Share News

GramPanchath: స్థానికానికి రిజర్వేషన్ల సెగ..

ABN , Publish Date - May 19 , 2024 | 04:13 AM

రాష్ట్రంలో రాజకీయ రిజర్వేషన్ల అగ్గి రాజుకుంది. స్థానిక సంస్థల్లో ఏ సామాజికవర్గానికి ఎంత శాతం రిజర్వేషన్‌ కేటాయిస్తారన్న చర్చ మొదలైంది. మొత్తంగా అన్ని కులాలకు కలిపి 50 శాతం రిజర్వేషన్లు మాత్రమే ఉండగా.. ఇందులోనే ఎస్సీలు, ఎస్టీలకు రాజ్యాంగబద్ధ విధానంలో జనాభా దామాషా ప్రకారం కల్పించాల్సి ఉంటుంది. మిగిలిన శాతాన్ని బీసీలకు కేటాయించాల్సి ఉంది. దీంతో బీసీలకు తక్కువ శాతం దక్కుతోందన్న అభిప్రాయాలున్నాయి.

GramPanchath: స్థానికానికి రిజర్వేషన్ల సెగ..

  • జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలంటున్న బీసీలు

  • మొత్తం రిజర్వేషన్లు 50ు దాటొద్దని సుప్రీం ఆదేశాలు.. ఎస్సీ, ఎస్టీలకు పోను బీసీలకు ఎంత శాతమనే ప్రశ్నలు

  • పంచాయతీరాజ్‌ చట్టంలో మార్పులు చేసిన గత సర్కార్‌.. ఎలా వెళ్దామనే యోచనలో ప్రస్తుత ప్రభుత్వం

  • జూన్‌ చివర్లో ఎన్నికలంటే కులగణన పూర్తవుతుందా?.. ఒకవేళ అయినా రిజర్వేషన్లు 50ు మించితే మరో చిక్కు

హైదరాబాద్‌, మే 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రాజకీయ రిజర్వేషన్ల అగ్గి రాజుకుంది. స్థానిక సంస్థల్లో ఏ సామాజికవర్గానికి ఎంత శాతం రిజర్వేషన్‌ కేటాయిస్తారన్న చర్చ మొదలైంది. మొత్తంగా అన్ని కులాలకు కలిపి 50 శాతం రిజర్వేషన్లు మాత్రమే ఉండగా.. ఇందులోనే ఎస్సీలు, ఎస్టీలకు రాజ్యాంగబద్ధ విధానంలో జనాభా దామాషా ప్రకారం కల్పించాల్సి ఉంటుంది. మిగిలిన శాతాన్ని బీసీలకు కేటాయించాల్సి ఉంది. దీంతో బీసీలకు తక్కువ శాతం దక్కుతోందన్న అభిప్రాయాలున్నాయి. వాస్తవానికి బీసీలకు జనాభా దామాషా ప్రకారం రాజకీయంగా రిజర్వేషన్లు కేటాయించాలనే డిమాండ్‌ ఏళ్ల తరబడి ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఈసారి నిర్వహించబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల విషయం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లను వర్తింపజేయాలా? లేక కులగణన చేపట్టి ఆ వివరాలు తేలిన తరువాత ఎన్నికలు నిర్వహించాలా? అని సర్కారు యోచిస్తోంది. కానీ, వచ్చే జూన్‌లోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. అయితే ఎన్నికలు నిర్వహించాలంటే.. ముందుగా బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయాల్సి ఉంది. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లను కల్పిస్తున్నారు. బీసీలకు మాత్రం ఆయా రాష్ట్రాలు వాటి విచక్షణ మేరకు రిజర్వేషన్ల శాతం పరిధి మించకుండా కేటాయిస్తూ ఎన్నికలు నిర్వహిస్తున్నాయి. బీసీలకు కూడా జనాభా దామాషా మేరకు రిజర్వేషన్లను పెంచాలనే డిమాండ్‌ బలంగా ఉన్నా.. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయి.


ఓబీసీ రిజర్వేషన్లపై కర్ణాటకకు చెందిన కేఈ కృష్ణమూర్తి, మహారాష్ట్రకు చెందిన వికా్‌సరావు గవాళి కేసులో సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. గత బీఆర్‌ఎస్‌ సర్కారు.. బీసీల రిజర్వేషన్‌ను 23 శాతానికి తగ్గించి ఎన్నికలు జరిపింది. ఇది వివాదాస్పదం కావడంతోపాటు హైకోర్టు కూడా తప్పుబట్టింది. ఈ నేపథ్యంలో ఈసారి కచ్చితంగా బీసీల రిజర్వేషన్‌ అంశాన్ని తేల్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం అమల్లో ఉన్న జనాభా దామాషా విధానమైతే.. ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగా దక్కాల్సిన మేరకు రిజర్వేషన్‌ వర్తిస్తుంది. బీసీలవిషయంలో సమస్య తలెత్తుతోంది. ప్రస్తుత నిబంధన ప్రకారం.. రాష్ట్రంలోని గ్రామాలు, వార్డులు, మండలాల వారీగా ఎస్సీ, ఎస్టీ జనాభాను లెక్కించి దాని ప్రకారం వారికి రిజర్వేషన్‌ కేటాయిస్తారు. అయితే ఆయా గ్రామాలు, మండలాల్లో ఎస్సీ, ఎస్టీలు క్కువగా ఉండి, బీసీలు తక్కువగా ఉంటే.. ఆ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీలకు పోను మిగిలిన రిజర్వేషన్‌లో బీసీలకు కేటాయించాల్సి వస్తోంది. దీంతో బీసీలకు రాజకీయంగా ప్రాధాన్యం దక్కడం లేదు. ఈ విధానం కోసమైతే ఓటర్ల జాబితాను పరిశీలించి, వివరాలు సేకరిస్తే సరిపోతుంది. ఇందుకోసం ఇప్పటికే రాష్ట్రంలోని డాక్టర్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌ ఆధ్వర్యంలోని బీసీ డెడికేటెడ్‌ కమిషన్‌ కసరత్తు ప్రారంభించింది. ఎన్నికల కోడ్‌ తొలగిపోగానే ఈ రిపోర్టును రూపొందించేందుకు వీలుగా వివరాలు సేకరించేందుకు పంచాయతీరాజ్‌ శాఖ అధికారులకు ప్రశ్నావళి కూడా అందజేసింది. అదే సమయంలో తాజా ఓటర్ల జాబితాను కూడా పరిశీలిస్తోంది. అనంతరం ఆయా కులాల వారీగా రిజర్వేషన్‌ను నిర్ణయించే అవకాశం ఉంది. కానీ, బీసీల రిజర్వేషన్‌ మాత్రం తేలడంలేదు. ఇలా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన కులగణనను పూర్తిచేసిన తరువాత వాటి ఆధారంగా రిజర్వేషన్లను ఖరారు చేయాలంటే అందుకు చాలా సమయం పడుతుంది. పైగా కులగణనలో బీసీలు అధికంగా ఉన్నారని తేలితే.. అప్పడు కూడా వారికి కేటాయించే రిజర్వేషన్లలో మళ్లీ ఈ 50 శాతం సమస్యే తలెత్తుతుంది.


పంచాయతీరాజ్‌ చట్టంలో సవరణలు చేసినా..

బీఆర్‌ఎస్‌ సర్కారు 2018లో పంచాయతీరాజ్‌ చట్టంలో పలు సవరణలు చేసింది. అందులో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 23 శాతానికి తగ్గించింది. ఆ విధానంలోనే 2019లో స్థానిక ఎన్నికలను నిర్వహించింది. అయితే బీసీలకు రిజర్వేషన్లను తగ్గించడంపై రాష్ట్ర హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిని విచారించిన హైకోర్టు రిజర్వేషన్లను తగ్గించి ఎన్నికలు జరపాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇది గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పూర్తిగా ఉల్లంఘించడమేనని అభిప్రాయపడింది. అంతేకాకుండా రిజర్వేషన్లను పాటించని ఎన్నికలను ఎందుకు రద్దు చేయకూడదని కూడా ప్రశ్నించింది. దీంతో.. 2024లో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సుప్రీం మార్గదర్శకాలను అమలుచేస్తామని కోర్టుకు ప్రభుత్వం వివరణ ఇచ్చుకుంది. అయితే సుప్రీం మార్గదర్శకాల ప్రకారం చేయాలంటే అందుకు రాష్ట్రంలోని బీసీల జనాభాను తేల్చాలి, బీసీ గణన జరిపి జనాభాలో వారి శాతాన్ని ఖరారు చేయాలి. కానీ, గత ప్రభుత్వం అందుకు చర్యలు తీసుకోలేదు. దీంతో ఇప్పుడు ఈ అంశమే ప్రస్తుత ప్రభుత్వానికి సమస్యగా మారింది. అయితే 2018లో సవరణలు చేసిన పంచాయతీరాజ్‌ చట్టంలోనే మరోసారి కొన్ని సవరణలు చేస్తే బీసీల రిజర్వేషన్‌లో మార్పులు చేసేందుకు అవకాశం ఉంది. అలా చేయాలంటే ముందుగా రాష్ట్రంలో బీసీ జనాభా ఎంత, రాజకీయ ప్రాతినిధ్యం, వెనుకబాటుతనానికి కారణాలేంటన్న వివరాలను పరిశీలించాల్సి ఉంది. ఆ ప్రక్రియ పూర్తయితేనే సవరణలు చేసి రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు అవకాశం ఉంటుంది. అయితే అలా చట్టాన్ని మార్చినా రిజర్వేషన్లను పెంచే అధికారం రాష్ట్రానికి లేదు.


రాష్ట్రాలకు లేని రిజర్వేషన్ల పెంపు అధికారం

రిజర్వేషన్ల పెంపు అంశం రాష్ట్రాల పరిధిలో లేదు. ప్రస్తుతం ఉన్న 50 శాతం రిజర్వేషన్లను కులాల వారీగా పెంచాలంటే భారత ప్రభుత్వం రాజ్యాంగంలో సవరణలు చేయాల్సి ఉంది. పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లు పెట్టి.. దానిని ఆమోదిస్తేనే రిజర్వేషన్ల పెంపునకు అవకాశం ఉంటుంది. కానీ, దేశంలోని అన్ని రాష్ట్రాలకు వర్తింపజేయాల్సి ఉంటేనే కేంద్రం అందుకు అంగీకరిస్తుంది. కాగా, ఒడిసా రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎస్సీ, ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లను కల్పించి స్థానిక ఎన్నికలను నిర్వహించింది. ఒకవేళ దాని ప్రకారం తెలంగాణలోనూ ఎన్నిక నిర్వహించేందుకు అవకాశం ఉన్నా.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తామని గతేడాది అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డిలో నిర్వహించిన బీసీ డిక్లరేషన్‌లో కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. దీంతో బీసీల రిజర్వేషన్లను తేల్చండా ఎన్నికలు నిర్వహించడం కాంగ్రె్‌సకు ఇబ్బందిగా మారుతుంది. కాగా, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గత ప్రభుత్వ హయాంలోని డాక్టర్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌ నేతృత్వంలోని బీసీ కమిషన్‌నే పూర్తిస్థాయి డెడికేటెడ్‌ కమిషన్‌గా ఏర్పాటుచేసింది. ఈ కమిషన్‌ గతంలో తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాల్లో పర్యటించి.. గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన తీర్పుల అంశాలపై పరిశీలన జరిపింది. ఆయా రాష్ట్రాల్లో అమలు చేస్తున్న బీసీ రిజర్వేషన్లు సహా పలు విషయాలపై అధ్యయనం చేసింది. కానీ, గత ప్రభుత్వం పూర్తిస్థాయి సహకారం అందించకపోవడంతో నివేదిక ఇవ్వలేకపోయింది. ప్రస్తుత ం కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైన కొద్ది రోజుల్లోనే రాష్ట్రంలో కులగణన నిర్వహించేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసింది. అయితే కులగణన, స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్‌ అంశాలు రెండూ వేరువేరుగా ఉన్నాయి. దీంతో ముందుగా స్థానిక ఎన్ని కల్లో బీసీల రిజర్వేషన్‌ను తేల్చేందుకు అవసరమైన కసరత్తును డెడికేటెడ్‌ కమిషన్‌ ప్రారంభించింది. పార్లమెంటు ఎన్నికల కోడ్‌ అయిపోగానే క్షేత్రస్థాయిలో బీసీలకు సంబంధించి అన్ని వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.


ఆశావహుల్లో ఆందోళన..

స్థానిక సమరంలో రిజర్వేషన్ల వేడి రోజురోజుకు పెరుగుతుండగా.. తమకు పోటీ చేసే అవకాశం వస్తుందో, రాదోనని ఆశావహుల్లో ఆందోళన మొదలైంది. ఎన్నికల సమయంలో రిజర్వేషన్‌లో మార్పులు జరిగి ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో ప్రతిసారీ ఎవరో ఒకరికి అవకాశం వస్తోంది. కానీ, ఈసారి బీసీలకు రిజర్వేషన్‌ అంశం తేలకపోవడంతో.. క్షేత్రస్థాయిలో ఆయా పార్టీల కోసం పనిచేసిన వారికి సర్పంచ్‌గా, ఎంపీటీసీగా పోటీచేసేందుకు అవకాశం వస్తుందో లేదోననే చర్చ జరుగుతోంది.

Updated Date - May 19 , 2024 | 04:13 AM