Share News

Peddapalli: ఏడు నెలల చిన్నారి మృతి.. డాక్టర్‌పై కత్తితో దాడి

ABN , Publish Date - Sep 13 , 2024 | 04:11 AM

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఓ ఆస్పత్రిలో వైద్యుడిపై కత్తితో దాడి జరిగింది. ఏడు నెలల చిన్నారి చికిత్స పొందుతూ మృతిచెందడంతో..

Peddapalli: ఏడు నెలల చిన్నారి మృతి.. డాక్టర్‌పై కత్తితో దాడి

  • వైద్యం వికటించడంతోనే..పాప చనిపోయిందని ఆరోపణలు

  • సీపీకి ఐఎంఏ ఫిర్యాదు

  • నేడు పెద్దపల్లి, కరీంనగర్‌లో..ఓపీ సేవలు బంద్‌

పెద్దపల్లిటౌన్‌, సెప్టెంబరు 12: పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఓ ఆస్పత్రిలో వైద్యుడిపై కత్తితో దాడి జరిగింది. ఏడు నెలల చిన్నారి చికిత్స పొందుతూ మృతిచెందడంతో.. వైద్యం వికటించడమే ఆమె మరణానికి కారణమంటూ బంధువులు డాక్టర్‌పై ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. పెద్దపల్లి పట్టణంలోని చింతలవాడకు చెందిన ఖదీర్‌, రేష్మ దంపతుల ఏడు నెలల పాప మూడ్రోజుల క్రితం అనారోగ్యానికి గురవ్వడంతో.. స్థానిక సిద్ధార్థ ఆస్పత్రికి తీసుకువచ్చారు. గురువారం పరిస్థితి విషమించడంతో ఆ చిన్నారి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. డాక్టర్‌ సూచన మేరకు చిన్నారిని తండ్రి ఖదీర్‌ అంబులెన్స్‌లో కరీంనగర్‌ తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది.


మందులు ఎక్కువ మోతాదులో ఇవ్వడం వల్లే చిన్నారి మృతిచెందిందంటూ ఖదీర్‌ కుటుంబ సభ్యులు, స్థానికులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఆస్పత్రిలో ఉన్న అద్దాలు, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. డాక్టర్‌పై కత్తితో దాడి చేశారు. బయటకు వచ్చిన డాక్టర్‌.. రాజీవ్‌ రహదారి వెంట పరుగులు తీశారు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి ఎదుట బైఠాయించారు. ఆ ప్రాంతంలో సూమారు నాలుగు గంటల పాటు ఉద్రిక్త వాతవరణం నెలకొంది. పోలీసులు, స్థానికులు నచ్చజెప్పే ప్రయత్రం చేసినా.. ఆందోళనకారులు వినలేదు. బాధిత కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.


విషయం తెలుసుకున్న రామగుండం సీపీ శ్రీనివాస్‌, డీసీపీ చేతన, ఏసీపీ కృష్ణ, ఇన్‌స్పెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ఘటనా అక్కడికి చేరుకొని, వివాదాన్ని సద్దుమణిగేలా చేశారు. డాక్టర్‌పై దాడి చేయడంపై ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు రమాకాంత్‌ కలెక్టర్‌ శ్రీకోయహర్షకు ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకునే వరకు పెద్దపల్లిలో వైద్య సేవలు నిలిపివేస్తామని హెచ్చరించారు. సీపీ శ్రీనివా్‌సకు ఫిర్యాదు చేశారు. హత్యాయత్నం కింద కేసు నమోదు చేస్తామని పోలీసులు హామీ ఇచ్చినట్లు ఐఎంఏ సభ్యులు తెలిపారు. కాగా.. కరీంనగర్‌లో కూడా శుక్రవారం ఓపీ సేవలను నిలిపివేయనున్నట్లు ఐఎంఏ ప్రకటించింది.

Updated Date - Sep 13 , 2024 | 04:11 AM