాన్ వానరాలు మంగళవారం బోను నుంచి తప్పించుకొని అడవిలోకి వెళ్లాయి. సిబ్బంది వీటి కోసం గాలిస్తున్నారు.