Share News

Etela Rajender: ఢిల్లీకి డబ్బు పంపేందుకే మూసీ ప్రక్షాళన: ఈటల

ABN , Publish Date - Oct 24 , 2024 | 04:05 AM

ఢిల్లీకి డబ్బు సంచులు మోసేందుకే సీఎం రేవంత్‌రెడ్డి మూసీ ప్రక్షాళన పేరుతో నాటకాలు ఆడుతున్నారని బీజేపీ నేత, ఎంపీ ఈటల రాజేందర్‌ ఆరోపించారు.

Etela Rajender: ఢిల్లీకి డబ్బు పంపేందుకే మూసీ ప్రక్షాళన: ఈటల

దిల్‌సుఖ్‌నగర్‌/చాదర్‌ఘాట్‌, రామంతాపూర్‌, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): ఢిల్లీకి డబ్బు సంచులు మోసేందుకే సీఎం రేవంత్‌రెడ్డి మూసీ ప్రక్షాళన పేరుతో నాటకాలు ఆడుతున్నారని బీజేపీ నేత, ఎంపీ ఈటల రాజేందర్‌ ఆరోపించారు. మంత్రులను సియోల్‌, న్యూయార్క్‌ నగరాలకు పంపడం కాదని మూసీ పరీవాహక ప్రాంతాల్లోని కాలనీలకి పంపి ప్రజల కష్టాలు తెలుసుకోవాలంటూ ముఖ్యమంత్రిపై ధ్వజమెత్తారు. ఈ మేరకు రామాంతపూర్‌, చైతన్యపురి ప్రాంతాల్లో మూసీ పరీవాహక ప్రాంతంలో ఉన్న కాలనీల్లో బుధవారం ఆయన పర్యటించి అక్కడి ప్రజలతో మాట్లాడారు.


ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ మూసీ పునరుజ్జీవం పేరిట సీఎం రేవంత్‌ రెడ్డి చేస్తున్న పనుల వల్ల ప్రజలకు కంటి మీద కునుకు ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎంవి అనాలోచిత నిర్ణయాలు, అహంకారపు మాటలని మండిపడ్డారు. అసలు మూసీ నదిలో ఏం చేయదలచుకున్నారో ప్రభుత్వం ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మూసీ ప్రక్షాళన అంశంలో ప్రభుత్వ తీరుకు నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద శుక్రవారం జరిగే ధర్నాకు బాధితులు తరలిరావాలని ఈటల పిలుపునిచ్చారు.

Updated Date - Oct 24 , 2024 | 04:05 AM