Share News

India vs Srilanka: భారత్‌పై మ్యా్చ్‌లో ఒకే ఓవర్‌లో చేతులు మార్చి బౌలింగ్ చేసిన శ్రీలంక స్పిన్నర్.. ఐసీసీ రూల్స్ ఏం చెబుతున్నాయి?

ABN , Publish Date - Jul 28 , 2024 | 09:06 AM

భారత్‌-శ్రీలంక జట్ల మధ్య పల్లెకెలెలో తొలి టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ జట్టు 43 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక స్పిన్నర్ కమిందు మెండిస్ ఒకే ఓవర్‌లో తన రెండు చేతులతో బౌలింగ్ చేశాడు.

India vs Srilanka: భారత్‌పై మ్యా్చ్‌లో ఒకే ఓవర్‌లో చేతులు మార్చి బౌలింగ్ చేసిన శ్రీలంక స్పిన్నర్.. ఐసీసీ రూల్స్ ఏం చెబుతున్నాయి?
India vs Sri Lanka

భారత్‌-శ్రీలంక జట్ల మధ్య పల్లెకెలెలో తొలి టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ జట్టు 43 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక స్పిన్నర్ కమిందు మెండిస్ ఒకే ఓవర్‌లో తన రెండు చేతులతో బౌలింగ్ చేశాడు. ఈ దృశ్యం క్రికెట్ నిపుణులతో పాటు క్రికెట్ అభిమానులను సైతం ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది. సూర్యకుమార్ యాదవ్‌కు ఎడమ చేతితో బౌలింగ్ చేసిన మెండిస్.. లెఫ్ట్ హ్యాండర్ అయిన రిషబ్ పంత్‌కు చేయి మార్చి కుడి చేతితో బౌలింగ్ చేశాడు. అతడి ప్రతిభ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఏదో సరదాకైతే వేయవచ్చు కానీ ఇలా అంతర్జాతీయ మ్యాచ్‌లో చేతులు మార్చి బౌలింగ్ చేయడం చూసి వారెవా అని నోరెళ్లబెట్టారు.


అయితే ఇలా ఒకే ఓవర్‌లో చేతులు మార్చి బౌలింగ్ చేయడంపై ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయనేది ఆసక్తికరంగా మారింది. ఐసీసీ రూల్ బుక్‌లోని

21.1.1 ప్రకారం.. బౌలర్ కుడి చేతితో బౌలింగ్ చేయాలనుకుంటున్నాడా లేక ఎడమ చేతితో బౌలింగ్ చేయాలనుకుంటున్నాడా అనే విషయాన్ని అంపైర్‌కి చెప్పి నిర్ధారించుకోవాలి. ఇక ఓవర్ ది వికెటా లేక రౌండ్ ది వికెటా అనే అనే విషయాన్ని అంపైర్‌కి బౌలర్ చెప్పాలి. ఆ విషయాలను బ్యాట్స్‌మెన్‌కు అంపైర్ తెలియజేస్తాడు. అయితే బౌలర్‌ చేతిని మార్చుకున్న విషయాన్ని అంపైర్‌కి తెలియజేయకున్నా.. నిర్ధారించుకోకున్నా ఆ బాల్‌ను నో బాల్‌గా ప్రకటిస్తారు.


గంభీర్ నేతృత్వంలో తొలి విజయం..

కొత్త కోచ్‌.. కొత్త కెప్టెన్‌ ఆధ్వర్యంలో బరిలోకి దిగిన టీమిండియా శ్రీలంక పర్యటనను విజయంతో ఆరంభించింది. టాపార్డర్‌లో సూర్యకుమార్‌ (58), పంత్‌ (49), జైస్వాల్‌ (40), గిల్‌ (34) లంక బౌలర్లను చెడుగుడు ఆడేయగా.. ఆ తర్వాత భారత బౌలర్లు కీలక సమయంలో చెలరేగి ఆతిథ్య జట్టును కట్టడి చేశారు. దీంతో శనివారం జరిగిన తొలి టీ20లో 43 రన్స్‌ తేడాతో ఘనవిజయం సాధించింది. అలాగే మూడు టీ20ల సిరీ్‌సలో 1-0తో ఆధిక్యం అందుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 213 పరుగులు చేసింది.

పేసర్‌ పథిరనకు నాలుగు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో శ్రీలంక 19.2 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు నిస్సాంక (79), కుశాల్‌ మెండిస్‌ (45) మెరుపు ఆరంభంతో తొలి వికెట్‌కు 84 పరుగులు జోడించారు. నిస్సాంక క్రీజులో ఉన్నంత సేపు లంక విజయంపై ధీమాతోనే ఉంది. 14 ఓవర్లలో 140 పరుగులు సాధించిన వేళ.. నిస్సాంకను స్పిన్నర్‌ అక్షర్‌ అవుట్‌ చేయడంతో ఇక కోలుకోలేక పోయింది. భారత బౌలర్లు ఒక్కసారిగా పట్టు బిగించడంతో చివరి 9 వికెట్లు 30 పరుగుల వ్యవధిలోనే నేలకూలాయి. పరాగ్‌ ఐదు పరుగులకే మూడు వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్‌, అక్షర్‌ రెండేసి వికెట్లు సాధించారు. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా సూర్యకుమార్‌ నిలిచాడు.

Updated Date - Jul 28 , 2024 | 09:12 AM